బంగ్లాదేశ్‌కు టీమిండియా భయపడిందా? ఈ మార్పు గమనించారా?

IND vs BAN, Rohit Sharma, Hasan Mahmud: టీమిండియా.. బంగ్లాదేశ్‌కు భయపడిందా? ఈ ప్రశ్న ప్రస్తుతం భారత క్రికెట్‌ అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. పసికూన బంగ్లాకు మన టీమ్‌ భయపడటం ఏంటి? అనే కామెంట్లు వినిపిస్తున్నా.. ఆ అనుమానాలకు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

IND vs BAN, Rohit Sharma, Hasan Mahmud: టీమిండియా.. బంగ్లాదేశ్‌కు భయపడిందా? ఈ ప్రశ్న ప్రస్తుతం భారత క్రికెట్‌ అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. పసికూన బంగ్లాకు మన టీమ్‌ భయపడటం ఏంటి? అనే కామెంట్లు వినిపిస్తున్నా.. ఆ అనుమానాలకు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

బంగ్లాదేశ్‌తో చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో ప్రారంభమైన తొలి టెస్ట్‌లో టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగింది. టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ షాంటో తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాడు. దాంతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు బంగ్లా బౌలర్‌ హసన్‌ మహమూద్‌ ఆరంభంలోనే దిమ్మతిరిగే షాకిచ్చాడు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(6), శుబ్‌మన్‌ గిల్‌(0), విరాట్‌ కోహ్లీ(6)లను వెంటవెంటనే పెవిలియన్‌కు పంపించాడు. సరైన లైన్‌ అండ్‌ లెంత్‌ బాల్‌కు రోహిత్‌ శర్మ, డౌన్‌ ది లెగ్‌సైడ్‌ బాల్‌కు శుబ్‌మన్‌ గిల్‌, అవుట్‌ సైడ్‌ ది ఆఫ్‌ సైడ్‌ బాల్‌కు విరాట్‌ కోహ్లీ తన వికెట్లను సమర్పించుకున్నారు. యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌, రిషభ్‌ పంత్‌ లంచ్‌ వరకు మరో వికెట్‌ పడకుండా అడ్డుకున్నా.. లంచ్‌ తర్వాత పంత్‌ కూడా అవుట్‌ అయ్యాడు. అతన్ని కూడా హసన్‌ అవుట్‌ చేయడం గమనార్హం.

అదేంటి.. చెన్నై అంటే స్పిన్‌ పిచ్‌ కదా.. మన స్టార్‌ బ్యాటర్లు ఏంటి మూడు టెస్టు మ్యాచ్‌లు కూడా ఆడని యువ బౌలర్‌ ముందు చేతులెత్తేశారు? అని ఆలోచిస్తున్నారా? ఇక్కడే ఒక ట్విస్ట్‌ ఉంది. స్పిన్‌కు అనుకూలంగా ఉండే చెపాక్‌ పిచ్‌ను పేస్‌ ఫ్రెండ్లీగా మార్చి ఇవ్వాలని టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కోరినట్లు గతంలో వార్తలొచ్చాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్‌ బౌలింగ్ చూస్తుంటే.. అదే నిజమని అనిపిస్తోంది. ఇండియాలోనే స్పిన్‌ బౌలింగ్‌కు స్వర్గధామం లాంటి పిచ్‌ను.. ఎందుకు పేస్‌ పిచ్‌గా మార్చారు? రోహిత్‌ శర్మ ఎందుకు అలా కావాలని కోరాడు? అంటే.. దాని వెనుక భయం ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

టీమిండియాతో టెస్ట్‌ సిరీస్‌కి వచ్చే ముందు.. బంగ్లాదేశ్‌ జట్టు పాకిస్థాన్‌తో రెండు టెస్టులు ఆడింది. రెండూ గెలిచి.. పాక్‌పై సిరీస్‌ను వైట్‌వాష్‌ చేసింది. ఇప్పుడు మన దేశంలో మనపై కూడా అలాగే చెలరేగుతుందేమో అని రోహిత్‌ భయపడి ఉంటాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. షకీబ్‌ అల్‌ హసన్‌, మెహదీ హసన్‌తో బంగ్లా స్పిన్‌ బౌలింగ్‌ ఎటాక్‌ పటిష్టంగా ఉంది. పైగా విరాట్‌ కోహ్లీతో పాటు మరికొంత మంది టీమిండియా బ్యాటర్లు స్పిన్‌ ఆడటంలో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చెన్నై పిచ్‌ స్పిన్‌కు అనుకూలంగా ఉంటే.. బంగ్లా డేంజర్‌గా మారే ప్రమాదం ఉందని.. పిచ్‌ను పేస్‌ బౌలింగ్‌ను అనుకూలంగా ఉండేలా మార్చారా అని క్రికెట్‌ వర్గాల్లో సందేహాలు తలెత్తుతున్నాయి.

అదేంటి.. బంగ్లా దగ్గర స్పిన్నర్లు ఉంటే.. మన టీమ్‌లో కూడా రవిచంద్రన్‌ అశ్విన్‌, కుల్దీప్‌ యాదవ్‌, జడేజా లాంటి టాప్‌ స్పిన్నర్లు ఉన్నారు కదా అని అనుకోవచ్చు. కానీ, బంగ్లా బ్యాటర్లు స్పిన్‌ను సమర్థవంతంగా ఆడాతారేమో? లేక మన స్పిన్నర్లపై టీమ్‌మేనేజ్‌మెంట్‌కు నమ్మకం లేదేమో అని కూడా భావించవచ్చు. పేస్‌ బౌలింగ్‌తో అయితే బుమ్రా, సిరాజ్‌తో నెట్టుకొరావొచ్చని కెప్టెన్‌ రోహిత్‌ కూడా భావించి ఉంటాడని అంతా అనుకుంటున్నారు. పిచ్‌ పేస్‌ బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటే.. టీమిండియా బ్యాటింగ్‌ లైనప్‌ను బంగ్లా పేసర్లు పెద్దగా ఇబ్బంది పెట్టరేమో అని రోహిత్‌ శర్మ అనుకొని ఉంటాడు.. కానీ, అవుట్‌ ఆఫ్‌ ది సబ్జెక్ట్‌లా.. హసన్‌ మహమూద్‌ అనే యువ పేసర్‌.. పిచ్‌ కండీషన్స్‌ను ఉపయోగించుకొని.. టీమిండియా టాపార్డర్‌ను కుప్పకూల్చాడు. మరి రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా ఎలా ఆడుతుంది? భారత పేసర్లు బంగ్లాను ఎలా నిలువరిస్తారనే దానిపైనే మ్యాచ్‌ ఫలితం ఆధారపడి ఉంది. మరీ బంగ్లాదేశ్‌ లాంటి చిన్నటీమ్‌కు కూడా టీమిండియా భయపడుతుందా అంటే.. కాస్త విచిత్రంగా ఉన్నా.. తొలి టెస్ట్‌ లంచ్‌ వరకు గేమ్‌, పిచ్‌ కండీషన్‌ చూస్తే అలాంటి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments