కేంద్ర మాజీ మంత్రి, రిటైర్డ్ మేజర్ జశ్వంత్ సింగ్ దిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈ ఆదివారం ఉదయం గుండెపోటు రావడంతో ఆయన మృతిచెందారు.
గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న జశ్వంత్ సింగ్ జూన్ 25న దిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో చేరారు. వైద్యులు శ్రమించినా ఆయన ప్రాణాలను కాపాడలేకపోయారు. జశ్వంత్ సింగ్ ఐదుసార్లు రాజ్యసభ, నాలుగు సార్లు లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
1938 జనవరి 3న రాజస్థాన్లోని జసోల్లో జశ్వంత్ సింగ్ జన్మించారు. అనంతరం ఆయన సైన్యంలో చేరి వివిధ హోదాల్లో పని చేసారు. సైన్యం నుండి పదవీ విరమణ చేసిన తర్వాత బీజేపీలో చేరి 34 ఏళ్ల పాటు పార్లమెంటు సభ్యుడిగా కొనసాగారు. వాజ్పేయీ హయాంలో రక్షణ, ఆర్థిక, విదేశాంగ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1998-99 మధ్య జశ్వంత్ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా పనిచేశారు.
జస్వంత్ సింగ్ మరణవార్తతో ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన దేశానికి చేసిన సేవలు గుర్తు చేసుకొని ఆయనను కొనియాడారు. బీజేపీ అగ్రనేతలతో పాటు అనేకమంది ప్రముఖులు జస్వంత్ సింగ్ మరణవార్తను విని విచారం వ్యక్తం చేశారు.