iDreamPost
android-app
ios-app

టీడీపీకి తేడా తెలుస్తోందా.. తగ్గేదేలే అనుకుంటే అంతా తలకిందులెందుకు

  • Published Jan 31, 2022 | 4:30 PM Updated Updated Mar 11, 2022 | 10:20 PM
టీడీపీకి తేడా తెలుస్తోందా.. తగ్గేదేలే అనుకుంటే అంతా తలకిందులెందుకు

అందరికీ గుర్తుండే ఉంటుంది. 2019 ఎన్నికల్లో రాత్రి పొద్దుపోయిన తర్వాత కూడా కొన్నిచోట్ల పోలింగ్ జరిగింది. దాంతో తాము ఇచ్చిన పసుపు కుంకమ పథకం పనిచేసిందని, ఎక్కువ మంది మహిళలు చీకట్లో సైతం ఓటు హక్కు వినియోగించుకుని తమను గెలిపించారంటూ టీడీపీ నేతలు లెక్కలేశారు. కానీ తీరా ఈవీఎంలు తెరవగానే సీన్ సితార అయిపోయింది. చరిత్రలోనే అత్యంత ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. అయినా ఆ తర్వాత కూడా టీడీపీ నేతల తీరు మారలేదు. జనాభిప్రాయాన్ని ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదనే విషయం పదే పదే రుజువవుతూనే ఉంది. తాజాగా మరోసారి తేటతెల్లమయ్యింది. పరిస్థితి తేడాగా ఉన్నప్పటికీ తగ్గేదేల్యే అన్నట్టుగా తయారవుతున్న టీడీపీ వైఖరి జనాలకు ఏమాత్రం రుచించడం లేదని అర్థమవుతున్నా అసలు మారుతున్న దాఖలాలే కానరావడం లేదు.

తాజాగా నారీ సంకల్పదీక్ష అంటూ తెలుగు మహిళా నేతలు మరోసారి చర్చకు తెరలేపారు. వాస్తవానికి మహిళల పేరు చెప్పడమే తప్ప ఏనాడు మహిళా సంక్షేమాన్ని టీడీపీ పట్టించుకున్న పాపాన పోలేదు. ఎన్టీఆర్ సారా నిషేధించిన, సడలించిన ఘనత దక్కించుకున్న చంద్రబాబు ఆ తర్వాత అంగన్ వాడీ మహిళలను గుర్రాలతో తొక్కించిన రోజులు కూడా ఈ రాష్ట్ర చరిత్రలో చాలామందికి గుర్తుండే ఉంటుంది. డ్వాక్రా రుణమాఫీ అని మతలబు పెట్టి పసుపు కుంకమ మాటలతో మోసం చేయాలని చూసిన స్థితిని కూడా చాలామంది మరచిపోలేదు. అలాంటి నారా బాబు ఇప్పుడు నారీ సంకల్పం అంటే రాష్ట్రంలోని మహిళలంతా టీడీపీ మాటలు నమ్మేస్తారని భ్రమల్లో ఉండడం ఆశ్చర్యమే.

వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు అన్నింటా పెద్ద పీట వేస్తోంది. మహిళా సంక్షేమమే కర్తవ్యంగా భావిస్తోంది. చివరకు 30లక్షల మంది మహిళల పేరుతో ఇంటి పట్టాలు పంపిణీ చేసి సొంతిల్లు నిర్మించుకోవడానికి చేదోడుగా నిలుస్తోంది. అమ్మ ఒడి నుంచి అనేక పథకాల ద్వారా నేరుగా మహిళలకు భరోసా కల్పిస్తోంది. ఇక అమూల్ వంటి పథకాల ద్వారా మహిళా పాడి రైతులకు మేలు చేస్తోంది. చంద్రబాబుకి చెందిన హెరిటేజ్ సంస్థ సహా అందరూ పాల ధరను పెంచి ఇవ్వాల్సిన పరిస్థితిని జగన్ సర్కారు తీసుకొచ్చింది. కొందరి లాభాల కోసం రాష్ట్రంలో మహిళందరినీ మభ్యపెట్టే దశ నుంచి నేరుగా మహిళలకు ప్రయోజనం కల్పించే రీతిలో పథకాలు అందిస్తూ జగన్ ప్రభుత్వం విన్నూత్న పంథాలో సాగుతోంది.

మహిళలకు జగన్ ఇచ్చిన భరోసా మూలంగా రాష్ట్రంలో మహిళా పోలీసు వ్యవస్థ నుంచి దిశా చట్టం వరకూ అనేకం రంగంలోకి వచ్చాయి. మహిళల హక్కులను పరిరక్షించే దిశలో జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాల మూలంగా దేశంలోని అనేక రాష్ట్రాలు ఏపీని అనుసరించే పరిస్థితి వచ్చింది. అయినా దానంతటినీ జీర్ణించుకోలేని టీడీపీ తాజాగా రాష్ట్రంలో మహిళలకు ఏదో జరిగిపోతోందన్నట్టుగా హంగామా చేయడం విడ్డూరంగా కనిపిస్తోంది. పైగా టీడీపీ నేతలే బాలికల ప్రాణాలతో ఆటలాడిన ఘటన వెలుగులోకి వచ్చిన మరునాడే నారీ సంకల్పం అనడం విస్మయకరంగా మారింది.