iDreamPost
iDreamPost
తాను తెలుగుదేశం పార్టీని వీడి కేంద్రంలోని అధికార బీజేపీలోకి జంప్ అయినందున పోలీసులు తాను చెప్పినట్టు వినాలి అన్నట్టు ఉంది మాజీ ఎంపీ సుజనాచౌదరి వైఖరి. ఆంధ్రప్రదేశ్ పోలీసులను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే ఎవరికైనా ఈ అనుమానమే వస్తుంది.గణతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడ రాష్ట్ర కార్యాలయంలో ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా సుజనా మాట్లాడుతూ కర్నూలులో అనుమతులు లేకుండా మసీదు కడుతుంటే అడ్డుకున్నందుకు తమ పార్టీ నేత డాక్టర్ శ్రీకాంత్ రెడ్డిని అరెస్టు చేశారని, ఆయనపై సెక్షన్ 307 ఎలా పెట్టారని ప్రశ్నించారు. రాష్ట్ర హోంమంత్రి తెలిసి తెలియకుండా మాట్లాడారని, ఆంధ్రప్రదేశ్ మాత్రం అరాచక ప్రదేశ్గా మారిందన్నారు. ఏపీలో పరిస్థితి పోలీసులా.. వైఎస్సార్ సీపీ కార్యకర్తలా.. అన్నట్టు తయారయిందని వ్యాఖ్యానించారు. రిపబ్లిక్ డే నాడు ఏపీ విషయంలో బాధపడాల్సిన పరిస్ధితి ఉందని అనడానికి బాధపడుతున్నానన్నారు. కోవిడ్ క్లిష్ట పరిస్ధితులలో కరోనా కట్టడికి ప్రధాని మోదీ చేసిన ప్రణాళికలు ప్రపంచం మెచ్చుకుంటోందన్నారు.
మారింది జెండాయే.. అజెండా బాబుదే..
చంద్రబాబు సలహా మేరకు టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన సుజనా ఇప్పటికీ ఆయన అజెండానే అమలు చేస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. అప్పుడప్పుడూ రాష్ట్రంలో పర్యటించే సుజనా తెలుగుదేశం పార్టీ నాయకులు చేసే విమర్శలనే వల్లిస్తూ ఉంటారు. పోలీసులపై ఒంటి కాలిపై లేచే టీడీపీ నేతల మాదిరే సుజనా కూడా విమర్శలు గుప్పించడమే అందుకు ఉదాహరణ. కర్నూలులో అనుమతులు లేకుండా మసీదు నిర్మాణం జరుగుతోందని భావిస్తే..అధికారులు, పోలీసుల దృష్టికి తీసుకువెళ్లాలి. కాని మందీ మార్బలంతో వెళ్లి అక్కడ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే అరెస్ట్ చేయరా? ఆ ఘటనలో ఒక్క శ్రీకాంత్రెడ్డినే కాకుండా, ఆయనపై దాడికి పాల్పడ్డ 70 మంది ముస్లింలపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నిబంధనల ప్రకారం సెక్షన్ లు నమోదు చేశారు. ఇవేమీ ప్రస్తావించకుండా శ్రీకాంత్రెడ్డిని ప్రభుత్వం అన్యాయంగా అరెస్ట్ చేసినట్టు, పోలీసులకు అసలు ఏ సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేయాలో కూడా తెలియనట్టు విమర్శలు చేయడమేమిటి?
ఇటువంటి అల్లర్లలో అరెస్ట్ అయిన వ్యక్తిని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి మురళీధరన్ పరామర్శించి.. ఈ ఘటన ఆధారంగా రాజకీయం చేయడం తగదని రాష్ట్ర హోం మంత్రి చెప్పారు. ఆమె అలా అనడాన్ని జీర్ణించుకోలేని సుజనా ఆమెకు అవగాహన లేదని విమర్శలు చేయడం ఏమిటి? పోలీసులు వైఎస్సార్ సీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారంటూ తరచు వ్యాఖ్యానించడం వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే వ్యూహమా? అని అధికార పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ అరాచక ప్రదేశ్గా మారిపోయిందని గగ్గోలు పెడుతున్న సుజనాకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే ఏపీ పోలీసు పనితీరును మెచ్చుకుందన్న సంగతి మరచిపోయారా? అని అడుగుతున్నారు. చార్జిషీట్ల నమోదులోను, టెక్నాలజీని ఉపయోగించి కేసులను దర్యాప్తు చేయడంలోనూ ఏపీ పోలీస్ దేశంలోనే నంబర్ వన్గా ఉందని కేంద్ర హోం శాఖ మెచ్చుకున్న సంగతి మరచిపోయారా! అని వైఎస్సార్ సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.