మెగాస్టార్ చిరంజీవి ‘వేదాలం’ సినిమా రీమేక్ చేయాలనుకుంటున్న విషయం విదితమే. గతంలో ఈ సినిమా పవన్ కళ్యాణ్తో చేయాలనుకున్నారు. అయితే, కొన్ని కారణాలతో ఆ సినిమా పట్టాలెక్కలేదు. ఇక, ఇప్పుడు చిరంజీవి ‘వేదాలం’ సినిమా పట్ల చాలా ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. త్వరలో సినిమాపై అధికారిక ప్రకటన కూడా రాబోతోంది. ఈ సినిమా కోసం సాయి పల్లవి పేరుని పరిశీలిస్తున్నారట. సినిమాలో హీరోయిన్గా కాదు, చిరంజీవి చెల్లెలి పాత్రలో. అజిత్ హీరోగా తమిళంలో వచ్చిన ‘వేదాలం’ అప్పట్లో సంచలన విజయాన్ని అందుకుంది. ‘వేదాలం’లో హీరో చెల్లెలి పాత్ర చాలా కీలకం. ఇక, తెలుగు ‘వేదాలం’ విషయానికొస్తే, ఓ ప్రముఖ హీరోయిన్ని చిరంజీవి జోడీగా అనుకుంటున్నారట. సాయిపల్లవి పేరు దాదాపు ఖరారైపోయినట్లేననీ, సినిమా కూడా ఈ ఏడాదిలోనే పట్టాలెక్కుతుందనీ సమాచారం. అయితే, ప్రస్తుతం చిరంజీవి ‘ఆచార్య’ సినిమా పూర్తి చేయాల్సి వుంది. కరోనా నేపథ్యంలో ఎప్పటినుంచి ‘ఆచార్య’ షూటింగ్ తిరిగి ప్రారంభమవుతుందన్నదానిపై స్పష్టత లేదు. ఇది కాక, ‘లూసిఫర్’ రీమేక్ కూడా చిరంజీవి చేయాల్సి వుంది. మరి, చిరంజీవి ‘వేదాలం’ రీమేక్కి ఎప్పుడు, ఎలా గ్రీన్ సిగ్నల్ ఇస్తారన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. కాగా, ఈ నెలాఖరు నుంచి ‘ఆచార్య’ సినిమా షూటింగ్ పునఃప్రారంభించాలని దర్శకుడు కొరటాల శివకి చిరంజీవి సూచించారని సమాచారం. ఇక, సాయిపల్లవి విషయానికొస్తే ఆమె ప్రస్తుతం తెలుగులో ‘లవ్ స్టోరీ’తోపాటు, ‘విరాటపర్వం’ సినిమా కూడా చేస్తోన్న విషయం తెలిసిందే.