ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు ఉధృతంగా వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే. దాంతో కరోనా మరణాలు తగ్గించడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై సామాజిక ఆసుపత్రుల్లో కూడా (సీహెచ్సీ) ఆక్సిజన్ బెడ్లను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. సామాజిక ఆసుపత్రుల్లో 5నుండి 10 ఆక్సిజన్ బెడ్లను అందుబాటులో ఉంచాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.
కోవిడ్ లక్షణాలతో ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడితే కోవిడ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలని సాధారణ జ్వరం, శ్వాసకోస సమస్యలతో బాధపడే వారికి సామాజిక ఆసుపత్రుల్లో చికిత్స అందించాలని జగన్ తెలిపారు. దీంతో సామాజిక ఆసుపత్రుల్లో ఆక్సిజన్ బెడ్లు అందుబాటులోకి రానున్నాయి.
తాడేపల్లిలో క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఒకవేళ కరోనా సోకితే ప్రజలు పాటించాల్సిన నియమాలను అన్ని ప్రభుత్వాస్పత్రుల వద్ద హోర్డింగ్స్, పోస్టర్లు పెట్టించాలని, కోవిడ్ ఆస్పత్రుల్లో అందుతున్న సేవలపై ఫీడ్బ్యాక్ తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. కరోనా నివారణ చర్యల్లో ఎమ్మెల్యేల భాగస్వామ్యం తీసుకోవాలని ప్రజల్లో అవగాహన ఏర్పరిచి వారిలో చైతన్యం కలిగించే కార్యక్రమాలు చేపట్టాలని సీఎం జగన్ సూచించారు.