Arjun Suravaram
Arjun Suravaram
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా పలు స్కీమ్ లను, కార్యక్రమాలను ప్రవేశ పెట్టారు. ఇటీవలే “జగనన్న ఆరోగ్య సురక్ష” పేరుతో ఇంటి వైద్యం వెళ్లేలా ఓ అద్భుత కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని ద్వారా వైద్యుల బృందం గ్రామాల్లో పర్యటిస్తూ.. ప్రజలకు ఆరోగ్య పరీక్షలు చేస్తుంది. ఇలా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఎందరికో వైద్యులు చికిత్స అందించారు. తాజాగా ఈ జగనన్న ఆరోగ్య సురక్ష ఓ యువకుడికి ప్రాణం పోసింది. జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య బృందం అందించిన అత్యవసర వైద్య సేవలు ఆ యువకుడి ప్రాణాలు నిలబెట్టాయి. ఈ ఘటన కాకినాడ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
కాకినాడ జిల్లా తుని మండల హెచ్.కొత్తూరుకి చెందిన మలగంటి లోకేశ్ అనే యువకుడు ఉన్నట్టుండి ఆయాసంతో కుప్పకూలిపోయాడు. అతడికి మెరుగైన వైద్యం అందించాలంటే 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుని పట్టణానికి తీసుకెళ్లాలి. లోకేశ్ పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. 12 కిలోమీటర్ల వెళ్లే వరకు తమ బిడ్డ పరిస్థితి ఎలా ఉంటుందో అనే ఆందోళన చెందారు. దీంతో అక్కడికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న టి.వెంకటాపురంలో జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరం జరుగుతోందని లోకేశ్ కుటుంబ సభ్యులు తెలుసుకున్నారు. వెంటనే ఆ ప్రాంతానికి వెళ్లి.. లోకేశ్ పరిస్థితి గురించి వైద్యులకు వివరించారు.
ఆ యువకుడిని వైద్య బృందం 104లో ఉంచి సీపీఆర్ పరికరంతో హృదయ స్పందన, శ్వాస తిరిగి ప్రారంభమయ్యేలా ప్రయత్నం చేశారు. వైద్యుల కృషి ఫలించడంతో కొంతసేపటికి హృదయ స్పందన తిరిగి ప్రారంభమై లోకేశ్ కళ్లు తెరిచాడు. అనంతరం వెంటనే ఎర్రకోనేరు గ్రామం వరకూ 104లో, అక్కడి నుంచి 108లో తుని ఆస్పత్రికి తరలించారు. గోల్డెన్ టైమ్ లో సీపీఆర్ సేవలు అందించడం సత్ఫలితాన్ని ఇచ్చిందని వైద్యులు తెలిపారు. తమ బిడ్డను కాపాడిన వైద్యులకు, ప్రభుత్వానికి లోకేశ్ తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. మరి.. ఇలా ఎందరో ప్రాణాలను కాపాడుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.