తెలుగును పటిష్టపరిచేలా 1957లో సాహిత్య అకాడమీ, 1968లో తెలుగు అకాడమీ వచ్చాయి. ఇక తెలుగు అకాడమీ స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ. పి.వి.నరసింహారావు దీని వ్యవస్థాపక అధ్యక్షులు కాగా రాష్ట్ర విభజన తరువాత ఈ అకాడమీ విభజన రెండు రాష్ట్రాలకు కొరకరాని కొయ్యగా మారింది. 2014లోనే ఏపీ, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయినా… తెలుగు అకాడమీ విభజన, ఉద్యోగులు, ఆస్తుల పంపకాలపై ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ విషయం మీద దృష్టిపెట్టిన జగన్ ప్రభుత్వం కోర్టుకు కూడా వెళ్ళింది. అదే సమయంలో తెలుగు అకాడమీ విభజన పూర్తిచేయాలని గతేడాది సెప్టెంబర్ 14న తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.
అయితే అకాడమీకి చెందిన బ్యాంకు డిపాజిట్లను విత్ డ్రా చేసేందుకు అధికారులు ప్రయత్నించడం అప్పట్లో కలకలం రేపింది. అదే సమయంలో రూ. 65 కోట్ల నిధుల గల్లంతు వ్యవహారం వెలుగుచూసింది. దీంతో తెలుగు అకాడమీ విభజన ప్రక్రియ నిలిచిపోయింది. ఇక తాజాగా మరోసారి తెలుగు అకాడమీ విభజన వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో పిటిషన్ ను వెనక్కి తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ కు చెల్లించాల్సిన 92.94 కోట్ల రూపాయల్లో పెండింగ్ సొమ్మును వారంలో చెల్లించాలని ఆదేశించింది. అలాగే 6 శాతం వడ్డీ కూడా చెల్లించాలని నిర్దేశించింది. ఈ కేసును విచారించిన జస్టిస్ చంద్రచూడ్ , జస్టిస్ హిమాకోహ్లి ధర్మాసనం ఆస్తులు, నిధుల పంపకాలపై హైకోర్టు ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది.
అయితే నిజానికి నిధుల పంపిణీ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. కోర్టు ధిక్కరణ కింద వస్తుంది ఏమో అనే ఉద్దేశంతో మొదటి విడతగా అకాడమీ మంగళవారం రూ.92 కోట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖాతాకు బదిలీ చేసింది. ఇక నిధులు, సిబ్బందిని 42:58 నిష్పత్తిలో పంచుకోవాల్సి ఉంది. రాష్ట్ర విభజన నాటికి ఉన్న నిధులు, అప్పటినుంచి వాటిపై వడ్డీ కలిపి దాదాపు రూ.190 కోట్ల వరకు ఏపీకి బదిలీ చేయాల్సి ఉంటుంది. అందులో భాగంగా మొదటి విడతగా రూ.92 కోట్లను బదిలీ చేసింది. సిబ్బంది విభజన జాబితా కూడా ఒకటి రెండు రోజుల్లో వెలువడనుంది.