APలో ఆ మహిళలకు జగన్‌ సర్కార్‌ శుభవార్త.. అకౌంట్‌లో రూ. 15 వేలు జమ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మరు నిమిషం నుంచే.. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు కృషి చేస్తున్నారు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తూ.. వారు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో సంక్షేమ పథకాలు అమలువుతున్నాయి. ప్రతి నెల ఏదో ఒక సంక్షేమ పథకానికి సంబంధించిన నిధులను లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తున్నారు సీఎం జగన్‌. ఈక్రమంలో ఈ నెల 22న ఏపీలోని కొందరు మహిళల ఖాతాలో 15 వేల రూపాయలు జమచేయనున్నారు సీఎం జగన్‌. ఆ వివరాలు..

ఏపీలో కాపు మహిళలకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఈ నెల 22న కాపు నేస్తం పథకం నిధుల్ని విడుదల చేయనున్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో జరిగే కార్యక్రమంలో పాల్గొని.. బటన్‌ నొక్కి.. లబ్ధిదారుల ఖాతాలో.. 15 వేల రూపాయల్ని జమ చేయనున్నారు సీఎం జగన్‌. సీఎం పర్యటన నేపథ్యంలో.. ఏర్పాట్లపై కలెక్టర్‌ మాధవీలత సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు రూట్‌ మ్యాప్‌తో పాటు.. సెయింట్‌ ఆంబ్రోస్‌ హైస్కూల్‌లో సభ, నెహ్రూబొమ్మ సెంటరు ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో హెలిప్యాడ్‌కు సంబంధించిన స్థలాలను ఇప్పటికే పరిశీలించారు అధికారులు.

రాష్ట్ర వ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన 45 నుంచి 60 ఏళ్ల లోపున్న మహిళలకు ప్రభుత్వం వైఎస్సార్‌ కాపు నేస్తం కింద.. ప్రతి ఏడాది రూ.15వేల చొప్పున సాయం అందిస్తోంది జగన్‌ సర్కార్‌. అంటే ఈ మహిళలకు.. ఐదేళ్లలో మొత్తం రూ.75,000 ఆర్థిక సాయం అందించనుంది. దీనిలో భాగంగా ఈ నెల 22న కాపు నేస్తం నాల్గవ విడత డబ్బుల్ని విడుదల చేస్తున్నారు.

ఎవరు అర్హులు అంటే..

  1. కుటుంబ నెలసరి ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.10,000/- లోపు ఉన్నవారు ఈ పథకానికి అర్హులు.
  2. అదే పట్టణ ప్రాంతాల్లో అయితే నెలసరి ఆదాయం రూ.12,000/- వేల లోపు ఉండాలి.
  3. కాపు నేస్తం పథకానికి అర్హులు కావాలంటే.. సదరు కుటుంబానికి గరిష్టంగా మూడు ఎకరాల మాగాణి లేదా పది ఎకరాల మెట్ట భూమి..
  4. లేదా మాగాణి మెట్ట రెండూ కలిపి పది ఎకరాలకు మించకూడదు.
  5. అలాగే పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగులు, అంతకన్నా తక్కువ విస్తీర్ణంలో ఇల్లు ఉన్నవారు మాత్రమే అర్హులు.
  6. కారు లాంటి నాలుగు చక్రాల వాహనాలు ఉంటే అనర్హులు.
  7. అయితే జీవనోపాధిలో భాగంగా ఆటో, టాటా ఏస్‌, ట్రాక్టర్‌ వంటి వాహనాలు ఉన్నవాళ్లు మాత్రం అర్హులు అవుతారు.
  8. అలానే కుటుంబంలో ఎవరైనా వృద్ధాప్య, వికలాంగ పెన్షన్ తీసుకుంటున్నప్పుటికీ ఈ పథకానికి అర్హులు.
  9. ఇక కుటుంబంలో ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం ఉంటే కాపు నేస్థం పథకానికి అనర్హులు.
  10. అలానే ప్రభుత్వ పెన్టన్‌ పాందుతున్నవారు సైతం కాపు నేస్తానికి అనర్హులు.
  11. కుటుంబంలో ఎవరైనా ఆదాయపన్ను చెల్లిస్తే ఈ పథకానికి అనర్హులు.

ఏ డాక్యుమెంట్లు కావాలి..

  • ఆధార్‌ కార్డు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, వయసు నిర్దారణ ధృవీకరణ పత్రం, నివాస ధృవీకరణ పత్రం సమర్పించాలి.

కాపు నేస్తం పథకానికి సంబంధించిన డబ్బులు ఖాతాలో పడగానే లబ్ధిదారుల మొబైల్‌కు మెసేజ్ వస్తుంది. ఒకవేళ ఈ పథకం కింద లబ్ది పొందేందుకు అర్హత ఉన్నప్పటికి.. అనుకోని కారణాల వల్ల లబ్ధిదారుల జాబితాలో పేర్లు లేని వారు వెంటనే గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లి మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఆ దరఖాస్తులను పరిశీలించి ఆమోదించిన తర్వాత అర్హులైన వారికి కూడా కచ్చితంగా ఆర్థిక సాయం అందుతుంది. అర్హతలు ఉండి.. జాబితాలో పేరు ఉన్నప్పటికి కూడా అకౌంట్‌లో డబ్బులు పడకపోతే దగ్గరలోని సచివాలయంలో సంప్రదించాల్సి ఉంటుంది. అలాగే అర్హుల జాబితాను ఆయా సచివాలయాల్లో ప్రదర్శిస్తారు.

Show comments