తొలి టెస్టులో భారత్ ఎదురీదుతుంది.. ఆదివారం ఆట ముగిసే సమయానికి టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. చేతిలో నాలుగు వికెట్లు ఉన్న టీమిండియా 321 పరుగుల వెనుకంజలో ఉంది.
మొదటి ఇన్సింగ్స్ ప్రారంభంలోనే భారత్కు ఎదురుదెబ్బ తగిలింది. 19 పరుగుల వద్ద ఓపెనర్ రోహిత్ శర్మ(6)ను 44 పరుగులు వద్ద మరో ఓపెనర్ శుభమన్ గిల్ (29)ను జోఫ్రా ఆర్చర్ ఔట్ చేయడంతో భారత్ 44 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. అనంతరం క్రిజ్లోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లి, అంజిక్యా రహానే డామ్ బెస్ బౌలింగ్ లో వెంట వెంటనే పెవిలియన్ బాటపట్టడంతో 73 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఈ దశలో ఆస్ట్రేలియా సిరీస్ హీరోలు నయా వాల్ చెతేశ్వర్ పుజారా (73; 143 బంతుల్లో, 11×4)రిషభ్ పంత్ (91; 88 బంతుల్లో, 9×4, 5×6), అద్భుత బ్యాటింగ్తో భారత్ ను తిరిగి గాడిలో పెట్టారు. ముఖ్యంగా పుజారా మరోసారి వికెట్ల పతనాన్ని అడ్డుకుంటూ అద్భుత పోరాటం చేయగా పంత్ వన్డే తరహాలో ఆడుతూ భారీ షాట్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ దశలో పుజారాను ఔట్ చేయడంతో 119 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం డాం బెస్ బౌలింగ్ లో భారీ షాట్ కి ప్రయత్నించి జాక్ లీచ్ కి చిక్కడంతో పంత్ పెవిలియన్ బాట పట్టాడు. సుందర్ (33*), అశ్విన్ (8*) నాటౌట్గా నిలిచారు.ఇంగ్లండ్ బౌలర్లలో బెస్ నాలుగు వికెట్లు సాధించగా(4/53), ఆర్చర్ రెండు వికెట్లు(2/51) సాధించారు .
నాలుగో రోజు ఆటలో భారత బ్యాట్స్మెన్ క్రీజులో ఎక్కువసేపు నిలబడటంపై భారత్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.
అంతకుముందు 555/8 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ మరో 23 పరుగులు జోడించి చివరి రెండు వికెట్లు కోల్పోయింది. డొమ్ బెస్(34)ను బుమ్రా అండర్సన్ను అశ్విన్ ఔట్ చేయడంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 578 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో బుమ్రా అశ్విన్ మూడేసి వికెట్లు సాధించగా ఇషాంత్ శర్మ, నదీమ్ రెండేసి వికెట్లు సాధించారు.