iDreamPost
android-app
ios-app

ఎమ్మెల్యేలను అధికారులు గౌరవించ కూడదట! -సోము వారి ఆక్రోశం

  • Published Jan 08, 2022 | 1:39 PM Updated Updated Mar 11, 2022 | 10:26 PM
ఎమ్మెల్యేలను అధికారులు గౌరవించ కూడదట! -సోము వారి  ఆక్రోశం

ఆడలేక మద్దెల ఓడె.. అన్నట్టుంది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యవహార శైలి. అధ్యక్షుడిగా అట్టర్ ప్లాప్ అయిన ఆయన తన వైఫల్యాన్ని కప్పి పుచ్చుకోవడానికి తెగ పాట్లు పడుతున్నారు. పార్టీని ఎలా నడపాలో అర్థంకాక అధికారపార్టీని టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. తాజాగా శనివారం ఎమ్మెల్యేలపై ఆయన మండిపడ్డారు.

ఎమ్మెల్యేలు ఏం చెబితే అదే చేయాలనుకున్నట్లు  పోలీసు, రెవెన్యూ, పరిపాలనా వ్యవస్థలు మారిపోయాయన్నారు. ఎమ్మెల్యేలు వారి అసెంబ్లీ స్థానానికి సీఎంగా మారిపోయారని విరుచుకుపడ్డారు. పోలీసు వ్యవస్థ పూర్తిగా ఎమ్మెల్యేలకు తాబేదారులుగా మారిపోయిందన్నారు. జీతం సీఎంలు ఇవ్వడం లేదని… ప్రజలు ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలు వస్తుంటే పోలీసులు పరుగులు పెడుతున్నారన్నారు. పోస్టింగుల కోసం ఎమ్మెల్యేలు లెటర్లు ఇచ్చే సంప్రదాయం మారాలని… అవసరమైతే సీఎం జీవో జారీ చేయాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. 

ఎమ్మెల్యేలను అధికారులు గౌరవిస్తే తప్పేమిటి?

లక్ష మందికి పైగా ఓటర్లకు ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్యేలను అధికారులు గౌరవిస్తే సోముకు వచ్చిన అభ్యంతరం ఏమిటి? అయిదేళ్ల పాటు ప్రజల బాగోగులు చూడడానికి ఎన్నికైన ఎమ్మెల్యే వివిధ సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం, వారు దాన్ని పాటించడం సహజం. ప్రొటోకాల్ ప్రకారం అధికారులు నడుచుకుంటారు. దాన్ని ఎమ్మెల్యేలు వస్తుంటే పోలీసులు పరుగులు పెడుతున్నారంటూ వక్రీకరించడం ఎందుకు? పోలీసులు ఎమ్మెల్యే మాట వినకుండా ఎవరి మాట వినాలి? ఎమ్మెల్యేలు వారి అసెంబ్లీ స్థానానికి సీఎంగా మారిపోవడం ఏమిటి? అసలు అది సాధ్యమేనా? సీఎంకు, ఎమ్మెల్యేకు ఉన్న తేడా సోముకు ఆ మాత్రం తెలియదా?

తమ దగ్గరకు వచ్చి సాయం అడిగిన
వారికి సిఫారసు లెటర్లు ఇవ్వడం ఏ ప్రభుత్వంలో అయినా సహజం. నిబంధనలకు అనుగుణంగా ఉంటేనే ఉన్నతాధికారులు ఎమ్మెల్యే సిఫారసును పరిశీలిస్తారు. లేదంటే తిరస్కరిస్తారు. ఇంతమాత్రం దానికి సిఫారసు లేఖలు వద్దంటూ సీఎం జీవో జారీ చేయాలని సోము
డిమాండ్ చేయడం ఎందుకు? ఫలానా నియోజకవర్గంలో ఎమ్మెల్యే కారణంగా అధికార దుర్వినియోగం జరిగింది.. అధికారులు, ఎమ్మెల్యే కుమ్మక్కు అయి ఫలానా వ్యక్తికో, వ్యక్తులకో అన్యాయం చేశారు. చర్యలు తీసుకోండి అని డిమాండ్ చేస్తే అర్థం ఉంటుంది కానీ ఇలా మొత్తం ఎమ్మెల్యేేల మీద కడుపు మంటతో వ్యాఖ్యలు చేస్తే విలువ ఉంటుందా?

దూకుడు పెంచడం అంటే ఇది కాదేమో..

వివిధ కారణాల వల్ల రాష్ట్రంలో జనాగ్రహాన్ని మూటగట్టుకున్న భారతీయ జనతా పార్టీని ఎలా ముందుకు నడిపించాలో సోముకు అర్థంకావడం లేదు. ఇటీవల నిర్వహించిన జనాగ్రహ సభలో సోము చేసిన ప్రసంగం కూడా ఆ పార్టీపైన, ఆయనపైన జనంలో ఆగ్రహం కలిగించింది. రాష్ట్రంలో ప్రతి ఐదుగురిలో ఒకరు తాగుబోతు అని లెక్క గట్టి, వారందరికీ రూ.50కే చీప్ లిక్కరు అందిస్తామని చేసిన వాగ్దానం ఆయన పేరును సారా వీర్రాజుగా మార్చేసిన సంగతి తెలిసిందే. ఆ విధంగా నవ్వులపాలైన సోము అప్పటి నుంచి రోజుకో రకంగా మాట్లాడి జనం దృష్టిలో పడాలని చూస్తున్నారు.

రాష్ట్రంలో బీజేపీ దూకుడు పెంచుతుందని, వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ గెలవడం ఖాయం అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. దూకుడు పెంచడం అంటే ఈయనేదో కొత్త కార్యాచరణతో బీజేపీని ముందుకు నడిపిస్తారేమోనని జనం అనుకున్నారు. కానీ ఈయన కేవలం వివాదాస్పద ప్రకటనలకే పరిమితం అవుతున్నారు. తాము అధికారంలోకి వస్తే జిన్నా టవర్? కేజీహెచ్, కాటన్ బ్యారేజీల పేర్లు మార్చేస్తామని, రూ. 10 వేల కోట్లతో అమరావతిని నిర్మిస్తామని ప్రకటనలు ఇస్తున్న సోము ఇలాంటి పసలేని విమర్శలు చేసే కన్నా అసలు అధికారంలోకి ఎలా రావాలో కసరత్తు చేస్తే మంచిది అనే సూచనలు వినిపిస్తున్నాయి.