పీఆర్సీ విషయంలో ఏపీ ప్రభుత్వంతో చర్చలు సఫలం కావడంతో ఉద్యోగ సంఘాల నేతలు సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా వారు సీఎం జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రిని కలిసి ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అంటే ఉద్యోగులది, మంత్రుల కమిటీ కొనసాగుతుంది, మీకు ఏ సమస్యలు ఉన్నా కమిటీకి చెప్పుకోవచ్చని అన్నారు. ఉద్యోగుల సహకారంతో మంచి చేయగలుగుతున్నానని ఆర్థిక పరిస్థితుల వల్ల, కరోనా ప్రభావం వల్ల మీరు ఆశించినంత రీతిలో ఇవ్వలేకపోవచ్చని.. కానీ ఎంతమేర మేలు చేయగలుగుతామో అన్ని రకాలుగా చేశామని అన్నారు.
ఈ విషయంలో రాజకీయాలు వస్తే.. వాతావరణం దెబ్బతింటుందన్న ముఖ్యమంత్రి.. రాజకీయాలకు తావు ఉండకూడదని చెప్పారు. ఏదైనా సమస్య ఉంటే కమిటీ ఉంటుందని అన్నారు. ‘ఐఆర్ ఇచ్చిన 30 నెలల కాలానికి గానూ, 9 నెలల ఐఆర్ను సర్దుబాటు నుంచి మినహాయింపు ఇవ్వడం వల్ల రూ.5400 భారం పడుతోంది. హెచ్ఆర్ఏ రూపంలో అదనంగా మరో రూ.325 కోట్లు భారం పడుతోంది. అదనంగా భారం పడేది కాకుండా రికరింగ్ హెచ్ఆర్ఏ వల్ల రూ.800 కోట్లు, అడిషనల్ క్వాంటమ్ పెన్షన్, సీసీఏ రూపంలో మొత్తంగా రూ.1330 కోట్లు భారం పడుతోందని, అలా మొత్తంగా రూ.11,500 కోట్లు భారం పడుతోంది’ అని సీఎం వైఎస్ జగన్ తెలిపారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా.. మీరు ఈ ప్రతిపాదనలకు అంగీకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ పరిస్థితులు ఈ మాదిరిగా ఉండకపోతే ఉద్యోగులందరినీ మరింత సంతోషపెట్టే వాడిని’ అని అన్నారు. మినిమం టైం స్కేల్ వర్తింపు చేశామని అన్ని రకాల జీతాలు పెంచామని అన్నారు. మీరు లేకపోతే నేను లేను. పారదర్శకంగా, అవినీతి లేకుండా బటన్ నొక్కి ప్రజలకు ఇవ్వగలుగుతున్నాను. ఇది మీ వల్లే సాధ్యపడుతోంది. భావోద్వేగాలకు పెద్దగా తావు ఇవ్వకండి..’ అని సీఎం అన్నారు. అదేవిధంగా కాంట్రాక్టు ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉన్నామని.. దీనిపై ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నామన్నారు.