iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ విభజన వల్ల ఏర్పాటైన రెండు రాష్ట్రాలు ఇప్పటికీ కష్టాల్లోనే ఉన్నాయని రాజ్యసభ సాక్షిగా చెప్పిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వాటిని గట్టెక్కించవచ్చు కదా అన్న సూచనలు వినిపిస్తున్నాయి. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు మోదీ మంగళవారం రాజ్యసభలో సమాధానమిస్తూ ఆంధ్రప్రదేశ్ను కాంగ్రెస్ హడావిడిగా విభజించిందన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి ప్రధాన మంత్రిగా ఉన్న కాలంలో ఎటువంటి వివాదాలకు తావు లేని రీతిలో, శాంతియుతంగా మూడు రాష్ట్రాలను ఇచ్చామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్కు కాంగ్రెస్ అన్యాయం చేసిందన్నారు. పార్లమెంటులో కాంగ్రెస్ సభ్యులు పెప్పర్ స్ప్రే వాడారన్నారు. పార్లమెంటులో తలుపులు వేసి, మైక్లు కట్ చేసి, బిల్లును ఆమోదించారన్నారు. ఇదేనా ప్రజాస్వామ్యం? అని ప్రశ్నించారు. విభజన తీరుతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలు ఇప్పటికీ నష్టపోతున్నాయన్నారు.
ఏడేళ్లుగా అవే మాటలు..
కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించిన తీరు వల్ల ఆంధ్రప్రదేశ్ నష్టపోయిందని 2014 ఎన్నికల ప్రచారాల్లో మోడీ ఏం చెప్పారో.. ఇప్పుడు కూడా కాస్త అటూ ఇటూగా అదే చెబుతున్నారు. అప్పట్లో మోడీ విభజనపై బహిరంగ సభల్లో మాట్లాడుతూ తల్లిని చంపి, బిడ్డను బయటకు తీశారు అని వ్యాఖ్యానించారు. దీంతో ఈయనకు విభజిత ఆంధ్రప్రదేశ్పై సానుభూతి ఉందని, అధికారంలోకి వస్తే రాష్ట్ర కష్టాలు గట్టెక్కుతాయని జనం భావించారు. అయితే ఏడున్నరేళ్లుగా ప్రధానిగా ఉన్న మోడీ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని అంశాలను అమలు చేయలేదు. నాటి ప్రధాని మన్మోహన్సింగ్ పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన ప్రత్యేకహోదా హామీని నెరవేర్చలేదు. ప్రత్యేక ప్యాకేజీని తెరపైకి తెచ్చి ప్రత్యేక హోదాను అటకెక్కించారు. ఎన్నిసార్లు విజ్ఞాపనలు చేసినా అది ముగిసిన అధ్యాయమని చెప్పి దానిపై మాట్లాడడానికే ఇష్టపడడం లేదు. రాష్ట్ర రెవెన్యూ లోటును భర్తీ చేయలేదు. తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలను ఇప్పించండని ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా పట్టించుకోవడం లేదు.
వెనుకబడిన జిల్లాలకు ఇస్తామన్న నిధులు విడుదల చేయడంలేదు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేవలం ఇరిగేషన్ కాంపోనెంట్ వరకే నిధులిస్తామనడం, ఆర్ అండ్ ఆర్ గురించి పట్టించుకోకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడుతోంది. ఆ ప్రాజెక్టుపై ప్రభుత్వం చేసిన ఖర్చు మేరకైనా నిధులను త్వరగా విడుదల చేయడం లేదు. పోలవరం ప్రాజెక్టును గత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏటీఎంలా వాడుకున్నారని ఆరోపించిన మోడీ, ఇప్పటి వరకు ఆయనపై చర్య తీసుకోలేదు. రాష్ట్రానికే గర్వకారణంగా భావించే విశాఖ స్టీల్ప్లాంట్ను ప్రైవేటీకరించవద్దని ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నా పెడచెవిన పెడుతున్నారు. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరిగిందన్న భావన నిజంగా ప్రధాని మోడీ కి ఉంటే.. న్యాయం చేయడానికి ఇన్నేళ్లూ సరిపోలేదా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కేవలం ప్రసంగాల్లో ఆంధ్రప్రదేశ్పై సానుభూతి చూపడం కాకుండా ఇప్పటికైనా రాష్ట్రానికి ఉన్న సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని జనం ప్రధాని మోడీని కోరుకుంటున్నారు.
Also Read : ఏపీ విభజన సరిగా జరగకే ఈ పరిస్థితులు : ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు