iDreamPost
android-app
ios-app

పొంతన లేని రాతలు.. చిత్రమైన వ్యాఖ్యలు..

  • Published Jan 30, 2022 | 3:47 AM Updated Updated Mar 11, 2022 | 10:20 PM
పొంతన లేని రాతలు.. చిత్రమైన వ్యాఖ్యలు..

చెప్పేవాడికి వినేవాడు లోకువ అన్నట్టు ఉంది ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ వైఖరి. తాను ఏం రాసినా పాఠకులను నమ్మించగలననే విశ్వాసంతో, ఒకదానికొకటి పొంతన లేని ప్రతిపాదనలతో, పరస్పర విరుద్దమైన వ్యాఖ్యలతో ఈ వారం కొత్తపలుకును వండేశారు. ఏ సమస్యనైనా పక్కదారి పట్టించడానికి మరో సమస్యను సీఎం జగన్మోహన్ రెడ్డి తెరపైకి తెస్తారు అని ఒక అభాండం వేసి దాన్ని సమర్థించుకోవడానికి నానా తంటాలు పడ్డారు.

సినిమా టిక్కెట్ల ధర తగ్గించడంతో చిత్ర పరిశ్రమలో రేగిన అలజడి నుంచి గుడివాడలో క్యాసినో అంశంతో సీఎం జగన్ గట్టెక్కారట! పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగులు చేస్తున్న ఆందోళనను పక్కదారి పట్టించడానికి కొత్త జిల్లాల గెజిట్ జీవో జారీ చేశారట. ఈ కొత్త జిల్లాల అంశం తెరపైకి రావడంతో క్యాసినో వ్యవహారంలో చిక్కుకున్న మంత్రి కొడాలి నానికి ఉపశమనం కలిగిందట. ఇలా తన ఊహలకు కల్పనను జోడించి పాఠకుల్లో ప్రభుత్వంపై దురభిప్రాయం కల్పించాలని ట్రై చేశారు. అయితే రాధాకృష్ణ పేర్కొన్నట్టు ప్రభుత్వం ఒక సమస్య నుంచి గట్టెక్కడానికి మరో సమస్యను సృష్టించలేదు. ప్రతి సమస్యకు విడివిడిగా పరిష్కార మార్గాలను చూపిస్తూ ముందుకు సాగుతోంది. సినిమా టికెట్ల ధరల తగ్గింపు నేపథ్యంలో ఏర్పడ్డ పరిస్థితిని అధ్యయనం చేసేందుకు కమిటీ వేసింది.

గుడివాడ క్యాసినో వ్యవహారంలో విచారణకు ఆదేశించింది. టీడీపీ క్యాసినో అంటూ చేస్తున్న ఆరోపణలను 10 రోజుల్లో నిరూపించాలని, లేదంటే అవన్నీ అవాస్తవాలుగా పరిగణిస్తామని మంత్రి కొడాలి సవాల్ విసిరారు కూడా.

పీఆర్సీకి సంబంధించి ఉద్యోగులతో చర్చించేందుకు ప్రభుత్వం కమిటీని వేసింది. కొన్ని సంఘాలతో చర్చలు ప్రారంభించింది. శనివారం హెచ్ఆర్ఏను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎక్కడా దాటవేత ధోరణి లేకుండా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే ఒకదానికి ఒకటి ముడిపెట్టి రాసేసి సీఎం జగన్ సమస్యల నుంచి తప్పించుకుంటున్నారు అని రాధాకృష్ణ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పైగా రాజధాని అమరావతి కీళ్ళు విరిచి మూల కూర్చోబెట్టినా పట్టించుకోని సమాజం ఉండడం వల్ల క్యాసినో తాటాకు మంట చల్లారిపోయిందని వాపోయారు.

చిరంజీవిపైనా అక్కసు..

సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లి సినీనటుడు చిరంజీవి విందు ఆరగించి వచ్చారే కాని సినిమా టికెట్ల ధరలకు సంబంధించి ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాలేదు అని వ్యాఖ్యానించి మెగాస్టార్ పై తనకున్న అక్కసును వెళ్లగక్కారు. 2009 ఎన్నికల్లో చంద్రబాబు నాయకత్వంలోని మహాకూటమి ఓటమికి చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ కారణమని ఎల్లో బ్యాచ్ ఉద్దేశం. అందుకే అప్పటి నుంచి చిరంజీవిపై రాధాకృష్ణకు ప్రత్యేక కక్ష. ఏ సందర్భం వచ్చినా వదలకుండా ఆయనపై తన అక్కసు మీడియా సాక్షిగా వెళ్లగక్కుతుంటారు. పైగా తనకు గిట్టని సీఎం జగన్ తో కలిసి చిరంజీవి భోజనం చేయడాన్ని రాధాకృష్ణ జీర్ణించుకోలేకపోతున్నారు.

రాధాకృష్ణ కు ఈ ఐడియా అప్పుడెందుకు రాలేదో?

నియోజకవర్గానికి ఒక క్యాసినో ప్రారంభిస్తే ప్రభుత్వానికి ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం వస్తుందని రాధాకృష్ణ ఒక ఉచిత సలహా పడేశారు. చినబాబు లోకేశ్ విదేశీ బీచ్లో అర్థ నగ్నంగా ఉన్న అమ్మాయిల చుట్టుకొలతలను టేపుతో కొలిచినట్టు ఫొటోలు అప్పట్లో సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. లోకేశ్ కు ఉన్న ఆ అనుభవంతో సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్లోని అన్ని బీచ్ లలో ఎందుకు చుట్టుకొలతల క్రీడలను ప్రారంభించలేదు. టీడీపీ అధికారంలోకి ఉండగా ప్రభుత్వానికి ఆదాయం వచ్చే ఈ మార్గాన్ని రాధాకృష్ణ ఎందుకు సూచించలేదు?

వైశ్యుల గౌరవం కాపాడేందుకు చింతామణి నాటకాన్ని నిషేధించిన సీఎం జగన్.. రోశయ్య ఈ లోకం వీడినప్పుడు ఎందుకు నివాళులు అర్పించలేదు అని ప్రశ్నించారు. మరి పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్, బావమరిది హరికృష్ణ పోయినప్పుడు పాడె మోయని చంద్రబాబు.. ఒక రౌడీషీటర్ పాడెను ఎందుకు మోశారు? ఈ ప్రశ్న రాధాకృష్ణ ఎందుకు చంద్రబాబును అడగలేదు?

ముఖ్యమంత్రి పదవిలో ఉన్నవారికి అన్నివేళలా ప్రతి కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉండదు. రోశయ్య కు నివాళి అర్పించేందుకు సీఎం జగన్ వెళ్లనంత మాత్రాన ఆయనపై గౌరవంలేదని నిర్ణయం చేయటానికి రాధాకృష్ణ ఎవరు? గవర్నర్ గా, ముఖ్యమంత్రిగా పనిచేయడమేకాక వైశ్యులకు పెద్ద దిక్కు అయిన రోశయ్యను గౌరవించలేదని వాపోతున్న రాధాకృష్ణ.. మరి తానెందుకు ఆయన అడిగిన ఓ ప్రశ్నకు  కనీసం సమాధానం చెప్పలేదు. ఓ సామాన్య విలేకరిగా సైకిల్ పై తిరుగుతూ పత్రికకు వార్తలు సేకరించిన రాధాకృష్ణ.. ఆ పత్రికకే అధిపతిగా ఎలా మారిపోయారు? అని రోశయ్య అసెంబ్లీలో ప్రశ్నించారు. ఇన్ని ఏళ్లయినా ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేదు అంటే రోశయ్యపై రాధాకృష్ణకు గౌరవం లేదని అనుకోవాలా?

మెతకతనం వల్ల బాబు ఓడిపోయారట..

