సరిగ్గా ఏడేళ్లక్రితం ఏప్రిల్ 7న శేషాచలం అడవుల్లో రక్తం ఏరులైపారింది, భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో 20 మంది తమిళ ఎర్రచందనం స్మగ్లర్లను అప్పటి బాబు ప్రభుత్వం మట్టుబెట్టింది. శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం చెట్ల నరికివేతలో బిజీగా ఉన్న స్మగ్లర్లను ఒక్కసారిగా పోలీసులు అత్యాధునిక ఆయుధాలతో చుట్టుముట్టారు.దాన్ని గ్రహించిన స్మగ్లర్లు పోలీసులపైనా, అటవీశాఖ అధికారులపైనా రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో కొందరు అధికారులు గాయపడ్డారు. ఈలోగా స్మగ్లర్లు గొడ్డళ్లు కూడా పట్టుకుని దాడికి దిగడంతో పోలీసులు తమకు ఎదురైన స్మగ్లర్లను లొంగిపోవాలని, లేదంటే కాల్చేస్తామని గట్టిగా హెచ్చరించారని అప్పట్లో చెప్పుకొచ్చారు.
కాని స్మగ్లర్లు, వారి ఆదేశాలతో అడవిలోకి వచ్చిన తమిళనాడు కూలీలు వెనుదిరగలేదని ఆత్మరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ పోలీసులు స్మగ్లర్లపై కాల్పులు జరిపారని ఈ ఘటనలో 20 మంది స్మగ్లర్లు, కూలీలు మరణించారని కోర్టులను సైతం నమ్మించారు. అప్పట్లో తమిళనాడుకు చెందిన కూలీలను ఎన్కౌంటర్ చేయడంపై తమిళ పార్టీలు భగ్గుమన్నాయి. తమిళనాడులో ఉన్న ఆంధ్రా హోటళ్లు, బ్యాంకులు, ఆస్తులపై దాడులు చేస్తామని నామ్ తమిళర్ కచ్చి లాంటి పార్టీలు హెచ్చరించాయి. దీంతో చెన్నైలో ఉన్న ఆంధ్రా ప్రాంతం వారి ఆస్తులు, సంస్థలకు తమిళనాడు పోలీసులు భారీ భద్రత కూడా ఏర్పాటు చేశారు. కూలీల మృతికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఎండీఎంకే నేత వైగో డిమాండ్ చేశారు. అంతే కాదు తాము అధికారంలోకి వస్తే బాబుని అరెస్ట్ చేస్తామని కూడా అన్నారు. కానీ అప్పటి ముఖ్యమంత్రికి స్టాలిన్ కి మధ్య స్నేహం ఉండడంతో ఈ విషయం మీద ఆయన పెద్దగా సీరియస్ అవలేదు.
అయితే ఇన్నేళ్ల తరువాత స్టాలిన్ దీని గురించి కామెంట్ చేశారు. ‘మృతుల కుటుంబాలకు తమిళనాడు ప్రభుత్వం అండగా ఉంటుంది. న్యాయంకోసం ఆ కుటుంబాలు చేస్తున్న చట్టపరమైన పోరాటానికి అండగా ఉంటాం. అది ఒక బ్లాక్ డే’ అని స్టాలిన్ అన్నారు. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో కూడా బాబు కోసం స్టాలిన్ పట్టుబట్టారు అన్న ప్రచారం జరిగింది. అలాంటిది ఒకరకంగా బాబును టార్గెట్ చేసే విధంగా ఉన్న ఈ ట్వీట్ స్టాలిన్ ఎందుకు చేశారు అనేది చర్చనీయాంశం అవుతోంది.