Idream media
Idream media
పీవీ.. ఆ పేరు వినగానే గుర్తొచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ.. ఆయన తుది వరకూ కాంగ్రెసులోనే కొనసాగిన అసలైన రాజకీయ వాది.. ఏఐసీసీ అధ్యక్ష పదవిని సైతం అలంకరించారు.. కాంగ్రెస్ కుటుంబాలైన నెహ్రూ, గాంధీ కుటుంబాల నుంచి కాకుండా.. ప్రధాన మంత్రిగా ఐదేళ్ల పాటు (1991 నుంచి 1996) పరిపాలనా కాలాన్ని పూర్తి చేసుకున్న మొట్టమొదటి బయటి వ్యక్తి పీవీ నరసింహారావు. ఆయన శత జయంతి ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. పీవీ కుమార్తె వాణి దేవికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి అప్పగించేందుకు సిద్ధమవుతోంది. పీవీ శతజయంతి ఉత్సవాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ స్పందించడానికి ముందే ప్రభుత్వం ఉత్సవాలకు ఏర్పాట్లు చేసి పీవీ కుటుంబ సభ్యుల్ని ఆకట్టుకుంది. ఇప్పుడు పీవీ కుమార్తెకు ఎమ్మెల్సీ ఇవ్వడం ద్వారా పీవీని కాంగ్రెస్ కు దూరం చేసే ఎత్తుగడగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కాంగ్రె్సను భుజానికెత్తుకుని ఆదుకున్న పీవీకి ఆ పార్టీ సరైన గుర్తింపు, గౌరవం ఇవ్వలేదన్న ఆవేదన పీవీ కుటుంబీకుల్లో ఉంది. దానిని తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో భాగంగానే టీఆర్ఎస్ ఆమెకు ఎమ్మెల్సీ ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
అనూహ్యంగా తెరపైకి ఆమె పేరు..
పీవీ కుమార్తె వాణి దేవి హైదరాబాద్ లోని జె.ఎన్.టి.యు నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. మాసాబ్ ట్యాంక్ లోని అదే కాలేజీకి చెందిన జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో ఫ్యాకల్టీగా పని చేశారు. అనంతరం 1991లో సురభి ఎడ్యుకేషనల్ సొసైటీని స్థాపించారు. ప్రస్తుతం విద్యా సంస్థల అధినేతగా కొనసాగుతున్నారు. ఈమెకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవిని టీఆర్ఎస్ అధిష్ఠానం ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మాజీ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి స్థానాలు ప్రస్తుతం ఖాళీగా ఉండగా.. ఆగస్టులో ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ పదవీ కాలమూ పూర్తవుతోంది. ఈ మూడు స్థానాలూ గవర్నర్ కోటాలోవే. నాయిని, కర్నె ప్రభాకర్లను రెన్యువల్ చేయడం దాదాపు ఖాయమని చెబుతున్నారు. మూడో సీటుకు పార్టీలో పలువురు సీనియర్లు పోటీ పడుతున్నారు. అనూహ్యంగా పీవీ కుమార్తెను పార్టీ అధిష్ఠానం తెరపైకి తీసుకొచ్చిందనే ప్రచారం జరుగుతోంది.
తెలంగాణ వాడిగా పీవీకి క్రేజు..
