Idream media
Idream media
తెలంగాణలో రాజకీయ పరిణామాలు జెట్ వేగంతో జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉన్నా.. వాటి గురించి ఆయా పార్టీలు ఇప్పటి నుంచే ఆలోచిస్తున్నాయి. ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. పోటీదారులు, సీట్ల లెక్కలు వేసుకుంటున్నారు. ఈ ఎన్నికల తంతులో ఇటీవల వరకు పీసీపీ అధ్యక్షుడుగా పని చేసిన ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి కూడా భాగస్వాములయ్యారు. వచ్చే ఎన్నికల్లో పోటీపై ఉత్తమ్కుమార్ రెడ్డి ఇప్పుడే ప్రకటన చేశారు.
ఈ సారి అసెంబ్లీ నుంచి పోటీ..
తెలంగాణ ఏర్పాటు తర్వాత 2014లో జరిగిన తొలి ఎన్నికల్లో ఉత్తమ్కుమార్ రెడ్డి, ఆయన సతీమణి పద్మావతి రెడ్డిలు హుజూర్నగర్, కోదాడ నుంచి గెలిచారు. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో పద్మావతి రెడ్డి కోదాడలో ఓడిపోగా. హుజూర్ నగర్లో ఉత్తమ్ గెలిచారు. లోక్సభకు వెళ్లాలని అనుకున్నారో లేదా సతీమణిని అసెంబ్లీకి పంపాలనుకున్నారో ఏమో గానీ ఉత్తమ్ 2019 లోక్సభ ఎన్నికల్లో నల్గొండ నుంచి పోటీ చేసి గెలిచారు. దీంతో హుజూర్నగర్కు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో పద్మావతిరెడ్డి పోటీ చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి, 2018లో ఉత్తమ్పై ఓడిపోయిన సైదిరెడ్డి.. ఉప ఎన్నికల్లో గెలిచారు. 2023లో తెలంగాణ శాసన సభకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో హుజూర్నగర్ నుంచి తాను పోటీ చేయబోతున్నట్లు ఉత్తమ్కుమార్ రెడ్డి ప్రకటించారు.
అనుమానాలకు తెరపడినట్లేనా..?
పీసీసీ పదవి నుంచి తప్పుకున్న తర్వాత.. ఉత్తమ్కుమార్ రెడ్డి పార్టీ మారతారనే ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. 2014లో హుజురాబాద్లో ఉత్తమ్కుమార్ రెడ్డి టిక్కెట్ ఇప్పించిన కౌషిక్ రెడ్డి ఇటీవల టీఆర్ఎస్లో చేశారు. ఉత్తమ్ బంధువు కూడా అయిన కౌషిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ, నూతన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్యం ఠాకూర్లపై తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేయడంతో.. అందరూ ఉత్తమ్వైపు అనుమానంగా చూశారు. ఇంటి దొంగలు ఉన్నారంటూ రేవంత్ రెడ్డి సహా పలువురు నేతలు ప్రకటనలు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో.. ఉత్తమ్కుమార్ రెడ్డి పార్టీ మారతారనే ప్రచారం జరుగుతున్న తరుణంలో.. ఆయన తాను మళ్లీ హుజూర్నగర్ నుంచి పోటీ చేస్తానని హుజూర్నగర్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలోనే ప్రకటించడంతో.. ఆ ప్రచారానికి తెరవేసినట్లైంది.
Also Read : ఎంపీటీసీ భర్తకు కేసీఆర్ ఎందుకు ఫోన్ చేశారు..?