ఉద్యోగులతో ఏ ప్రభుత్వం పెట్టుకోకూడదని గతంలో ఎన్టీఆర్, చంద్రబాబు దెబ్బతిన్నారని కొన్ని అవాస్తవాలను రాశారు. ఉద్యోగుల పదవీ విరమణ వయసు తగ్గించిన ఎన్టీఆర్ పై అప్పటి ఉద్యోగులు దాడికి కూడా సిద్దపద్దారని రాశారు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా చేసిన
ఆకస్మిక తనిఖీలు, ఉద్యోగుల సస్పెన్షన్లు కారణంగా 2004 ఎన్నికల్లో ఉద్యోగులు కసితో ఓడించారని రాశారు. ప్రతి బూత్ లోనూ 50 ఓట్లు చొప్పున టీడీపీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్ కు అనుకూలంగా ఉద్యోగులు వేయించడం వల్ల బాబు ఓడిపోయారని సిద్దాంతీకరించారు.

అయితే టీడీపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఏర్పడిన వ్యతిరేకత, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజాప్రస్థానం పాదయాత్ర 2004 ఎన్నికల్లో చంద్రబాబు ఓటమికి కారణం కాగా దాన్ని కప్పి పుచ్చడానికి రాధాకృష్ణ ప్రయత్నం చేయడం ఆయన స్వామి భక్తికి నిదర్శనం. గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని 2014లో అధికారంలోకి వచ్చాక ఉద్యోగులను మంచి చేసుకోవడానికి వారికి అడిగినవి, అడగనివి ఇచ్చేసి బాబు మరీ మెతకగా వ్యవహరించారని రాశారు. ఆయన మెతకతనం కారణంగా ఉద్యోగులకు మొహం మొత్తి 2019లో ఓడించారని వేమూరి వారు సూత్రీకరించారు. కానీ టీడీపీ అవినీతి పాలన, జగన్ పాదయాత్ర 2019 ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ఓటమికి కారణం అన్న సంగతి అందరికీ తెలుసు. అయినా రాధాకృష్ణ వాస్తవాలు వక్రీకరిస్తూనే ఉంటారు. అదేమరి ఆర్కే మార్క్ సునిశిత విశ్లేషణ అంటే!

జిల్లాలు పెంచడం వల్ల ఉపయోగం లేదట..

పార్టీలకు అతీతంగా జిల్లాల సంఖ్య పెంచడాన్ని అందరూ ఆహ్వానిస్తుంటే రాధాకృష్ణకు మాత్రం నచ్చలేదు.
తెలంగాణలో 10 నుంచి 33కు జిల్లాల సంఖ్యను పెంచడం వల్ల పెద్దగా ఉపయోగం కనిపించలేదని రాశారు.
ఉద్యోగుల కొరత వల్ల అనుభవం లేనివారు కలెక్టర్లుగా పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. అయినా జిల్లాల సంఖ్యను జగన్ ఎందుకు పెంచుతున్నారు అని ఆశ్చర్యపోయారు.

ఉద్యోగులు సమ్మె చేయాలని జగన్ కోరుకుంటున్నారట!

పీఆర్సీ విషయంలో ఆందోళన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ
ఉద్యోగులు సమ్మె చేయాలని సీఎం జగన్ కోరుకుంటున్నారని రాధాకృష్ణ రాసేశారు. కనీసం ఒక నెల సమ్మె చేస్తే నెలకు రూ. 5 వేల కోట్ల చొప్పున వారికి ఇవ్వాల్సిన జీతాలు మిగులుతాయని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారట! గత ప్రభుత్వాలు సమ్మె కాలంలో కూడా జీతాలు ఇచ్చాయని, జగన్ మాత్రం ఇవ్వరు అని రాధాకృష్ణ తీర్మానించేశారు. ఇంత దుర్మార్గమైన రాతలు రాస్తూ తమది దమ్మున్న ఛానెల్ అని, వుయ్ రిపోర్ట్ యూ డిసైడ్ అని స్లోగన్లు ఇచ్చుకోవడానికి అసలు రాధాకృష్ణకు సిగ్గుందా! అన్న అనుమానం ఎవరికైనా కలుగుతుంది.