ఏపీలో సినిమా టికెట్ల వ్యవహరం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. ఈ అంశంలో అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ కొన్ని రోజుల నుంచి వరుస ట్విట్లతో ఉక్కిరి బిక్కిరి చేసిన విషయం తెలిసిందే. గత వారం నుంచి టికెట్ రేట్ల విషయంలో ప్రశ్నలు సంధించిన ఆర్జీవీ మంత్రి పేర్ని పిలుపుతో అమరావతి సెక్రటేరియట్ వెళ్లి భేటీ అయ్యారు. అయితే ఈ భేటీ అటు సినిమా, ఇటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో అమరావతి సెక్రటేరియట్ వెళ్ళిన ఆర్జీవీ.. మంత్రి పేర్ని నాని ఛాంబర్ కు వెళ్లి మాట్లాడారు. చాలాసేపు సాగిన చర్చతో, మంత్రితో వర్మ భేటీ ముగిసింది. భేటీ అనంతరం వర్మ మాట్లాడుతూ, ఏపీలో సినిమా టికెట్ల ధరలు తగ్గించడాన్ని వ్యతిరేకించానని, ఏపీలో ఉన్న తక్కువ టికెట్ ధరలు దేశంలో మరెక్కడా లేవని చెప్పానని పేర్కొన్నారు.
పొరుగు రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాల్లో పరిస్థితిని వివరించానని ఆయన అన్నారు. ఓ సినీ నిర్మాతగా ప్రభుత్వానికి తన అభిప్రాయాలు చెప్పానని అన్నారు. టికెట్ ధరలపై ఐదారు కీలక అంశాలు ప్రస్తావించానని, అయితే మంత్రి పేర్ని నాని ఎన్నో ఇతర అంశాలు ప్రస్తావనకు తీసుకువచ్చారని కూడా వర్మ పేర్కొన్నారు. టికెట్ ధర పెరిగితే ప్రజలు ఇబ్బందిపడతారని మంత్రి చెప్పారని కానీ టికెట్ ధరలు తగ్గిస్తే ఈ ప్రభావం సినిమా నాణ్యతపై పడుతుందని తాను చెప్పానని అలాగే తప్పుడు కలెక్షన్లు, పన్ను ఎగవేతలపై చర్యలు ఎలా తీసుకోవచ్చనేది ప్రభుత్వానికి సూచించానని వెల్లడించారు. అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకుంటారని భావిస్తున్నానని చెప్పారు. ఈ సమస్య పరిష్కార బాధ్యత ప్రభుత్వం, సినిమా పరిశ్రమపై ఉందని వర్మ స్పష్టం చేశారు. ఈ సమస్య పరిష్కారం అవుతుందన్న నమ్మకం ఉందని వర్మ పేర్కొన్నారు.
చర్చలు జరిగిన తీరుపై 100 శాతం సంతృప్తిగా ఉందని తెలిపారు. ఇక మీడియాతో మాట్లాడిన మంత్రి పేర్ని నాని సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారమే సినిమా టికెట్ ధరలు ఉన్నాయని అన్నారు. ఆర్జీవీ తాను చెప్పాల్సింది చెప్పారని, ప్రభుత్వ నిర్ణయాలు చట్ట ప్రకారమే జరుగుతున్నాయని ఆయన దృష్టికి తీసుకువెెళ్ళామని మంత్రి తెలిపారు. ఎవ్వరినీ ఇబ్బంది పెట్టే ప్రభుత్వం మాది కాదన్న ఆయన, నిబంధనలు అందరికీ ఒక్కటేనని స్పష్టం చేశారు. ఇప్పటికే సినిమా టికెట్ అంశానికి సంబంధించి కమిటీ ఏర్పాటైందన్న ఆయన, కమిటీ సూచనల ప్రకారం తదుపరి నిర్ణయాలు ఉంటాయన్నారు. ఆర్జీవీ చెప్పిన అంశాలను ఉన్నత స్థాయి కమిటీ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. కోవిడ్ పరిస్థితుల కారణంగా సినిమా థియేటర్లకు 50 శాతం ప్రేక్షకులను మాత్రమే అనుమతిస్తున్నామని.. అందరూ సహకరించాలని మంత్రి పేర్ని నాని విజ్ఞప్తి చేశారు. ఇక ఈ భేటీలో హోమ్ సెక్రెటరీ విజయకుమార్, ఎఫ్డీసీ సెక్రెటరీ విజయకుమార్ పాల్గొన్నారు.
Also Read : అధికార పార్టీ సర్వే.. ఎమ్మెల్యేల జాతకాలు తేలుతున్నాయ్