అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గంలో మంత్రి ఆర్భాటం కోసం పసిబిడ్డ ప్రాణాలు పోయాయి అంటూ ఒక వర్గం మీడియా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. వెంటనే రంగంలోకి దిగిన టీడీపీ నేతలు కూడా అదే నిజమని అంటూ ప్రచారం ప్రారంభించారు. ప్రభుత్వంలోని వ్యక్తుల సంబరాల కోసం ట్రాఫిక్ నిలిపివేసి పసిపాప చనిపోవడానికి కారణం అయ్యారని అంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా చేశారు. అయితే కళ్యాణదుర్గంలో చిన్నారి మృతికి పోలీసులు కారణం కాదని జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప చెప్పారు. మంత్రి ఉషశ్రీ చరణ్ ఊరేగింపులో ఆస్పత్రికి వెళ్లే చిన్నారిని ముందుకు వెళ్లకుండా పోలీసులు ఆపేశారు అంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. పోలీసులపై కావాలనే ఆరోపణలు చేస్తున్నారని ఎస్పీ తెలిపారు.
సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలన్నీ రికార్డ్ అయ్యాయని వివరించారు. చిన్నారి తల్లిదండ్రులను ఈ విషయంలో కావాలని తప్పుదోవ పట్టించారని అన్నారు. కొన్ని చానెళ్లలో 8 నెలల చిన్నారి మృతికి పోలీసులు దారి ఇవ్వకపోవడమేననే దుష్ప్రచారం నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప ఆదేశాల మేరకు పోలీసులు రంగంలోకి దిగి సీసీటీవిలను పరిశీలించి ఫుటేజ్ లను సేకరించారు. ఈ ఘటనపై లోతుగా విచారణ చేసి పూర్తి టైం లైన్ ను పోలీసులు ప్రకటించారు. చిన్నారి, ఆ తల్లిదండ్రులు శెట్టూరు మండలం ఖైరేవు సమీపంలోని చెర్లోపల్లి గ్రామం నుండి సాయంత్రం 6:10కి బయలుదేరారు.
అలా బయలుదేరిన వారు బైకులో వెళ్తున్నట్లు మంత్రి ఇంటి సమీపంలోని బ్రహ్మయ్య గుడి పోలీసు చెక్ పోస్ట్ వద్ద 6:36కు కనిపించారు. కళ్యాణదుర్గం టౌన్ లోకి వారు చిన్నారి సహా ఎంటర్ అయిన టైం 6:40 కాగా, కళ్యాణదుర్గం ఆర్డీటీ ఆసుపత్రికి ఎంటర్ అయిన టైం 6:48. ఆర్డీటీ ఓ.పి విభాగంలో నమోదు చేసిన సమయం 6:50కాగా, ఆసుపత్రిలో చిన్నారి చనిపోయిన సమయం 7:18 అని పోలీసులు వెల్లడించారు. ఆ తరువాత ఒక గంట పాటు సైలెంట్ గానే ఉన్న వారు చిన్నారి మృతదేహంతో రోడ్డుపై ఆందోళనకు 8:15 దిగారని వెల్లారించారు. వాస్తవాలు వక్రీకరించి లేనిపోని రాద్ధాంతం చేయకండి. పోలీసుల పై బురదజల్లడమే కాకుండా శాంతిభద్రతల సమస్యకు కారణమయితే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.