Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ పోలీసుల పనితీరుకు జాతీయస్థాయిలో అవార్డులు, ప్రశంసలు లభిస్తున్నాయి. కొవిడ్ కాలంలో వారు చూపుతున్న తెగువకు, ప్రజలకు అవగాహన కలిగిస్తున్న తీరుకు, మంచి చేసే వారిని ప్రోత్సహిస్తున్న వినూత్న చొరవకు ఏపీ పోలీసు శాఖ పేరొందింది.
కరోనాతో పోరాటంలో ముందువరుసలో ఉంటూ మరోవైపు నేరాల కట్టడికి, త్వరితగతిన కేసుల పరిష్కారానికి విశేష కృషి చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భుజం తట్టి ప్రోత్సహించాల్సింది పోయి.. నిబద్ధతతో విధులు నిర్వహిస్తున్న రాష్ట్ర పోలీసులపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నిరాధార ఆరోపణలు చేయడం సమంజసం కాదని, అసత్య ఆరోపణలు ఎందుకు చేస్తున్నారో తెలియడం లేదని డీజీపీ గౌతం సవాంగ్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో రాష్ట్ర పోలీసులు ప్రజలకు విశేష సేవలందిస్తూ.. అన్ని వర్గాలకు పూర్తిస్థాయిలో రక్షణ కల్పిస్తున్నారని ఆయన తెలిపారు.
పోలీసుశాఖ పనితీరుకు నిదర్శనాలివే…
2017లో 49.3 శాతం మందికి శిక్షలు పడగా.. 2020లో 64 శాతం మందికి శిక్షలు పడేలా చేయడం ప్రభుత్వ, పోలీసుల చిత్తశుద్ధికి నిదర్శనం. కృష్ణా జిల్లా గొల్లపూడిలో బాలికపై అఘాయిత్యం, హత్య కేసులో నిందితుడికి మరణశిక్ష పడిన సంగతి అందరికీ తెలిసిందే. గుంటూరు జిల్లా గిరిజన మహిళలపై దాడి, కర్నూలు జిల్లాలో మహిళపై దాడి, రాజమండ్రిలో బాలికపై అత్యాచారం.. ఇలా అన్ని కేసుల్లోనూ పోలీసులు వేగంగా స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో శిరోముండనం కేసు, ప్రకాశం జిల్లా చీరాల కేసుల్లో సంబంధిత ఎస్సైలపై శాఖాపరమైన చర్యలతో పాటు అట్రాసిటీ కేసుల కింద అరెస్టు చేసి రిమాండ్కు పంపించాం. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో దళితునిపై దాడి కేసులో సీఐపై చర్యలు తీసుకున్నాం. అంతకుముందు విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో డీజీపీ మీడియాతో మాట్లాడారు. విజయవాడ స్వర్ణ ప్యాలెస్ కేసులో విచారణ జరుగుతోందని.. నిందితులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.