iDreamPost
android-app
ios-app

జేసీ పవన్ టీడీపీపై అలిగారా..?

  • Published Jan 03, 2022 | 6:05 AM Updated Updated Mar 11, 2022 | 10:27 PM
జేసీ పవన్ టీడీపీపై అలిగారా..?

రాష్ట్ర రాజకీయాలపై అవగాహన ఉన్నవారికి జేసీ బ్రదర్స్ గురించి తెలియకుండా ఉండదు. నిత్యం ఏదో ఒక వివాదం, వ్యాఖ్యలు, చర్యలతో జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి సోదరులు వార్తల్లో వ్యక్తులుగా నిలుస్తుంటారు. ఇక వారి సొంత జిల్లా అయిన అనంతపురం రాజకీయాల్లో కొన్ని దశాబ్దాలుగా కీలకపాత్ర పోషిస్తున్నారు. మొదట కాంగ్రెసులో, 2014 నుంచి టీడీపీలో కొనసాగుతూ ప్రజాప్రతినిధులుగా వ్యవహరించేవారు. గత ఎన్నికల్లో వీరు తప్పుకుని వారసులను రంగంలోకి దించారు. అయితే రాష్ట్రంలో టీడీపీతో పాటు వారు కూడా ఓటమి పాలయ్యారు. ఎన్నికల అనంతరం జిల్లా టీడీపీలో పెరిగిన అంతర్గత విభేదాలు, తమ వర్గానికి ప్రాధాన్యత తగ్గించడం వంటి కారణాలతో జేసీ రాజకీయ వారసులైన పవన్ రెడ్డి, అస్మిత్ రెడ్డి కొన్నాళ్లుగా పార్టీకి దూరంగా ఉండటం చర్చనీయాంశం అయ్యింది.

ఓటములు.. విభేదాలు

తాడిపత్రికి చెందిన జేసీ కుటుంబం తొలి నుంచీ కాంగ్రెసులో ఉండేది. జేసీ దివాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా, మంత్రిగా సుదీర్ఘ కాలం పనిచేశారు. సోదరుడు ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా చేశారు. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పతనం కావడంతో ఈ సోదరులు టీడీపీలో చేరారు. 2014లో అనంతపురం ఎంపీగా దివాకర్ రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యేగా ప్రభాకర్ రెడ్డి ఆ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసి గెలిచారు. 2019 ఎన్నికల నాటికి వారిద్దరూ తప్పుకుని తమ వారసులను రంగంలోకి దించారు. దివాకర్ కుమారుడు పవన్ రెడ్డి అనంతపురం ఎంపీగా, ప్రభాకర్ కుమారుడు అస్మిత్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా తొలిసారి పోటీ చేశారు. అయితే జగన్ హవాను ఎదుర్కోలేక ఇద్దరూ ఓటమిపాలయ్యారు.

ఎన్నికల అనంతరం జిల్లాలో టీడీపీ పుంజుకోకపోగా అంతర్గత విభేదాలతో మరింత దిగజారుతోంది. ప్రధానంగా మిగతా నేతలంతా ఒకవైపు.. జేసీ బ్రదర్స్ ఒకవైపు అన్నట్లు పరిస్థితి తయారైంది. మూడు నెలల క్రితం అనంతపురంలో జరిగిన పార్టీ సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు కాల్వ, మరికొందరు నేతలను టార్గెట్ చేస్తూ జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన తీవ్ర వ్యాఖ్యలు పార్టీలో గ్రూవులను బట్టబయలు చేశాయి. అప్పటి నుంచి జిల్లా నేతలందరూ ఏకమై జేసీ వర్గాన్ని ఏకాకిని చేశారు.

వరుస పరిణామాలతో అసంతృప్తి

పార్టీలో చోటుచేసుకున్న వరుస పరిణామాలు జేసీ వర్గం, మిగతా నేతల మధ్య మరింత గ్యాప్ పెంచాయి. జేసీ వర్గీయురాలిగా ముద్రపడిన శింగనమల నియోజకవర్గ ఇంఛార్జి బండారు శ్రావణిని తప్పించి ద్విసభ్య కమిటీని వేయడం ఆ వర్గాన్ని అసంతృప్తికి గురిచేసింది.

స్వయంగా దివాకర్ రెడ్డి శ్రావణిని తీసుకుని చంద్రబాబును కలిసిన ఫలితం కనిపించలేదు. ఇక కళ్యాణదుర్గం ఇంఛార్జి ఉమామహేశ్వర నాయుడు కూడా జేసీ వర్గీయుడే. కానీ కాల్వ, పయ్యావుల కేశవ్ తదితరులు.. జేసీ వర్గంలో ఉంటే అవకాశాలు రావని బెదిరించి అతన్ని తమవైపు తిప్పుకున్నారని జేసీ వర్గీయులు ఆరోపిస్తున్నారు.

ఇవే కాకుండా అనంతపురం పార్లమెంటు జిల్లా పరిధిలో జరిపే నియామకాలు, కార్యక్రమాలు, ఇతర మార్పుచేర్పులపై తమకు కనీసం సమాచారం కూడా ఇవ్వడంలేదని కాల్వ వర్గంపై జేసీ పవన్ గుర్రుగా ఉన్నారు. పార్టీ అధిష్టానం కూడా తమకు ప్రాధాన్యం తగ్గించిందన్న అసంతృప్తి ఏర్పడింది. దాంతో పవన్ రెడ్డి మూడు నెలలుగా పార్టీతో అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారు. కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. ఆ మధ్య లోకేష్ అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు కూడా పవన్ రెడ్డి డుమ్మా కొట్టారు. లోకేష్ ను కూడా కలవలేదు. అయితే జేసీ వర్గాన్ని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. ప్రత్యర్థి వర్గానికి చెక్ పెట్టడానికి ఏం ఎత్తులు వేస్తుందో.. పార్టీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనన్న ఉత్కంఠ పార్టీవర్గాల్లో నెలకొంది.