Idream media
Idream media
కరోనా సెకండ్ వేవ్ ఉంటుందనే దానికి ఫ్రాన్స్ నిదర్శనంగా నిలుస్తోంది. దీంతో మన దేశంలో కూడా ఆ పరిస్థితి ఉంటుందా..? ఉంటే ఎంత వరకు ప్రభావం ఉంటుంది..? అనే దానిపై నిపుణులు అంచనా వేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇదిలా ఉండగా.. కోవిడ్-19 విజృంభణ నేపథ్యంలో డిసెంబరు 1 వరకు లాక్ డౌన్ నిబంధనలు అమల్లో ఉంటాయని ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ బుధవారం ప్రకటించారు. దేశంలో వైరస్ వేగంగా విస్తరిస్తోందని, పరిస్థితులు చేయి దాటిపోయే పరిస్థితి కనిపిస్తోందని, ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘యూరప్లోని ఇతర దేశాల మాదిరిగానే ఫ్రాన్స్లో కూడా సెకండ్ వేవ్ మొదలైంది. మొదటి దశ కంటే ఇది మరింత తీవ్రంగా ఉండవచ్చు. ఇప్పటికే, కరోనా సోకి తీవ్ర అస్వస్థతకు గురైన 3 వేల మందికి పైగా పేషెంట్లకు మెరుగైన చికిత్స అందించేందుకు ఆస్పత్రుల్లో బెడ్లు అందుబాటులో లేవు.. అని ఆయన హెచ్చరించారు.
భారత్ లో పొంచి ఉన్న భయం
వచ్చే నెల మూడు, నాలుగు వారాల్లో లేదా డిసెంబర్ మొదటి వారంలో కోవిడ్ ఉధృతి భారత్ లో మళ్లీ పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. ఏ మహమ్మారి అయినా సెకెండ్వేవ్లో వ్యాధి తీవ్రత హెచ్చుగా ఉంటుందంటున్నారు. ఇప్పటికే ఫ్రాన్స్, అమెరికా, తదితర పశ్చిమదేశాల్లో కోవిడ్ సెకెండ్వేవ్ కేసులు, ప్రభావం క్రమంగా పెరుగుతున్నట్టుగా వార్తలొస్తున్నాయి. మనదేశంలో తొలిదశ కరోనా వ్యాప్తి (ఫస్ట్వేవ్) ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టడం మొదలైందని, త్వరలోనే సెకెండ్వేవ్ను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాల్సి ఉంటుందనే అభిప్రాయం వైద్యవర్గాల్లో వ్యక్తమవుతోంది. పండుగల సీజన్లో వైరస్ వ్యాప్తిచెందకుండా ప్రజలు ఏమేరకు ముందు జాగ్రత్తలు తీసుకున్నారనే దానిపై సెకెండ్వేవ్ తీవ్రత ఆధారపడి ఉండొచ్చునని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య తగ్గుతున్నా, మరికొన్ని రాష్ట్రాల్లో 2 వారాలుగా అధిక కేసులు నమోదవుతున్నాయి. మహమ్మారులు పూర్తిగా అంతమొంది, కనుమరుగైపోవడానికి ముందు ‘మల్టీపుల్ వేవ్స్’గా వస్తాయని, ఇది ప్రపంచవ్యాప్తం గానూ లేదా కొన్నిదేశాల్లో స్థానికంగానూ జరిగే అవకాశాలున్నాయని యశోద చీఫ్ ఇంటర్వెన్షెనల్ పల్మనాలజిస్ట్ డా. హరికిషన్ గోనుగుంట్ల తెలిపారు. మళ్లీ ఆసుపత్రుల్లో కోవిడ్ అడ్మిషన్లు నెమ్మదిగా పెరుగుతున్నాయని, గతంలోనూ ఇదేవిధంగా నెమ్మదిగా అడ్మిషన్లు మొదలై ఆ తర్వాత కేసుల తీవ్రత, వైరస్ వ్యాప్తి పెరిగిందనే విషయాన్ని అర్థం చేసుకోవాలని చెప్పారు.
వచ్చేది చలికాలం… అప్రమత్తం
మనదేశం కరోనా బారినపడినపుడు ఇక్కడ ఎండాకాలం ఉందనేది గమనార్హం. సాధారణంగా వేసవిలో వైరస్ కొంత బలహీనంగా ఉంటుంది. ఇంకా మనం చలికాలంలోకి అడుగుపెట్టలేదు. ఉష్ణోగ్రతలు తగ్గడం మొదలయ్యాక వైరస్ స్వభావం ఎలా ఉంటుందనేది కీలకం కానుంది. భారీవర్షాలు, వరదల అనంతరం డెంగీ, టైఫాయిడ్ కేసులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు చలికాలంలో సాధారణంగానే ఇన్ఫ్లూయెంజా ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. ప్రస్తుత కోవిడ్ పరిస్థితులకు ఇవి కూడా తోడైతే సమస్య జఠిలమయ్యే ప్రమాదముంది. కోవిడ్ వ్యాధిని ఇన్ఫ్లూయెంజా మరింత సంక్లిష్టంగా మారుస్తుంది. అందువల్ల ఫ్లూకు సంబంధించిన వ్యాక్సిన్ వేయించుకుంటే ముందు జాగ్రత్తగా ఉపయోగపడుతుంది.
పండుగల సీజన్లో ప్రజలు పెద్దసంఖ్యలో బయటకు వస్తున్నారు. కలుసుకోవడం, గుంపులుగా చేరడం పెరిగినందున ఇప్పుడు అప్రమత్తత అవసరం. ఇంకా వ్యాక్సిన్ అందుబాటులోకి రానందున జాగ్రత్తలు ముఖ్యం. కొందరు కరోనా అధ్యాయం ముగిసిందనే భావనలో మాస్క్లు ధరించడం లేదు. సామాజిక దూరం, శానిటైజేషన్ లాంటి జాగ్రత్తలు పాటించడం మానేశారు. దీనివల్ల మళ్లీ కరోనా వైరస్ వ్యాప్తి పెరిగే ›ప్రమాదముంది. పండుగల సందర్భంగా పెద్దసంఖ్యలో ఒకచోట గుమికూడటం, చిన్న గుంపులుగా ఒక దగ్గర చేరడం చేయొద్దు. ఇవే కొత్త హాట్స్పాట్లుగా మారాయనే విషయాన్ని గ్రహించాలి. ఇళ్లచుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. వర్షాలు తగ్గాక అక్కడక్కడా డెంగీ కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. దీనిపట్ల మరింత అప్రమత్తత, జాగురూకత అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
నిర్లక్ష్యం వద్దు : తెలంగాణ
చలి కాలం ప్రారంభం కావడం.. అమెరికా, యూరఫ్ దేశాల్లో సెకండ్ వేవ్ కేసులు భారీగా నమోదు అవుతుండడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. వచ్చే మూడు నెలలు జాగ్రత్తగా ఉండాలని గురువారం ప్రకటన విడుదల చేసింది. కరోనా రెండో దశ విజృంభించి బాధితుల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని, వచ్చేవి పండుగల సీజన్ కాబట్టి జాగ్రతగా ఉండాలని సూచించింది. మాస్కులు, భౌతిక దూరం విషయంలో నిర్లక్యం వద్దు అని పేర్కొంది. కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే టెస్ట్ లు చేయించు కోవాలని చెప్పింది. ఈ ప్రకటనలు జాగ్రత్తగా ఉండాలని సంకేతాలు ఇస్తున్నాయి.