SNP
SNP
ప్రస్తుతం క్రికెట్ అభిమానుల ఫోకస్ మొత్తం వన్డే వరల్డ్ కప్పైనే ఉంది. క్రికెట్ ప్రపంచానికి అసలు సిసలైన వన్డే క్రికెట్ మజాను అందించే.. వన్డే వరల్డ్ కప్ 2023 ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే అన్ని జట్లు వామప్ మ్యాచ్లతో బీజీగా ఉన్నాయి. అక్టోబర్ 5 నుంచి అహ్మాదాబాద్ వేదికగా ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచ్తో వరల్డ్ కప్ మహా సంగ్రామానికి టాస్ పడనుంది. అయితే.. ఈ వరల్డ్ కప్లో టీమిండియా విజయావకాశాలు ఎలా ఉన్నాయి? రోహిత్ సేన బలాలేంటి? బలహీనతలేంటి? అనే విషయాలపై ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్ సీ.వెంకటేశ్ సమగ్రంగా విశ్లేషించారు. టీమిండియా విజయావకాశాలపై ఆయన స్పందిస్తూ.. ఈ సారి కప్పు గెలిచే అవకాశాలు భారత్కు మెండుగా ఉన్నాయని అన్నారు. అయితే.. ఒక ప్రధాన సమస్య కూడా టీమిండియాలో ఉందని అది అధిగమిస్తేనే టీమిండియా మూడో వరల్డ్ కప్ను ముద్దాడుతుంది అన్నారు. మరీ టీమిండియాకి ఉన్న ప్రధాన సమస్య ఏంటో? ఇప్పుడు తెలుసుకుందాం..
వెంకటేశ్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం టీమ్ చాలా బలంగా ఉంది. ఇండియాతో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లకు కూడా వరల్డ్ కప్ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే.. వరల్డ్ కప్ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీలో ఏ టీమ్ అయినా సక్సెస్ అవ్వాలంటే.. మూడు విభాగాల్లో పటిష్టంగా ఉండాలి. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఈ మూడింటిలో సత్తాచాటిన జట్టే ఛాంపియన్గా నిలుస్తుంది. ప్రస్తుతం టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్లో అద్భుతంగా ఉంది. మెరుగుపడాల్సిన విషయం ఏంటంటే.. ఫీల్డింగ్. టీమిండియా ఫీల్డింగ్ విషయంలో కాస్త వీక్గా ఉంది. ఆసియా కప్, ఆస్ట్రేలియాతో సిరీస్లలో ఆ విషయం బయటపడింది. చాలా మంది ఫీల్డర్లను కెప్టెన్ దాచిపెట్టాల్సిన పరిస్థితి ఉంది. జట్టులోని అందరు ఫీల్డర్లు విరాట్ కోహ్లీ, జడేజా అంత మెరుగ్గా ఫీల్డింగ్ చేయలేకపోతున్నారు.’ అని అన్నారు. ఫీల్డింగ్లో టీమిండియా మెరుగుపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. మరి ఆయన విశ్లేషణపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: టీమిండియాదే వరల్డ్ కప్! రాసిపెట్టుకోండి అంటున్న భారత ప్రముఖ జ్యోతిష్కుడు