Idream media
Idream media
కరోనా విలయతాండవం చేస్తున్న వేళ ఇప్పుడు దేశంలోని చాలా రాష్ట్రాలు అల్లాడుతున్నాయి. కట్టడి చర్యలు చేపడుతున్నా, కేంద్రం నుంచి అందాల్సిన సాయం ఆలస్యం అవుతుండడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. వెంటనే తమకు కావాల్సిన అవసరాలు తీర్చాలంటూ వినతుల మీద వినతులు చేస్తున్నాయి. ఆక్సిజన్ లు, వ్యాక్సిన్ లు, రెమ్ డెసివిర్ ఇంజక్షన్లను సరఫరా చేయాలంటూ కోరుతున్నాయి. అన్నింటికీ ఒకేసారి అత్యధిక డిమాండ్ పెరగడంతో కేంద్రం సరిపెట్టలేని పరిస్థితి. వీటన్నింటినీ నిశితంగా పరిశీలిస్తున్న ఏపీ సీఎం జగన్ తనదైన పంథాలో ముందుకెళ్తున్నారు. ప్రజల ప్రాణాల రక్షణే ముఖ్యంగా ఆయనే స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. కేంద్రం స్పందించే వరకూ వేచి చూస్తే లాభం లేదనుకున్నారో ఏమో.. కరోనా కట్టడికి అవసరమైన వ్యాక్సిన్ లు, ఇంజక్షన్ల ను తెప్పించుకునేందుకు స్వయంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయా కంపెనీలకు డైరెక్ట్ గా ఆయనే ఫోన్ చేసి ఆర్డర్ లు ఇస్తున్నారు.
కరోనా రెండో దశ ఆరంభం నుంచీ ఏపీ సీఎం తీసుకుంటున్న చర్యలు దేశ వ్యాప్తంగా చర్చనీయంగా మారుతున్నాయి. ఆది నుంచీ కట్టడి చర్యలు కొనసాగిస్తూనే ఉన్నా, తీవ్రతను బట్టి వ్యూహం మార్చుకుంటూ వస్తున్నారు. ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయం కావడంతో నిరంతరం అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ తగిన చర్యలు చేపడుతున్నారు. అధికార యంత్రాంగం నుంచి అందుతున్న సమాచారాన్ని పూర్తిగా ఆకలింపు చేసుకుని ఓ సీఎంగా తన బాధ్యతలు నెరవేరుస్తున్నారు. ఓ పక్క సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే.. మరో మహమ్మారి పోరుకు తగిన సమయం కేటాయిస్తున్నారు.
కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు పూర్తిగా కేంద్రప్రభుత్వంపై ఆధారపడితే లాభం లేదని భావించి టీకాలను తయారుచేస్తున్న కంపెనీలతో నేరుగా సంప్రదింపులు మొదలుపెట్టారు. కోవాగ్జిన్ టీకాను తయారుచేస్తున్న భారత్ బయోటెక్ కంపెనీ సీఎండి కృష్ణాఎల్లాతో ఫోన్లో మాట్లాడారు. అలాగే కరోనా వైరస్ చికిత్సకు వాడుతున్న రెమ్ డెసివిర్ ఇంజక్షన్లను అదనంగా సరఫరా చేయాలంటూ హెటిరో డ్రగ్స్ ఎండి పార్ధసారధిరెడ్డితో కూడా మాట్లాడారు. డైరెక్ట్ గా సీఎం ఫోన్ చేసి కోరడంతో ఏపీగా త్వరగా వ్యాక్సిన్ లు, ఇంజక్షన్లు పంపేందుకు ఆయా కంపెనీలు సిద్ధమయ్యాయి.
కరోనా టీకా కోసం కేంద్రాన్ని నమ్ముకుంటే ఉపయోగం ఉండదని రాష్ట్రప్రభుత్వానికి అర్ధమైపోయినట్లుంది. ఎందుకంటే బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాల విషయంలో కేంద్రం పక్షపాతంతో వ్యవహరిస్తోందనే ఆరోపణలు బాగా పెరిగిపోతున్నాయి. ఈ విషయం మహారాష్ట్ర విషయంలో స్పష్టంగా అందరికీ తెలిసిపోయింది. కేసులు బాగా ఎక్కువున్న రాష్ట్రాల్లో డిమాండ్లకు తగ్గట్లుగా కేంద్రం టీకాలను సరఫరా చేయటంలేదు. ఇదే సమయంలో తక్కువ కేసులు నమోదవుతున్నప్పటికీ తమ ప్రభుత్వాలున్న రాష్ట్రాలకు టీకాలను ఎక్కువగా సరఫరా చేస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి. మూలుగానే టీకాలు సరపడా అందటంలేదు. ఇలాంటి నేపధ్యంలో 18 ఏళ్ళు నిండినవారికి కూడా ఉచిత టీకాలంటే డిమాండ్ గురించి చెప్పాల్సినవసరంలేదు. ఇప్పటికే 60 లక్షల టీకాలు కావాలని జగన్ కేంద్రానికి ఇండెంట్ పెట్టున్నారు.
సీఎం జగన్ కేంద్రానికి పెట్టిన ఇండెంట్ యధాతథంగా వచ్చే అవకాశం కనిపించడం లేదని గుర్తించారు. ఈ పరిస్ధితుల్లో టీకాలను ఉత్పత్తిచేసే ఫార్మా కంపెనీలతో నేరుగా మాట్లాడి అవసరాలను అధిగమించాలని జగన్ నిర్ణయించారు. ఇందులో భాగంగానే భారత్ బయోటెక్ హెటిరో అధినేతలతో మాట్లాడారు. మరి ఫార్మాకంపెనీలు ఏ మేరకు టీకాలను సరఫరా చేస్తాయో చూడాలి. పైగా 18 ఏళ్ళు నిండినవారికి కూడా టీకాలు వేయించేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో రోజుకు కోట్లాది టీకాలు అవసరం ఉంటాయి. ఇప్పటికే తనపై ఉన్న ఆరోపణలనుండి బయటపడలేక అవస్తలు పడుతున్న కేంద్రం టీకాలను 18 ఏళ్ళు నిండిన వారు రాష్ట్రంలో 2 కోట్ల మంది ఉన్నట్లు అంచనా. ఇందుకోసం రూ. 1600 కోట్లను ప్రభుత్వం ఖర్చు పెట్టబోతోంది. నేరుగా ఆ కంపెనీల యజమానులతో మాట్లాడుతున్న జగన్.. బిల్లులను వెంటనే మంజూరు చేస్తామని ఉటంకించడం ద్వారా ఏపీకి కావాల్సిన వ్యాక్సిన్, ఇంజక్షన్లు త్వరగా అందనున్నాయి.