iDreamPost
iDreamPost
ఎన్నికల ప్రచారంలో పార్టీలు, అభ్యర్థులు రకరకాలుగా ప్రచారం చేస్తుంటారు. ఓటర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా పలు వింత పద్ధతులు, వినూత్న ఆలోచనలు ఆచరణలో పెడుతుంటారు. ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కోవిడ్ దృష్ట్యా బహిరంగ సభలు, ర్యాలీలను ఎలక్షన్ కమిషన్ ఈ నెల 31 వరకు నిషేధం విధించడంతో పార్టీలు వర్చువల్ విధానాలు, ఇంటింటి ప్రచారాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఒక కొత్త ఆలోచన చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలతో ఏమాత్రం సంబంధం లేని ఢిల్లీ ప్రజలను పరోక్షంగా తమ పార్టీ ప్రచారానికి వినియోగించుకునే ప్లాన్ వేశారు. అలా అని ఢిల్లీ ప్రజలను ఆయా రాష్ట్రాల్లో తిప్పి ప్రచారం చేయించడం కాదు. సామాజిక మాధ్యమాల ద్వారా పరోక్ష ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.
ఢిల్లీలో ఆప్ విజయాలపై అక్కడివారితోనే చెప్పించే యత్నం
ఢిల్లీలో కేజ్రీవాల్ నేతృత్వంలో అధికారంలో ఉన్న ఆప్ గత కొన్నేళ్లుగా అనేక సంక్షేమ, అభివృద్ధి పనులతో ఢిల్లీవాసుల మనసు చూరగొనడంలో సక్సెస్ అయ్యింది. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో పంజాబ్, ఉత్తరాఖండ్, గోవాల్లో విజయంపై కన్నేసింది. ఢిల్లీ పథకాలనే ఎన్నికల హామీలుగా ఇచ్చింది. ఏ నేపథ్యంలో ఆప్ ప్రభుత్వ పథకాల ఫలాలు అందుకుంటున్న ప్రజలను వాటి గురించి వివరిస్తూ పంజాబ్, ఉత్తరాఖండ్, గోవాల్లో ఉన్న మిత్రులు, బంధువులు, కుటుంబ సభ్యులకు వివరించి ఆయా రాష్ట్రాల్లోనూ ఆప్ అభ్యర్థులకు ఓటు వేయమని చెప్పాలని ఢిల్లీ వాసులకు కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. అంతేకాకుండా ఢిల్లీలో అందుతున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలు గురించి వివరిస్తూ యూట్యూబ్, వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ తదితర సామాజిక మాధ్యమాల్లో విరివిగా పోస్టింగులు పెట్టి షేర్ చేయాలని కోరారు. బాగా వైరల్ అయిన ప్రచార పోస్టుల్లో 50 పోస్టులను ఎంపిక చేసి.. వాటిని రూపొందించిన వారికి తనతో డిన్నర్ కు అవకాశం కల్పిస్తానని కేజ్రీవాల్ ఆఫర్ చేశారు.
ఏక్ మోకా కేజ్రీవాల్ కో.. నినాదం
మరోవైపు కోవిడ్ ఆంక్షలు అమల్లో ఉండటంతో ఆప్ తరపున వర్చువల్ ప్రచారాన్ని కేజ్రీవాల్ ప్రారంభించారు. ఏక్ మోకా కేజ్రీవాల్ కో (కేజ్రీవాల్ కు ఒక్క అవకాశం) అన్న నినాదంతో ఈ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఢిల్లీలో తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను, తమ ప్రభుత్వ పాలనను మోడల్ గా చూపించి పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్ ఎన్నికల్లో ప్రచారం చేయాలని వ్యూహం రూపొందించారు. ఢిల్లీలో పాఠశాలల అభివృద్ధి, మొహల్లా క్లినిక్ లకు ఐక్యరాజ్యసమితి ప్రశంసలు లభించడం, 24 గంటల తాగునీరు, ఉచిత విద్యుత్ వంటి కార్యక్రమాలను చూపించి ఆయా రాష్ట్రాల్లో ఆప్ అధికారంలోకి వస్తే వాటన్నింటినీ అమలు చేస్తామని భరోసా ఇచ్చేలా వర్చువల్ ప్రచార కార్యక్రమాలు ప్రారంభించారు.