గాంధీ, నెహ్రూ కుటుంబాల తర్వాత.. కాంగ్రెస్ నుంచి ప్రధాని పదవి అలంకరించిన పీవీని తొలి నుంచీ తమ వాడిగా గుర్తించ లేదనే అపవాదు కాంగ్రెస్ పార్టీకి ఉంది. కారణాలైమేనా ఆయనకు ఇవ్వాల్సిన గుర్తింపు, గౌరవం ఇవ్వలేదు. పీవీ మరణించిన తర్వాత ఏఐసీసీ కార్యాలయం లోపలికి ఆయన భౌతిక కాయాన్ని తీసుకెళ్లక పోవడం వంటి పరిణామాలు కూడా నాడు తీవ్ర చర్చనీయాంశంగా, కాంగ్రెస్ పై ప్రజల్లో ద్వేషం పెంచేలా చేశాయి. తెలంగాణ నుంచి ప్రధాని స్థాయికి ఎదిగిన పీవీ పట్ల తెలంగాణ ప్రజల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ పరిణామాన్ని తమకు అనుకూలంగా మలచుకోవాలని టీఆర్ఎస్ భావిస్తోందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అందుకే, పీవీ శత జయంతికి ఏడాది ముందే చకచకా పావులు కదిపిన అధికార పార్టీ.. ప్రభుత్వం తరఫున ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఎంపీ కేకే నేతృత్వంలో కమిటీ వేసి.. అందులో పీవీ కుటుంబ సభ్యులకూ చోటు కల్పించింది. తాజాగా, ఆయన కుమార్తె వాణీదేవికి ఎమ్మెల్సీ పదవిని ఆఫర్ చేసిందని రాజకీయ వర్గాలు తెలిపాయి. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు ఈ పరిణామాలను కేసీఆర్ అవకాశంగా వాడుకోనున్నారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
పీవీ కుటుంబ సభ్యుల కూడా…
కాంగ్రెస్ పార్టీ పీవీ విషయంలో, తమ విషయంలో అనుసరించిన వైఖరి కారణంగా ఆయన కుటుంబ సభ్యులు కూడా టీఆర్ఎస్ పట్ల సానుకూల దృక్పథాన్నే కలిగి ఉన్నట్లు చెబుతున్నారు. పీవీ తర్వాత ఆ స్థాయిలో తెలంగాణ నుంచి జాతీయ రాజకీయాల్లో రాణించే సత్తా కేసీఆర్కే ఉందన్న అభిప్రాయాన్నీ వారు సన్నిహితుల వద్ద వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు. పీవీ శత జయంతి ఉత్సవాలకు సంబంధించి టీఆర్ఎస్ ప్రకటన అనంతరం.. కొద్ది రోజులకు నష్ట నివారణ కోసం మాజీ మంత్రి గీతారెడ్డి చైర్మన్గా, మాజీ ఎంపీ వీహెచ్ గౌరవాధ్యక్షునిగా టీపీసీసీ హడావుడిగా పీవీ శత జయంతి ఉత్సవ కమిటీని వేసింది. ఏడాది పొడవునా కార్యక్రమాలు నిర్వహించాలని కమిటీ నిర్ణయించింది. ఈనెల 24న ఇందిరా భవన్లో జరిగే ప్రారంభ కార్యక్రమానికి ఆహ్వానించేందుకు పీవీ కుమారుడు ప్రభాకర్రావు, కుమార్తె వాణీదేవి ఇళ్లకు వెళ్లిన టీపీసీసీ బృందానికి ఒకింత చేదు అనుభవమే ఎదురైంది. మాజీ ప్రధాని మాత్రమే కాకుండా ఏఐసీసీ అధ్యక్షునిగానూ పనిచేసిన పీవీ శత జయంతిని ఏఐసీసీ స్థాయిలో నిర్వహించాలి కదా అని ప్రభాకర్రావు వారిని ప్రశ్నించినట్లు తెలిసింది. ఏఐసీసీ స్థాయిలో అన్ని పార్టీల వారినీ పిలిచి నిర్వహిస్తేనే తాము వస్తామని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం. వాణీదేవి కూడా అదే అభిప్రాయాన్ని వెలిబుచ్చినట్లు చెబుతున్నారు. ఇన్ని రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీకి పీవీ గుర్తుకు వచ్చారా? అని ఆమె ప్రశ్నించినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా.. పీవీని ప్రధానిని చేసిందీ.. ఏఐసీసీ అధ్యక్ష స్థానంలో కూర్చోపెట్టిందీ సోనియానే అని ఇటీవల జరిగిన కమిటీ సమావేశంలో వీహెచ్ పేర్కొనడం గమనార్హం.