iDreamPost
iDreamPost
ఊరంతా ఒకదారైతే ఉలిపిరి కట్టెది ఒకదారి అన్నట్టుంది టీడీపీ అధినేత చంద్రబాబు తీరు. సంక్షేమ పథకాల అమలు, పరిపాలనా సంస్కరణలతో దూసుకుపోతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని అందరూ మెచ్చుకుంటుండగా అందుకు విరుద్ధంగా చంద్రబాబు స్పందించారు. టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు, ముఖ్యనేతలతో చంద్రబాబు సోమవారం సమావేశం అయ్యారు. ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పాలనలో ప్రజలు పేదలయ్యారని, వైఎస్సార్ సీపీ వాళ్లు ధనికులయ్యారని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల, నేతల వసూళ్లు, భూ కబ్జాలపై పెద్దఎత్తున ఫిర్యాదులు ఉన్నాయన్నారు. వాటిపై పోరాడాలని పార్టీ నేతలకు సూచించారు. జిల్లాల పునర్విభజన విషయంలో ప్రజల మనోభావాలకు విరుద్ధంగా నిర్ణయాలు జరిగాయన్నారు.
జనం నమ్ముతారనుకుంటున్నారా?
రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దాదాపు ప్రతి కుటుంబానికి ఆర్థిక లబ్ధి చేకూరేలా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పనిచేస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న నవరత్నాలే కాకుండా జనం మేలు కోరి మరిన్ని సంక్షేమ పథకాలను ఈ రెండున్నరేళ్లలో ప్రభుత్వం ప్రారంభించింది.చిత్తశుద్ధితో అమలు చేస్తోంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం అమలు చేసిన ఈ పథకాల వల్ల పేదల జీవితాలు మెరుగయ్యాయి. వారి కోనుగోలు శక్తి పెరిగింది. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో దేశమంతా ఆర్థిక సంక్షోభం తలెత్తినా ఆంధ్రప్రదేశ్లో పేద కుటుంబాలు రోడ్డున పడలేదు అంటే సీఎం జగన్మోహన్రెడ్డి అమలు చేసిన ఈ పథకాలే కారణం.
ఇది ఆర్థిక నిపుణులు ఒకటికి రెండుసార్లు చెప్పినమాట. ఇది ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం కాకుండా ప్రజలకు అనుభవమైన విషయం. ఇలాంటి విషయంలో కూడా జనాన్ని పక్కదారి పట్టిద్దామని చంద్రబాబు భావిస్తున్నారంటే తన ప్రచారంపై ఆయనకు ఎంత నమ్మకమో అర్థమవుతోందని వైఎస్సార్ సీపీ నేతలు అంటున్నారు.తిమ్మిని బమ్మిని చేసే పచ్చ మీడియా తనకు అండగా ఉంది కనుక తాను ఏం చెప్పినా జనం నమ్ముతారని చంద్రబాబు విశ్వాసం. అందుకే వాస్తవాలతో సంబంధం లేకుండా తనకు రాజకీయంగా ఏది కలసి వస్తుందో దాన్నే ఆయన ప్రచారంలో పెడతారని వైఎస్సార్ సీపీ నాయకులు చెబుతున్నారు.
ప్రతి విషయంలో కోర్టులను ఆశ్రయించి ప్రభుత్వానికి అడ్డంకులు కల్పిస్తున్న టీడీపీ… వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల, నేతలు వసూళ్లు, భూకబ్జాలకు పాల్పడుతుంటే ఎందుకు ఊరుకుంది. ఎక్కడ, ఏ ఎమ్మెల్యే లేదా నాయకుడు ఆ విధంగా అవినీతికి పాల్పడ్డాడో తన మీడియా ద్వారానైనా ఎందుకు బయటపెట్టలేదు? అని ప్రశ్నిస్తున్నారు.జిల్లాల పునర్విభజన విషయంలో ప్రజల మనోభావాలకు విరుద్ధంగా నిర్ణయాలు జరిగాయని కామెంట్ చేయడం కాకుండా ప్రతిపక్షంగా తమ సూచనలు ఏమైనా ఉంటే ప్రభుత్వానికి తెలియజేయాలని, ప్రతి విషయంలోనూ రాజకీయం చేయాలనుకోవడం తగదని చంద్రబాబుకు అధికార పార్టీ నాయకులు హితవు చెబుతున్నారు.