iDreamPost
android-app
ios-app

ఏపీలో మహిళల గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదట!

  • Published Jan 29, 2022 | 12:43 PM Updated Updated Mar 11, 2022 | 10:20 PM
ఏపీలో మహిళల గురించి ప్రభుత్వం పట్టించుకోవడం  లేదట!

ఏపీలో పట్టపగలు మహిళలు నడవలేని దుస్థితి ఉందని, వారిపై అకృత్యాలు పెరిగిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ శనివారం విపరీత వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ సీపీ ముసుగు కప్పుకున్న నీచులు ఆడబిడ్డలపై అకృత్యాలకు పాల్పడుతున్నారని ఎప్పటిలా నిరాధార ఆరోపణలు గుప్పించారు. మహిళల రక్షణకు గతంలో ఏ ప్రభుత్వం తీసుకోనంత శ్రద్ధ ప్రస్తుత వైఎస్సార్ సీపీ సర్కారు తీసుకుంది. దిశ యాప్, దిశ పోలీసు స్టేషన్ల ఏర్పాటు, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, గ్రామ స్థాయిలోనే మహిళా పోలీసులు.. ఇలా మహిళల రక్షణలో మన రాష్ట్రం దేశంలోనే మిన్నగా ఉంది. ఈరోజు రాష్ట్రంలో 1,01,19,642 మంది సెల్ ఫోన్లలో దిశ యాప్ ఉంది.

అక్కచెల్లెమ్మలు ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు ఫోన్ ను అటూ ఇటూ కదిపితే చాలు నిమిషాల్లో పోలీసులు చేరుకొని రక్షణగా నిలుస్తారు. అధునాతన టెక్నాలజీ సాయంతో అలాంటి వ్యవస్థను రాష్ట్రంలో అమలులోకి తెచ్చారు. లోకేశ్ ఆరోపిస్తున్నట్టు పట్టపగలు కూడా ఒంటరిగా మహిళలు తిరగలేని స్థితి రాష్ట్రంలో ఎక్కడా లేదు. పైగా అర్థరాత్రి వరకు ఉద్యోగాలు చేసి కూడా
ఒంటరిగా క్షేమంగా ఇంటికి చేరుకుంటున్నారు. అందుకు పోలీసులు తీసుకున్న రక్షణ చర్యలే కారణం.

పట్టపగలు మహిళలపై అకృత్యాలు జరిగింది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే అన్న సంగతి లోకేశ్ మర్చిపోయారా? నాటి ఎమ్మెల్యే రోజాను నిష్కారణంగా అరెస్ట్ చేసి ఒక పూటంతా పోలీసు వాహనాల్లో అమరావతి చుట్టూ భయానక వాతావరణంలో తిప్పడం పోలీసులు చేసిన అకృత్య చర్య కాదా? ఎమ్మార్వో వనజాక్షిని పట్టపగలు టీడీపీ నాయకులే జుట్టు పట్టి ఈడ్వడం గుర్తులేదా? పైగా ఈ వ్యవహారంలో ఆ మహిళా ఎమ్మార్వోదే తప్పు అని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు పంచాయతీ చేసి మరీ దోషులను వెనకేసుకొచ్చింది నిజం కాదా? కాల్ మనీ సెక్స్ రాకెట్లో టీడీపీ నేతలు సూత్రధారులు అన్న సంగతి జనం మర్చిపోయారనుకుంటున్నారా? అని వైఎస్సార్ సీపీ నేతలు లోకేశ్ ను ప్రశ్నిస్తున్నారు.

క్షేత్రస్థాయి పరిజ్ణానం లేకుండా..

ప్రభుత్వం సొంత మద్యాన్ని అమ్ముతూ అక్కాచెల్లెమ్మల పుస్తెలు తెంపేస్తోందని అవాస్తవాలను మాట్లాడుతున్న
లోకేశ్ ప్రభుత్వంపై బురద జల్లాలని చూస్తున్నారు. టీడీపీ జమానాలో రాష్ట్రంలో ప్రతివీధిలో ఆఖరికి గుడిపక్కన, బడిపక్కన కూడా బెల్ట్ షాపులు కనిపించేవి. ఇవాళ ఎక్కడా లేకుండా వైఎస్సార్ ప్రభుత్వం కట్టడి చేసింది. దశలవారీ మద్య నిషేధం అమలుకు కట్టుబడి షాపుల సంఖ్యను గణనీయంగా తగ్గించింది. వాస్తవాలు ఇలా ఉంటే వీటికి పూర్తి భిన్నంగా స్పందించడం ద్వారా రాష్ట్రంలో ఏం జరుగుతోందో తనకు తెలియదు అని లోకేశ్ ఒప్పుకున్నట్టు అయింది.

క్షేత్రస్థాయి పరిజ్ణానం లేకుండా పున్నానికి, అమావాస్యకు ఇలా అర్థంపర్థం లేని విమర్శలు చేయడం లోకేశ్ కు అలవాటుగా మారిపోయిందని వైఎస్సార్ సీపీ నేతలు తప్పుపడుతున్నారు. ఈ నెల 31న తెలుగు మహిళ ఆధ్వర్యంలో నారీ సంకల్ప దీక్ష నిర్వహించనున్నామని గొప్పగా చెబుతున్న లోకేశ్ కు అసలు ఆ దీక్ష ఎందుకు చేస్తున్నారు. చేయాల్సిన అవసరం ఏముంది? అన్నది తెలుసా? కేవలం అధికార పార్టీపై బురదజల్లడం కోసం ఇలాంటి దొంగ దీక్షలు చేసినంత మాత్రాన
టీడీపీ హయాంలో మహిళలపై
చేసిన అకృత్యాలను జనం మర్చిపోరని లోకేశ్ తెలుసుకోవాలని వైఎస్సార్ నేతలు సూచిస్తున్నారు.