iDreamPost
iDreamPost
సినీ పరిశ్రమలో ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. సడెన్ గా సినీ కార్మికుల వేతనాలు పెంచాలంటూ ఆందోళనలు చేపట్టిన సినీ కార్మికులు ఇవాళ షూటింగ్ లకు బంద్ ప్రకటించి తెలుగు ఫిలిం ఫెడరేషన్ ఆఫీస్ దగ్గర 24 క్రాఫ్ట్స్ కార్మికులు ఆందోళన చేశారు. ఒకపక్క ఫిలిం ఫెడరేషన్ సభ్యులు మేము అయిదు నెలలుగా వేతనాలు పెంచాలంటున్నా నిర్మాతలు పట్టించుకోవట్లేదు అంటున్నారు. మరో పక్క ఫిలిం ఛాంబర్ మాకు నోటీసు ఇవ్వకుండా సమ్మెకు దిగడం తప్పు, అయినా కరోనా వల్ల అందరూ నష్టపోయారు. కార్మికుల వేతనాల గురించి ఆలోచిస్తున్నాము అన్నారు.
బుధవారం ఉదయం ఫిలిం ఛాంబర్ లో నిర్మాతల మండలితో తెలుగు ఫిలిం ఛాంబర్ సభ్యులు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో తెలుగు ఫిలిం ఛాంబర్ సెక్రెటరీ దామోదర్ ప్రసాద్, నిర్మాత సీ కళ్యాణ్, ఏ ఎమ్ రత్నం, మైత్రి మేకర్స్ రవి, సుప్రియ యార్లగడ్డ , జెమిని కిరణ్, భారత్ చౌదరి.. పలువురు నిర్మాతలు పాల్గొని సినిమా షూటింగ్స్ నిలుపుదల, సినీ కార్మికుల సమ్మెపై చర్చించారు.
అనంతరం ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్షుడు నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. సినీ కార్మికుల నిర్ణయం వల్ల ఇవాళ చిత్ర పరిశ్రమ చాలా నష్టపోయింది. ఈ నెల 6వ తేదీన మాకు ఫెడరేషన్ నుంచి లేఖ వచ్చింది. అంతకంటే ముందే వేతనాలపై ఫిల్మ్ ఛాంబర్ ఆలోచిస్తుంది. ఫిల్మ్ ఫెడరేషన్ నిర్ణయం చాలా తప్పు. షూటింగ్ లు ఆపేదే లేదు. రేపటి నుంచి యథావిధిగా కార్మికులు షూటింగ్స్ కు హాజరుకావాలి. వేతనాలపై విధి విధానాలు రూపకల్పన చేస్తాం. నిర్మాతలపై ఒత్తిడి చేసే ఆలోచన ఉంటే విరమించుకోవాలి. సినీ కార్మికుల ఒత్తిడికి తలొగ్గి ఎవరూ వేతనాలు పెంచొద్దు. అందరం కలిసి షూటింగ్ లు జరుపుకుందాం. ఎల్లుండి వేతనాలపై చర్చిస్తాం. ఏ కార్మికుడి కడుపు కొట్టాలని నిర్మాత చూడరు. కార్మికులందరికి వేతనాలు పెంచడంలో ఎలాంటి అభ్యంతరం లేదు. 2018లో వేతనాలపై ఒప్పందం చేసుకున్నాం, కానీ కరోనా వల్ల పరిస్థితులు ఎలా మారాయో మీకు తెలుసు. ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు కార్మికుల కడుపు కొట్టొద్దు. సినిమా కార్మికులు హాజరుకాకపోతే మేమే షూటింగ్ లు ఆపేస్తాం అని సీరియస్ అయి మాట్లాడారు.