అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరిన మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్కి డెంగ్యూ సోకినట్టు ఆయనకు వైద్యం అందిస్తున్న బృందం ప్రకటించింది. మన్మోహన్ కు చేసిన పరీక్షల్లో ఇదే తేలిందని వారు పేర్కొన్నారు. అయితే నిన్న సాయంత్రం నుంచి కూడా మన్మోహన్ చనిపోయారు అని సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. దానికి ముఖ్య కారణం జార్ఖండ్ మంత్రి ఒకరు మీడియా ముఖంగా నివాళులు అర్పించడం అనే చెప్పచ్చు. జార్ఖండ్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న హఫీజుల్ హసన్ మాజీ ప్రధాని మరణానికి సంతాపం వ్యక్తం చేశారు. మన్మోహన్ సింగ్ అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్ లో ఉంటే హసన్ ఆయనకు నివాళి అర్పించే ప్రసంగం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. హఫీజుల్ హసన్ జార్ఖండ్ మధుపూర్ ఎమ్మెల్యే కాగా జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీకి చెందినవారు. ఆయన స్పష్టంగా మన్మోహన్ సింగ్ కన్నుమూశారని అనడం కూడా చూడచ్చు. ఇక ఒక మంత్రి ఇలా కామెంట్ చేస్తే ఇక సామాన్యులు ఆగుతారా? అది నిజమే అనుకుని చాలా వరకు సోషల్ మీడియాలో సంతాప సందేశాలు వెల్లువెత్తాయి.
అయితే మన్మోహన్ సింగ్ తాజా ఆరోగ్య పరిస్థితిపై ఎయిమ్స్ వైద్యుల బృందం స్పందించింది. ఆయనకు డెంగ్యూ నిర్ధారణ అయిందని, అయితే అదృష్టవశాత్తు క్రమక్రమంగా ఆయన కోరుకుంటున్నారని కూడా బృందం తెలిపింది. జ్వరం, నీరసంతో బాధపడుతున్న మన్మోహన్ సింగ్ని బుధవారం సాయంత్రం చికిత్స నిమిత్తం ఎయిమ్స్కి తరలించారు. అప్పటి నుంచి ఆయన నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ప్రస్తుతానికి మన్మోహన్ సింగ్ ప్లేట్లెట్స్ కౌంట్ పెరుగుతుంది కనుక ఆయన ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా ఎయిమ్స్ వైద్యులు చెబుతున్నారు. ఎయిమ్స్ హాస్పిటల్లోని కార్డియో న్యూరో సెంటర్లోని ప్రైవేట్ వార్డులో మన్మోహన్ సింగ్ చికిత్స పొందుతున్నారు.
ప్రముఖ కార్డియాలజిస్టు నితీష్ నాయక్ నేతృత్వంలోని వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తున్నారు. మరోపక్క కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కుమార్తె దమన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనారోగ్యంతో బాదపతుతున్న తన తండ్రి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. తన తల్లిదండ్రులు వృద్ధులు, జూలో జంతువులు కాదని ఆమె ఘాటుగానే మండిపడ్డారు. మంత్రి తనతోపాటు ఫోటోగ్రాఫర్ను హాస్పిటల్ గదికి తీసుకొచ్చినప్పుడు తన తల్లి చాలా బాధపడిందని, బయటకు వెళ్లాలని చెప్పిన ఆమె మాటలు అస్సలు వినిపించుకోలేదని మన్మోహన్ కుమార్తె పేర్కొంది. ఇక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం ఎయిమ్స్ ఆసుపత్రికి వెళ్లి మన్మోహన్ సింగ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో భేటీ అయ్యారు. దాదాపు అరగంట పాటు అక్కడే ఉండి మన్మోహన్ సింగ్ సతీమణి గురుశరణ్ కౌర్ను కూడా కలిశారు. డెంగ్యూ నుంచి మాజీప్రధాని కోలుకోవాలని కోరుకుందాం.