చిత్తూరు మాజీ ఎంపీ ఎం జ్ఞానేంద్రా రెడ్డి రాష్ట్ర విదేశీ, ప్రవాస భారతీయ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముత్యాలరాజు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండల కేంద్రానికి చెందిన జ్ఞానేంద్రారెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతగా ఉండేవారు. ఆయన ఐదేళ్లు గుంటిపల్లె సర్పంచ్ గా ఐదేళ్లు గంగాధర నెల్లూరు సమితి అధ్యక్షునిగా, ఏడేళ్లు లోక్ సభ సభ్యుడిగా పనిచేశారు. డిసిసి ప్రధాన కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. రాయలసీమ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. పెనుమూరు మండలంలో మండల వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి ఒకసారి తప్ప మిగిలిన అన్ని సార్లు ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులే ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులుగా గెలిచారు.
కాంగ్రెస్ పార్టీ తరపున చిత్తూరు నుంచి 1989, 1991 ఎన్నికల్లో వరుసగా రెండుపర్యాయాలు ఎంపీగా గెలిచి విజయం సాధించారు. ఆ తరువాత కాస్త సైలెంట్ అయిన ఆయన 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి పలమనేరు టికెట్కు యత్నించారు. కానీ ఆయనకు అవకాశం చిక్కలేదు. ఇక ఆ తర్వాత వైసీపీ ఆవిర్భావం అనంతరం ఆయన జగన్ వెంట నడిచారు. ముందు నుంచి ఆయన పార్టీ గెలుపుకోసం పనిచేశారు. అయితే ప్రభుత్వం ఏర్పడిన రెండున్నరేళ్ల తర్వాత ఇప్పుడు ఆయనకు సలహాదారు పదవి లభించింది.
గత ఏడాది ఆయనకు వదిన అయిన ప్రమీలమ్మకు కాణిపాకం ఆలయ ట్రస్ట్ బోర్డు అధ్యక్ష పదవిని ప్రభుత్వం కేటాయించడం, తర్వాత జ్ఞానేంద్రారెడ్డి కుటుంబీకుల అభ్యర్థన మేరకు ఆమె స్థానంలో కోడలికి అదే పదవిని కేటాయించారు. అయితే ఆ ఉత్తర్వులు అమల్లోకి రాకపోవడంతో దానికి బదులుగా జ్ఞానేంద్రారెడ్డి సోదరుడి కుమారుడు దయా సాగర్రెడ్డికి టీటీడీ ట్రస్టుబోర్డు ప్రత్యేక ఆహ్వానితులుగా పదవి దక్కింది. కాకపోతే హైకోర్టు ఆదేశాలతో ఆ నియామకం కూడా రద్దయ్యింది. ఈ నేపథ్యంలో జ్ఞానేంద్రారెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవి దక్కింది. జిల్లా రాజకీయాల్లో ఎంతో సీనియర్ అయిన జ్ఞానేంద్రారెడ్డికి సుదీర్ఘ కాలం తర్వాత కీలక పదవి దక్కడంపై ఆయన అనుచరులు, అభిమానులు సంబర పడుతున్నారు. ఆయన రాజకీయ వ్యూహాలు రచించడంలో మంచి దిట్ట అనే పేరుంది.