iDreamPost
android-app
ios-app

యూపీ ఎన్నికల కోసమే కళ్యాణ్ సింగ్ కు పద్మ విభూషణ్ అవార్డు? ఓబీసీలు తృప్తి పడతారా

  • Published Jan 26, 2022 | 3:01 AM Updated Updated Jan 26, 2022 | 3:01 AM
యూపీ ఎన్నికల కోసమే కళ్యాణ్ సింగ్ కు పద్మ విభూషణ్ అవార్డు? ఓబీసీలు తృప్తి పడతారా

దేశంలో అందరి దృష్టి యూపీ ఎన్నికల మీద ఉంది. అధికార బీజేపీ ఇక్కడ గట్టిపోటీని ఎదుర్కొంటోంది. ప్రధాన ప్రతిపక్షం సమాజ్ వాదీ పార్టీ దూసుకొస్తోంది. ఏకంగా బీజేపీకి చెందిన ముగ్గురు మంత్రులు, పదిమందికి పైగా ఎమ్మెల్యేలను కాజేసి నైతికంగా ముందడుగు వేసింది. అదే సమయంలో అఖిలేష్ యాదవ్ కుటుంబ సభ్యులను ఆకట్టుకోవడం ద్వారా బీజేపీ ఎత్తుకు పైఎత్తులు వేసింది. ఈ పరిణామాలతో యూపీ వ్యవహారాలు ఆసక్తిగా మారాయి. తాజాగా పద్మ అవార్డుల జాబితాలో పద్మ విభూషణ్ అవార్డును మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ కి ప్రకటించడం చర్చకు దారితీసింది. రాజకీయంగా కీలక రాష్ట్రంలో ఎన్నికల ముందు కళ్యాణ్‌ సింగ్  మరణానంతర పద్మవిభూషణ్ గా ప్రకటించడం ఏమేరకు కలిసివస్తుందోననే చర్చ మొదలయ్యింది.

యూపీలో బీజేపీకి 2014 నుంచి వరుసగా విజయపరంపర సాగుతోంది. అవి కూడా భారీ విజయాలు కావడం విశేషం. అయితే ఈసారి పరిణామాలు భిన్నంగా ఉన్నాయి. ముఖ్యంగా ఓబీసీ ఓటర్ల ఆధారంగా బీజేపీ ఎదిగింది. సుదీర్ఘకాలంగా ఓబీసీలను ఆకట్టుకోవడం ద్వారా ముందంజ వేస్తోంది. అయితే ఇటీవల ఠాకూర్ యోగీ ఆదిత్యనాథ్ తీరుతో బ్రాహ్మణ ఓటర్లతో పాటుగా ఓబీసీలలో కూడా వ్యతిరేకత కనిపిస్తోంది. యాదవయేతర బీసీలను సమీకరించి సత్తా చాటుకున్న బీజేపీకి ఇది సమస్య అవుతోంది. ఇటీవల ఫిరాయించిన మంత్రుల్లో ఓబీసీలే ఉండడం బీజేపీలో బెంగకు ఆస్కారమిచ్చింది. అదే సమయంలో తూర్పు యూపీలో పట్టున్న రాజబర్ల నాయకుడు కూడా బీజేపీని వీడి ఎస్పీ చెంతన చేరడం కమలంలో కలవరానికి కారణమవుతోంది.

ఈ నేపథ్యంలో ఓబీసీలను ఆకట్టుకునే పని సాగుతోంది. ఉపముఖ్యమంత్రికి ప్రాధాన్యత పెరిగింది. ఇటీవల కేంద్ర క్యాబినెట్ విస్తరణలో కూడా ఓబీసీలకు అది కూడా యూపీకి చెందిన నేతలకు అవకాశాలు దక్కాయి. తద్వారా ఓబీసీలు చేజారిపోకుండా చూసుకునే సంకల్పంతో బీజేపీ ఉన్నట్టు స్పష్టమవుతోంది. వారి కోసం వివిధ యత్నాలు సాగిస్తోంది. అదే పరంపరలో తాజాగా ప్రజా వ్యవహారాల కోటాలో కళ్యాణ్‌ సింగ్ ని పద్మవిభూషణ్ కి నామినేట్ చేసినట్టు పలువురు భావిస్తున్నారు. జనరల్ బీపీ రావత్, రాధేశ్యామ్ ఖేమ్కా, ప్రభా ఆత్రే వంటి వారితో పాటుగా కళ్యాణ్‌ సింగ్ ని ఈ అవార్డుకి ఎంపిక చేశారు. దాంతో యూపీ ఎన్నికల ముంగిట ఈ వ్యవహారం రాజకీయ అవసరాల కోసమేననే వారు వినిపిస్తున్నారు.

సుదీర్ఘకాలం పాటు కళ్యాణ్ సింగ్ బీజేపీలో పనిచేశారు. యూపీ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. తన హయాంలోనే బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన జరిగింది. ఆ తర్వాత బీజేపీలో ఓబీసీ నేతగా ఎదిగి కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. కొంతకాలం బీజేపీతో విబేధించి సొంతంగా పార్టీ పెట్టుకున్నప్పటికీ మళ్లీ కమలం గూటిలోనే చేరిపోయారు. కళ్యాణ్‌ సింగ్ వారసులు కూడా ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. ఈ పరిణామాలతో తాజా పద్మవిభూషణ్ అవార్డు బీజేపీకి ఏమేరకు ఉపయోగపడుతుందన్నది ఆసక్తికరమే.