iDreamPost
iDreamPost
దేశంలో కరోనా వ్యాప్తి జోరు కొనసాగుతోంది. రోజుకు పదివేల కేసులు నమోదైతేనే ఆందోళన చెందిన పరిస్థితి ఉండగా.. ఇప్పుడు దాదాపు 90వేలకుపైగా ప్రతి రోజూ నమోదవుతున్నాయంటే ఏ స్థాయిలో వైరస్ వ్యాప్తి ఉధృతి ఉందో అర్ధం చేసుకోవచ్చు. భారీగా నమోదువుతున్న కేసులు ఆందోళన పెంచుతుంటే, రికవరీల అంకెలు కొంచెం ఊరడిస్తున్నాయి. వ్యాప్తి ఎక్కువగానే ఉన్నప్పటికీ, వైరస్ భారి నుంచి సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుంటున్న వారి సంఖ్య కూడా అందుకు దగ్గరగానే ఉండడం ఊరటనిచ్చే అంశమేనని వైద్య వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
గడచిన ఇరవైనాలుగు గంటల్లో దేశంలో 96వేల పాజిటివ్లు నమోదైతే, 87వేల వరకు రికవరీ అయ్యారని ప్రభుత్వ బులిటెన్లో పేర్కొంది. ఇది ఖచ్చితంగా ఆశావహ దృక్ఫథమేనని నిపుణులు పేర్కొంటున్నారు.
రానున్న రెండు వారాల్లో రోజుకు లక్ష కేసులు నమోదయ్యేందుకు కూడా అవకాశం ఉంటుందని, ఆ స్థాయిలోనే రికవరీలు కూడా ఉంటాయని భరోసానిస్తున్నారు. అయితే కేసులు పెరుగుతున్న కొద్దీ దేశ వ్యాప్తంగా మరణాల సంఖ్యకూడా పెరుగుతుండడం కొంచెం ఆందోళన కరమైన విషయమేనని జనం భావిస్తున్నారు. ప్రస్తుతం రోజుకు 11 లక్షలకుపైగా వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. దీంతో భారీ సంఖ్యలోనే పాజిటివ్లు బైటపడుతున్నాయి.
అలాగే దేశంలో వ్యాధి ప్రారంభం నుంచి ప్రధానంగా ఏడు రాష్ట్రాల్లో ఉధృతంగా కన్పించింది. ఇప్పటిక్కూడా ఆ రాష్ట్రాల్లోనూ ఉధృతి కొనసాగుతోంది. బైట పడ్డ పాజిటివ్లలో డెబ్బైశాతం వరకు కేసులు ఈ ఏడు రాష్ట్రాల్లోనే ఉంటున్నాయి. వీటిలో మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ, కేరళ రాష్ట్రాల్లో ఎక్కువగా పాజిటివ్లు బైటపడుతున్నట్లు బులిటెన్ స్పష్టం చేస్తోంది.
అలాగే పాజిటివ్లు తక్కువగానే నమోదైనప్పటికీ మరణాలు మాత్రం పశ్చిమబెంగాల్, పంజాబ్లలో ఎక్కువగా నమోదవుతున్నాయి. పూర్తి స్థాయిలో లాక్డౌన్ ఎత్తివేసిన తరువాత పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయన్న దానిపై భిన్నాభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. ఏది ఏమైనా వ్యక్తిగత జాగ్రత్తకు మించిన నివారణా మార్గం లేదన్నది ఇప్పటికే స్పష్టమైంది.