iDreamPost
android-app
ios-app

2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం లేకుంటే టీడీపీ గెలిచేదా?

  • Published Jan 12, 2022 | 2:25 AM Updated Updated Mar 11, 2022 | 10:24 PM
2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం లేకుంటే టీడీపీ గెలిచేదా?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి 2009 అసెంబ్లీ ఎన్నికలకు ఓ ప్రత్యేకత ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన చివరి ఎన్నికలు అవే కావడం ఓ విశేషమయితే అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జరిగిన తొలి ఎన్నికలు కూడా అవే కావడం విశేషం. ఇక అధికారంలో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండోసారి గెలవగా, మహాకూటమిగా బరిలో దిగిన చంద్రబాబుకి చేదు అనుభవం ఎదురయ్యింది. అదే సమయంలో టాలీవుడ్ మెగాస్టార్ గా ఉన్న చిరంజీవి సొంత పార్టీ పెట్టి ఒంటరిగా బరిలో దిగిన ఏకైక ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోని పార్టీ కేవలం 18 స్థానాలకు మాత్రమే పరిమితం కావడం మరో ప్రత్యేకత. ఇలా వైఎస్సార్, చంద్రబాబు, చిరంజీవి తో పాటుగా ఏపీ రాజకీయ ప్రస్థానంలో ఈ ఎన్నికలకు ప్రాధాన్యత ఉంది.

తాజాగా ఏపీలో కాపుల రాజకీయ సమీకరణాలు ఆసక్తిగా మారుతున్నాయి. వివిధ క్యాంపులు ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నాయి. జనసేనతో కాపు జనాలకు ప్రయోజనం లేదని నిర్ధారించుకున్న నేతలు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. పలు సమీకరణాలకు సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పోటీలో లేకపోతే తాను విజయం సాధించేవాడినంటూ ఇప్పుడు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా కనిపిస్తున్నాయి. 13 ఏళ్ల క్రితం నాటి పరిణామాలు వర్తమానంలో యువతకు అర్థం కాకపోవచ్చు గానీ నాటి నుంచి రాజకీయాలను పరిశీలిస్తున్న వారు మాత్రం అర్థం చేసుకుంటారనే సోయ కూడా లేకుండా చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.

ఇక 2009 ఎన్నికల ఫలితాల ప్రకారం కాంగ్రెస్ పార్టీ 156 స్థానాలు గెలుచుకుంది. 294 అసెంబ్లీ సీట్లున్న సభలో 148 మంది సభ్యుల మ్యాజిక్ మార్క్ కి మరో 8 స్థానాలు ఆధిక్యం మాత్రమే కాంగ్రెస్ సాధించింది. ఇక టీడీపీకి 92 స్థానాలు దక్కాయి. ప్రజారాజ్యం 18 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుంది. ఓట్ల శాతం ప్రకారం చూస్తే కాంగ్రెస్ కి 36.56 శాతం ఓట్లు దక్కాయి. ఇది అంతకుముందు జరిగిన 2004 ఎన్నికలతో పోలిస్తే కేవలం 2 శాతం తగ్గుదల మాత్రమే. అయితే టీడీపీకి ఆ ఐదేళ్లలో ఏకంగా 9 శాతం ఓట్లను కోల్పోయింది. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ చంద్రబాబుకి జనాల్లో ఆదరణ దక్కకపోవడంతో కేవలం 28.12 శాతం ఓట్లు మాత్రమే లభించాయి. ఇక ప్రజారాజ్యం 18 శాతం ఓట్లు సాధించినా దానికి అనుగుణంగా సీట్లు దక్కించుకోలేకపోయింది. దానికి కాపుల ఓట్లు ప్రజారాజ్యానికి పడడమే కారణమని తాజాగా చంద్రబాబు సూత్రీకరణ.

Also Read : అయ్యో పాపం… ఆదాయపుపన్ను శాఖపై చంద్రబాబు ఎందుకు అలా వాపోతున్నారు..

చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి కాపుల ఓట్లను కొల్లగొడితే వైఎస్సార్ బలహీనమవుతారని టీడీపీ ఆశించింది. దానికి తగ్గట్టుగా చిరు రాజకీయ ఆరంగేట్రం కోసం ఆంధ్రజ్యోతి, ఈనాడు వంటి పత్రికలు హడావిడి చేసేవి, ఆయన కార్యక్రమాలకు పెద్ద స్థాయిలో ప్రచారం కల్పించేవి. సహజంగా గోదావరి, కృష్ణా తీరంలో ఉండే కాపులంతా టీడీపీ వ్యతిరేకులుగా ఉండడంతో వారి ఓట్లు కాంగ్రెస్ వైపు మళ్లకుండా చూస్తే అధికార పార్టీ ఓడిపోతుందని బాబు అండ్ బ్యాచ్ అంచనా వేసింది. కానీ తీరా చూస్తే వైఎస్ జమానాలో కాపులకు తగిన ప్రాధాన్యత దక్కడంలో ఎక్కువ మంది టీడీపీ నేతలే ప్రజారాజ్యం వైపు మళ్లారు. పైగా రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ పథకాలు మరోసారి అధికారంలోకి తీసుకొస్తాయనే విశ్వాసం ఉండడంతో కాంగ్రెస్ నేతలు చాలా కొద్దిమంది మాత్రమే పార్టీని వీడారు. కానీ టీడీపీ కాపు నేతలు మాత్రం ప్రజారాజ్యానికి క్యూ కట్టడంతో టీడీపీ నేతల్లో కలవరం మొదలయ్యింది.

చివరకు ఎన్నికల ఫలితాలను బట్టి ప్రజారాజ్యం ప్రభావం కనిపించిన విశాఖ నుంచి గుంటూరు వరకూ టీడీపీ కి కొంత ఓట్లు లభించాయి. కాంగ్రెస్ తన సీట్లు కోల్పోయింది. ప్రజారాజ్యం సాధించిన సీట్లు అంతకుముందు కాంగ్రెస్ గెలిచినవే కావడం విశేషం. దాంతో ప్రజారాజ్యంతో టీడీపీ ఆశించింది జరగకపోయినా ఎక్కువ నష్టం మాత్రం కాంగ్రెస్ కే జరిగింది. అప్పట్లోనే ఎన్నికల సరళిపై సర్వే చేసిన ప్రణయ్ రాయ్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

ఆంధ్రా ప్రాంతంలో చిరంజీవికి 17 శాతం ఓట్లు లభించే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు. అందులో కాంగ్రెస్ నుంచి 12 శాతం, టీడీపీ నుంచి 5 శాతం ప్రజారాజ్యం వైపు మళ్లుతారని, ఒక్క ఎంపీ సీటు కూడా ప్రజారాజ్యం గెలుచుకునే ఛాన్స్ లేదని తేల్చారు. సరిగ్గా ఫలితాలు కూడా ఆ దిశలోనే ఉన్నాయి. ప్రజారాజ్యం ఎంపీ సీట్లు గెలుచుకోకపోగా కాంగ్రెస్ 33 ఎంపీ సీట్లు దక్కించుకుంది.

ప్రజారాజ్యం కారణంగా నష్టపోయినప్పటికీ వైఎస్సార్ నిలదొక్కుకోగా, చిరంజీవిని అడ్డుపెట్టుకుని అధికారం సాధించాలనుకున్న చంద్రబాబు భంగపడ్డారు. చివరకు చిరంజీవి, కాపుల మీద అడ్డగోలు రాతలతో ఆపార్టీ మనుగడకే ముప్పు పెట్టారు. ప్రజారాజ్యం తమ ప్రయోజనాలను నెరవేరుస్తుందనే అంచనాలు తప్పడంతో అసహనమంతా చిరంజీవి మీద చాటుకున్నారు. ఆపార్టీ నేరుగా కాంగ్రెస్ లో విలీనమయ్యే వరకూ వివిధ రకాలుగా రాజకీయ ఆటలు ఆడుకున్నారు. ఆ తర్వాత 2014లో జనసేన సహాయంతో కాపుల ఓట్లను కొల్లగొట్టి అధికారం సాధించలిగారు. కానీ మళ్లీ అధికారంలోకి రాగానే చిరంజీవి సహా కాపుల మీద అవాకులు చెవాకులు పేలుతూ తీవ్రంగా అవమానించారు. చిరంజీవిని ఉద్దేశించి బహిరంగంగానే బాలకృష్ణ వంటి వారు చేసిన విమర్శలు అందుకు ఉదాహరణగా ఉన్నాయి. ఇప్పుడు మరోసారి కాపుల ఓట్ల కోసం ప్రజారాజ్యం ప్రస్తావన తీసుకొచ్చి చంద్రబాబు కొత్త డ్రామాకు తెరలేపుతున్నట్టు కనిపిస్తోంది.

Also Read : తన బలహీనతను ఒప్పుకున్న బాబు