iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలను శాసించే అంశాల్లో కులం కీలకమైనది. ఇతర ప్రభావిత అంశాలున్నప్పటికీ కులం పోషించే పాత్ర ముఖ్యమైనది. అందులో జనాభా పరంగా అత్యధిక సంఖ్యాకులుంటే మరింత ప్రధానంగా మారుతుంది. రాజకీయాలను శాసించే స్థాయికి ఆర్థిక సత్తాకూడా సాధించిన కులాలైతే చెప్పనవసరం లేదు. అందుకే ఏపీలో కాపు కులస్తులను ఆకట్టుకునేందుకు అన్ని పార్టీలు ప్రాధాన్యతనిస్తాయి. కాపు, తెలగ, బలిజ, ఒంటరి అంటూ వివిధ తరగతులుగా విభజించిబడినప్పటికీ దాదాపుగా అంతా ఒకే గూటి పక్షులుగా భావించే కాపులు కీలక భాగస్వామ్యం కోసం చాలాకాలంగా వేచి చూస్తున్నారు.
తొలుత చిరంజీవి సినీ ఇమేజ్ ని సొంతం చేసుకుని జనాదరణ తో కాపుల రాజకీయాలకు తెరలేపారు. అంతకుముందు వంగవీటి రంగా, ముద్రగడ పద్మనాభం వంటి వారు వివిధ పార్టీలలో కీలక భూమిక పోషించినా స్వతంత్ర్యంగా కాపులకు కుర్చీ కావాలనే ఆలోచన చిరంజీవితో మొదలయ్యింది. కానీ ఆయన రాజకీయ అవగాహనా లేమి సహా అనేక కారణాలతో లక్ష్యం చేరకుండానే రాజకీయాల నుంచి విరమించుకున్నారు. ఆ తర్వాత జనసేన పేరుతో పవన్ కళ్యాణ్ సొంత కుంపటి పెట్టుకున్నప్పటికీ గడిచిన రెండు ఎన్నికల్లోనూ ఆయన కూడా సాధించిందేమీ లేదు. దాదాపుగా చంద్రబాబు కనుసన్నల్లో వ్యవహరించే ఓ ఉపగ్రహం జనసేన అన్నట్టుగా అనేక మంది భావిస్తున్నారు. రాష్ట్రంలోని కీలక కాపు నేతలు కూడా అంచనా వేస్తున్నారు.
దాంతో సంఖ్యాపరంగా మంచి స్థానంలో ఉండి, ఇటీవల కాలంలో ఆర్థికంగా నిలదొక్కుకున్న తమ కులానికి రాజకీయాల్లోనూ అదే రీతిలో కీలక స్థానం ఉండాలనే ఆలోచన కాపులలో పెరుగుతోంది. దానికి తగ్గట్టుగా ఇప్పటికే రెండు ప్రయోగాలు విఫలమయిన తరుణంలో మరోసారి కాపుల సొంత పార్టీ చుట్టూ చర్చ మొదలయ్యింది. ఇప్పటికే వివిధ పార్టీలలో కీలకంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర స్థాయి నేతలంతా హైదరాబాద్ లో సమావేశం కావడం దానికి ఊతమిచ్చింది. అదే సమయంలో ముద్రగడ పద్మనాభం కూడా కొంత క్రియాశీలకంగా మారుతున్నారు. ఇక వంగవీటి రాధా వ్యవహారం కూడా రాజుకుంటోంది. ఈ నేపథ్యంలో కాపుల నేతల ఉమ్మడి ప్రయత్నం కొలిక్కి వస్తుందా అనే ఆసక్తి పెరుగుతోంది.
ఒక్క కులానికే పరిమితమైన పార్టీలు ప్రభావితం చేయగలిగే అవకాశం లేదు. అందులోనూ కాపుల ప్రభావం కోస్తాలోని ఐదారు జిల్లాల్లోనే ప్రధానంగా ఉంటుంది. అదే సమయంలో ఉత్తరాంధ్రలో తూర్పు కాపులు, రాయలసీమలోని కొన్ని నియోజకవర్గాల్లో బలిజలు ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటారు. అయినప్పటికీ వారందరినీ ఒకే తాటి మీదకు తీసుకురావడం సాధారణ విషయం కాదు. అదే సమయంలో కాపుయేతరుల మద్ధతు లేకుండా ముందుకు సాగడం సాధ్యం కాకపోవచ్చు. అయినప్పటికీ పలువురు కాపు నేతలు చేస్తున్న ప్రయత్నాలు మాత్రం రాజకీయంగా ప్రభావితం చేయడం మాత్రం ఆసక్తికరం.
టీడీపీ, జనసేనకు ఎదురుదెబ్బ
కాపుల విషయంలో తొలి నుంచి టీడీపీకి వ్యతిరేకంగా ఉంటూ వస్తున్నారు. అయితే 2014లో మాత్రం జనసేన మూలంగా టీడీపీకి మద్ధతినిచ్చారు. దాని ఫలితాన్ని కూడా టీడీపీ దక్కించుకుంది. ఆ తర్వాత కీలకమైన కాపు డిమాండ్లను, చంద్రబాబు ఇచ్చిన హామీలు విస్మరించడంతో టీడీపీకి కాపులు పూర్తిగా దూరమయ్యారు. అయితే వచ్చే ఎన్నికల నాటికి కమ్మ, కాపు కాంబినేషన్ కోసం చంద్రబాబు కసరత్తులు చేస్తున్నారు. జనసేనను మళ్లీ దగ్గరకి చేర్చుకుని లబ్ది పొందాలని చూస్తున్నారు. అయితే కాపులు వేరు కుంపటి పెడితే మాత్రం టీడీపీకి పెద్ద దెబ్బతప్పదు. గతంలో 2009 ఎన్నికల్లో కూడా చంద్రబాబు కట్టిన మహాకూటమికి చిరంజీవి ప్రజారాజ్యం మూలంగా కలిగిన నష్టం దానికి తార్కాణం.
ఇక కాపుల ఓట్ల బలంతో సుమారుగా ఐదారు శాతం ఓట్లు సాధించిన జనసేనకి ఈసారి పవన్ సొంత కులంలోనే కన్నం పడితే కష్టం అవుతుంది. పవన్ పునాదులకే ప్రమాదం ఏర్పడుతుంది. దాంతో ఈరెండు పార్టీలు ఉమ్మడిగా బరిలో దిగినప్పటికీ ఆశించిన ఫలితాలకు తాజాగా కాపునేతల యత్నాలు గండికొట్టే అవకాశం స్పష్టంగా ఉంది. దాంతో ఈ వ్యవహారం ఆ రెండు పార్టీలను ఆందోళనకు గురిచేస్తోంది. కాపుల శిబిరం ప్రత్యేకంగా ఏ చిన్న ప్రయత్నమయినా అది అనివార్యంగా టీడీపీ, జనసేన ఆశలపై నీళ్లుజల్లే అవకాశం ఉంటుందనడంలో ఎటువంటి సంశయం లేదు. దాంతో ఈ పరిణామాలను విపక్షాల్లో ఎక్కువగా అలజడి రేపుతున్నాయి.