iDreamPost
iDreamPost
తనను నియంత్రించడానికి ప్రయత్నిస్తున్న ప్రభుత్వంపైనే కోవిడ్ ఎదురుదాడి చేస్తోంది. పాలకులనే వైరస్ బాధితులుగా మార్చేస్తోంది. దాంతో మహారాష్ట్రలో పరిస్థితి రోజురోజుకూ విషమిస్తూ భయానకంగా మారుతోంది. ఇప్పటికే పలు ఆంక్షలు అమలు చేస్తున్నా పరిస్థితి అదుపులోకి రావడంలేదు. తాజాగా పదిమంది రాష్ట్ర మంత్రులు, 50 మంది ఎమ్మెల్యేలు, పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ప్రబలుతున్న ఒమిక్రాన్ వేరియంట్ తోపాటు.. కొన్ని నెలల క్రితమే తగ్గుముఖం పట్టిన కోవిడ్ కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి.
అసెంబ్లీ సమావేశాలు కారణం
ఇటీవల ఐదు రోజులపాటు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఆ సమావేశాల్లో పాల్గొన్నవారితోపాటు.. వారితో కాంటాక్ట్ అయిన వారిని ప్రస్తుతం కోవిడ్ డెల్టా, ఒమిక్రాన్ వైరస్ లు కబళిస్తున్నాయి. మూడు రోజల క్రితం ఇద్దరు మంత్రులు, 50 మంది అసెంబ్లీ, సచివాలయ సిబ్బంది కోవిడ్ బారిన పడ్డారు. మూడు రోజుల్లోనే పరిస్థితి పూర్తిగా దిగజారింది. పది మంది మంత్రులు, 50 మందికిపైగా ఎమ్మెల్యేలకు కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయ్యిందని రాష్ట్ర మంత్రి అజిత్ పవార్ చెప్పారు. కోవిడ్ భయంతోనే అసెంబ్లీ సమావేశాలను కుదించి ఐదు రోజుల్లోనే ముగించామని.. అయినా వైరస్ ప్రబలిందని పేర్కొన్నారు.
ఇటు ఒమిక్రాన్.. అటు డెల్టా..
దేశవ్యాప్తంగా నమోదవుతున్న ఒమిక్రాన్ కేసుల్లో సగానికిపైగా మహారాష్ట్రలోనివే. మొత్తం 1500కు పైగా కేసుల్లో సుమారు 600 కేసులు ఆ రాష్ట్రంలోనే నమోదయ్యాయి. మరోవైపు తగ్గిపోయిందనుకుంటున్న డెల్టా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 8067 కొత్త కేసులు వెలుగు చూశాయి. ఒక్క ముంబై నగరంలోనే ఐదువేల కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఇప్పటికే ముంబైతో సహా చాలా నగరాలు, పట్టణాల్లో పగలు 144 సెక్షన్, రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. కంటోన్మెంట్ జోన్లు పెడుతున్నారు. అయినా వైరస్ అదుపులోకి రాకపోగా మరింతగా విజృంభిస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే లాక్ డౌన్ విధించక తప్పదని మంత్రి అజిత్ పవార్ వ్యాఖ్యానించారు.