iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ లో రైతుభరోసా కేంద్రాల (ఆర్బీకే) ద్వారా ధాన్యం సేకరణ చురుగ్గా సాగుతోంది. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఇప్పటివరకు 17లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ఇప్పటివరకు 76,158 మంది రైతులకు రూ.1,153 కోట్ల చెల్లింపులు చేశారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లోనే నగదు జమ చేస్తున్నారు. ఇ–కేవైసీ, బ్యాంకు ఖాతాలో సమస్యలు ఉంటే కొంత జాప్యం జరుగుతోంది తప్ప లేకుంటే చెల్లింపుల్లో ఎటువంటి అలసత్వం ఉండడం లేదు.
అయితే ప్రభుత్వం రైతులకు మద్దతుగా నిలుస్తుంటే తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో ధాన్యం విక్రయించిన రైతులకు నగదు రావట్లేదంటూ అసత్య కథనాలు అదేపనిగా వస్తున్నాయి. వాటిపై ప్రభుత్వం న్యాయపరంగా చర్యలు తీసుకోవాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఈ ఖరీఫ్లో 50 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా.. ప్రస్తుతం 4,837 ఆర్బీకేల్లో ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఏప్రిల్ నాటికి లక్ష్యాన్ని పూర్తిచేయాలనే ఉద్దేశంతో అధికారులు ఉన్నారు.
కమాండ్ కంట్రోల్ రూమ్..
ధాన్యం కొనుగోలులో సమస్యల పరిష్కారానికి రాష్ట్రస్థాయిలో 1902, 155215 నంబర్లతో కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. పొలం వద్దే ధాన్యం కొనుగోలు చేసేలా మొబైల్ యాప్ను ప్రవేశపెట్టారు. ఆర్బీకేల్లో చేసే ఐదు రకాల టెస్టులను ఐఓటీ ఆధారంగా రియల్ టైమ్లో చేసేందుకు ఒక స్టార్టప్ కంపెనీ సహకారంతో కృష్ణాజిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టారు. త్వరలోనే దీనిని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తారు. ప్రభుత్వ గోదాముల్లోకి రీసైకిల్డ్ బియ్యం రాకుండా గుర్తించేందుకు వీలుగా ఏజ్ టెస్టింగ్ విధానాన్ని తీసుకు రానున్నారు.
ఫోర్టిఫైడ్ బియ్యం మరో రెండు జిల్లాల్లో..
ఐరన్, ఫోలిక్ యాసిడ్, బి–12 విటమిన్ వంటి సూక్ష్మపోషకాలతో కూడిన ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీని దేశంలోనే తొలిసారిగా గతేడాది విజయనగరంలో ప్రారంభించారు. కొత్తగా విశాఖపట్నం, వైఎస్సార్ కడప జిల్లాలో కూడా ఈ బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా అందించేందుకు పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది.
Also Read : విన్నారు.. పరిష్కారం చూపుతారా.? కొలిక్కిరాని సమస్యలు