iDreamPost
android-app
ios-app

ప్ర‌తిష్ఠాత్మ‌కంగా అంబేడ్క‌ర్ విగ్ర‌హ ఏర్పాటు : రెం‌డ్రోజుల్లో క‌మిటీ భేటీ!

ప్ర‌తిష్ఠాత్మ‌కంగా అంబేడ్క‌ర్ విగ్ర‌హ ఏర్పాటు : రెం‌డ్రోజుల్లో క‌మిటీ భేటీ!

విజయవాడలోని స్వరాజ్‌ మైదాన్‌లో అంబేడ్క‌ర్ విగ్ర‌హం ఏర్పాటు విష‌యంలో ప్ర‌భుత్వం భారీ ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోనే కాదు.. యావ‌త్ దేశం దృష్టి ఈ విగ్ర‌హంపై ప‌డేలా ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకుంది. 125 అడుగుల ఎత్తులో ఉండే విగ్రహం డిజైన్ ఆక‌ట్టుకునేలా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. భారత పార్లమెంట్‌లోని డాక్టర్ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం తరహాలోనే ఉండాల‌ని భావిస్తోంది. పార్కు సుందరీకరణకు ఐదుగురు కన్సల్టెంట్లు డిజైన్‌ సమర్పించారు. దీనిపై సీఎం జ‌గ‌న్ ఆదేశాల మేర‌కు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపె విశ్వరూప్, దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ఇప్ప‌టికే అధికారులతో సమావేశమై విగ్ర‌హ ఏర్పాటుపై తీవ్రంగా చ‌ర్చించారు. చెన్నైకి చెందిన కన్సల్టెంట్‌ ఇచ్చిన విగ్రహ డిజైన్‌ను ఖరారు చేశారు.

స‌ర్వాంగ సుంద‌రంగా తీర్చిదిద్దేలా

అంబేడ్క‌ర్ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేసే స్వరాజ్‌ మైదాన్ ను ప్ర‌భుత్వం స‌ర్వాంగ సుంద‌ర‌గా తీర్చిదిద్ద‌నుంది. సుందరీకరణకు ఐదుగురు కన్సల్టెంట్స్‌ నుంచి డిజైన్‌లు రాగా, వీటన్నింటినీ మంత్రులు పరిశీలించారు. విగ్రహం కింద పీట (పెడస్టల్‌) ఎత్తు 30 అడుగులు ఉంటుంది. దీనిపై 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేస్తారు. కింది భాగంలో గ్రంధాలయం, ధ్యాన మందిరం, కన్వెన్షన్ హాలు వంటివి ఏర్పాటు చేస్తారు. మిగిలిన స్థలంలో పార్క్‌ ఉంటుంది. పచ్చదనం ఉండే డిజైన్‌లకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వ ఆలోచన కాగా, సర్వాంగ సుందరంగా సందర్శకులను ఆకట్టుకునే విధంగా వచ్చే డిజైన్‌లకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. నేడో, రేపో విగ్రహ కమిటీ సమావేశం కానుంది. ఆ సమావేశంలో కమిటీ సభ్యులు తుది డిజైన్‌ ఖరారు చేస్తారు. సీఎం సూచనలు తీసుకున్న తరువాత పనులు మొదలు పెట్టాలని నిర్ణయించారు.