Idream media
Idream media
తెలంగాణ లో మరో ఎన్నికల సంగ్రామం దిశగా జోరుగా అడుగులు పడుతున్నాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో అయన నియోజకవర్గమైన హుజూరాబాద్ ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. దీనితో అన్ని పార్టీలు కూడా హుజూరాబాద్ ఉప ఎన్నిక పై అప్పుడే ఫోకస్ పెట్టాయి. ప్రధానంగా టీఆర్ ఎస్ బీజేపీ మధ్యనే ప్రధాన పోటీ జరగనుంది. గెలుపే ధ్యేయంగా టీఆర్ ఎస్ పావులు కదుపుతుంటే మరోవైపు హుజూరాబాద్ లో గెలిచి తమ సత్తా చాటాలని బీజేపీ భావిస్తోంది. అలాగే ఈటల రాజేందర్ కి స్థానికంగా మంచి ఫాలోయింగ్ ఉండటం తో గెలుపు పై వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే .. టీఆర్ ఎస్ నేతలు అక్కడ మకాం వేసి వ్యూహాలు రచిస్తున్నారు.
దుబ్బాకలో లాగానే అచ్చం అలాంటి ప్లాన్లను రూపొందిస్తోంది బీజేపీ దుబ్బాకలో ప్రతి మండలానికి ఒక సీనియర్ నేతను ఎమ్మెల్యేను నియమించి అక్కడ గెలుపును సునాయసం చేసుకుంది. ప్రతి గ్రామానికి కూడా కార్యకర్తలను నియమించి టీఆర్ఎస్ గెలుపును అడ్డుకుంది. ఇప్పుడు అదే ప్లాన్ ను ఇక్కడా అమలు చేస్తోంది బీజేపీ ఉప ఎన్నిక నేపథ్యంలో మండల ఇంఛార్జ్ లను ప్రకటించింది బీజేపీ. హుజురాబాద్ రూరల్ రేవూరి ప్రకాశ్రెడ్డి జమ్మికుంట ఎంపీ అర్వింద్ జమ్మికుంట రూరల్ మాజీ ఎమ్మెల్యే ధర్మారావు వీణవంక- మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి ఇల్లంతకుంట- మాజీ ఎంపీ సురేష్రెడ్డి కమలాపూర్- కూన శ్రీశైలం గౌడ్ లను ఇంఛార్జులగా నియమించింది. నియోజకవర్గ కోఆర్డినేర్ గా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని ప్రకటించింది.
ఇదిలా ఉంటే హుజూరాబాద్ ఉప ఎన్నిక సెప్టెంబర్ లో జరగనున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు అన్ని పార్టీల నేతలకి సంకేతాలు వచ్చినట్టు సమాచారం. ఇందులో భాగంగా ముందుగా ఎన్నికల సిబ్బందికి వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే ఆ నియోజకవర్గంలోని ఓటర్లకు నేతలకి భారీ స్థాయిలో వ్యాక్సిన్ వేసేందుకు ప్రణాళికలు రచిస్తునట్టు తెలుస్తుంది. ఈ ఎన్నికలు ఇప్పుడు అత్యంత ఖరీదు అని రాజకీయాలలో చర్చ సాగుతోంది. ఇటు టీఆర్ఎస్, అటు ఈటల రాజేందర్ వర్గం పోటాపోటీ సమావేశాలు నిర్వహిస్తున్నాయి. విమర్శలు ప్రతి విమర్శలు పొలిటికల్ హీట్ పెరిగిపోతుంది. టీఆర్ఎస్ రంగంలోకి దింపిన మంత్రులు ఈటలపైన, బీజేపీ పైన బాణాలు ఎక్కుపెడుతున్నారు. బీజేపీ నుంచి బండి సంజయ్, రఘు నందన్ రావు తదితర నేతలు కేసీఆర్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.