అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో నిర్వహించిన ఓ ర్యాలీలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాడిపత్రిలో మంత్రి ఉష శ్రీ చరణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. తమది శవరాజకీయం కాదని.. వైసీపీ వాళ్లే శవ రాజకీయాలు చేస్తారని ఫైర్ అయ్యారు. ఈ నెల 15న చనిపోయిన పాప తండ్రికి పింఛన్ ఇప్పించాలని.. ఒకవేళ ఆ పనిచేస్తే తానే మంత్రి ఇంటికి వెళ్లి సన్మానిస్తానని చెప్పుకొచ్చారు. ఇదే సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని అప్పుడు ప్రజల సంక్షేమం కోసం ఎన్జీవో ప్రారంభించి సేవా కార్యక్రమాలు చేస్తానని చెప్పుకొచ్చారు. ఇలాంటి కేసులకు భయపడేది లేదని కార్యకర్తల్లో ధైర్యం నింపడానికే తనవంతుగా మరింత పని చేస్తున్నామని అన్నారు. కళ్యాణదుర్గంలో పాప మృతి విషయంలో న్యాయ విచారణ జరిపించాలని చంద్రదండు అధ్యక్షుడు ప్రకాష్ నాయుడు నిరసన తెలిపితే అతనిపై రౌడీషీట్ తెరవడం దారుణమని ఆయన మండిపడ్డారు.
అయితే జేసీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొత్త ఏమీ కాదు. అందితే కాళ్ళు అందకపోతే జుట్టు అన్నట్టు మాట్లాడే ఆయన చేసిన కామెంట్స్ గురించి అనంతపురం జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రమంతా వైసీపీ గెలిచినా తాడిపత్రిలో మాత్రం ముక్కీ మూలిగి టీడీపీని గెలిపించారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఆ తర్వాత కావాలనుకుంటే జగన్ ఇక్కడ కూడా తమ అభ్యర్థులను గెలిపించవచ్చు అని కానీ న్యాయంగా ఆయన నిర్ణయం తీసుకున్నారని కొనియాడిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది.