iDreamPost
android-app
ios-app

తొలి ఇన్నింగ్స్‌లో తడబాటు

  • Published Jan 12, 2022 | 1:42 AM Updated Updated Jan 12, 2022 | 1:42 AM
తొలి ఇన్నింగ్స్‌లో తడబాటు

సఫారీ గడ్డపై చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో బరిలో దిగిన భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో తడబాటుకు గురైంది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్‌లు రాణించకపోవడంతో భారత్‌ కేవలం 223 పరుగులకే ఆల్‌ఔట్‌ అయ్యింది. తొలి రోజు మంగళవారం ఒక్క రోజు కూడా పూర్తిగా ఆడకుండా భారత్‌ ఆల్‌ఔట్‌ కావడం అభిమానులను తీవ్ర నిరాశ పరిచింది.

తొలి టెస్టు గెలిచిన భారత జట్టు రెండవ టెస్టును చేజేతులా కోల్పోయింది. కీలకమైన మూడవ టెస్టులో సైతం పేలవమైన బ్యాటింగ్‌ ప్రదర్శనతో కుప్పకూలిపోయింది. కేవలం 223 పరుగులు మాత్రమే చేసింది. ఫ్రీడమ్‌ కప్‌లో కీలకమైన మూడవ టెస్టు న్యూల్యాండ్స్‌లో మంగళవారం ఆరంభమైంది. కెప్టెన్‌  కోహ్లీ ఒక్కడే రాణించి 79 పరుగులు (12×4, 1×6) చేశాడు. అతనితోపాటు పుజారా 43 పరుగులు చేయగా, పంత్‌ 27 పరుగులు చేసి ఔటయ్యారు. ఓపెనర్లు కె.ఎల్‌.రాహూల్‌ 12, అగర్వాల్‌ 15 పరుగులకే పెవిలియన్ బాట పట్టారు. రహానే 9, అశ్విన్‌ 2 పరుగులు, ఠాకూర్‌ 12, షమీ 7 పరుగులకు ఔటయ్యారు. బుమ్రా సున్నా పరుగులకే వెనుదిరగగా, యాదవ్‌ నాలుగు పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దక్షిణాఫ్రికా జట్టులో రబ్బాడా నాలుగు, జాన్సెన్‌ మూడు వికెట్ల చొప్పున తీసి భారత్‌ను కట్టడి చేశారు. 

అనంతరం బ్యాటింగ్‌ ప్రారంభించిన దక్షిణాఫ్రికా జట్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి 17 పరుగులకు ఒక వికెట్‌ కోల్పోయింది. ఫామ్‌లో ఉన్న కెప్టెన్‌ ఎల్గర్‌ కేవలం మూడు పరుగులు చేసి బుమ్రా బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఇదొక్కటే భారత్‌కు ఊరటనిచ్చే అంశం. మార్కరమ్‌ 8 పరుగులు, మహారాజ్‌ ఆరుపరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.