iDreamPost

Bus Strike: తెలంగాణలో రేపటి నుండి బస్సులు బంద్ అంటూ వార్తలు.. సజ్జనార్ క్లారిటీ!

  • Published Jan 04, 2024 | 2:56 PMUpdated Jan 04, 2024 | 2:56 PM

డిసెంబర్ 5 అనగా శుక్రవారం నుంచి తెలంగాణలో బస్సులు బందు అంటూ ప్రచారం జరుగుతోది. తాజాగా దీనిపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ క్లారిటీ ఇచ్చారు. ఆ వివరాలు..

డిసెంబర్ 5 అనగా శుక్రవారం నుంచి తెలంగాణలో బస్సులు బందు అంటూ ప్రచారం జరుగుతోది. తాజాగా దీనిపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ క్లారిటీ ఇచ్చారు. ఆ వివరాలు..

  • Published Jan 04, 2024 | 2:56 PMUpdated Jan 04, 2024 | 2:56 PM
Bus Strike: తెలంగాణలో రేపటి నుండి బస్సులు బంద్ అంటూ వార్తలు.. సజ్జనార్ క్లారిటీ!

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఒకటైన మహాలక్ష్మి పథకంలో భాగంగా.. మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తోన్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డీనరి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. దాంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య భారీగా పెరుగుతోంది. ముఖ్యంగా ఎక్స్ ప్రెస్ బస్సులు, గ్రామాలకు వెళ్లే చివరి బస్సుల్లో రద్దీ మరీ ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో బస్సుల యజమానులు ఆందోళనకు గురవుతున్నారు.

రద్దీ పెరగడం వల్ల బస్సులు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయని తెలిపారు. కేఎంపీఎల్ కూడా రావడం లేదని, అందుకే సమ్మెకు వెళ్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆర్ఎంకు నోటీసులిచ్చారు. దాంతో జనవరి 5 అనగా శుక్రవారం నుంచి.. రాష్ట్రంలో బస్సులు బందంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా వీటిపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ క్లారిటీ ఇచ్చారు. ఆ వివరాలు..

ప్రైవేటు బస్సు యజమానులు ఇచ్చిన సమ్మె నోటీసుల నేపథ్యంలో టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హైదరాబాద్‌ బస్ భవన్‌లో గురువారం అద్దె బస్సు ఓనర్లతో జరిపిన చర్చలు ఫలించాయి. వారం రోజుల్లోగా వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు. అద్దె బస్సు ఓనర్ల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ఒక కమిటి వేస్తామని సజ్జనార్ వెల్లడించారు. అంతేకాక రేపటి నుంచి ఎప్పటిలాగే అద్దె బస్సులు నడుస్తాయన్నారు. సంక్రాంతికి కూడా ఫ్రీ బస్ సర్వీస్ ఉంటుందని ఈ సందర్భంగా సజ్జనార్ స్పష్టం చేశారు. పండుగ రద్దీ మేరకు స్పెషల్ బస్సులను కూడా  నడుపుతామన్నారు. సజ్జనార్ వ్యాఖ్యలతో రేపటి నుంచి బస్సులు బంద్ అన్న వార్తలకు చెక్ పడింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 2,700 అద్దె బస్సులు నడుస్తున్నాయి.

తెలంగాణలో ‘మహాలక్ష్మి’ పథకం విజయవంతంగా అమలవుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ స్కీం కింద ఇప్పటివరకూ 6.50 కోట్ల మంది మహిళలు ప్రయాణాలు సాగించారని వెల్లడించారు. ఉచిత ప్రయాణం ప్రకటించిన తర్వాత.. ప్రతి రోజూ 27 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారని.. దాదాపు రూ.10 కోట్ల విలువైన జీరో టికెట్లు మంజూరు చేశామని అధికారులు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. ఆర్టీసీ సంస్థ బలోపేతానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటామని, ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై ఆలోచిస్తున్నట్లు తెలిపారు. లాజిస్టిక్స్, కమర్షియల్, తదితర టికెటేతర ఆదాయంపైనా దృష్టి సారిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

సంక్రాంతికి ప్రత్యేక బస్సులు

మరోవైపు, సంక్రాంతి పండుగ సందర్భంగా రద్దీని దృష్టిలో పెట్టుకుని.. హైదరాబాద్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4,484 ప్రత్యేక బస్సులను నడిపేలా టీఎస్ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ నెల 6 నుంచి 15వ తేదీ వరకూ హైదరాబాద్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాలైన ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రలకు కూడా ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఇప్పటికే 626 బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్లకు అవకాశం కల్పించినట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. అలానే సంక్రాతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి నుంచి ఏపీకి రద్దీ దృష్ట్యా 1,450 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు పేర్కొన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి