iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు మరోసారి హైదరాబాద్ లో అడుగుపెట్టారు. ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇంటికి చేరుకున్నారు. అయితే ఆయన ఇంట్లో ప్రవేశానికి అవకాశం లేకుండా చేయడంతో అక్కడే చాలాసేపటిగా ఎదురుచూస్తున్నారు. దాంతో ఈ వ్యవహారం ఆసక్తిగా మారుతోంది. ఏపీ సీఐడీ అధికారులు ఎంపీకి నోటీసులు ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. దానికి సంబంధించిన వివరాలిప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
రాష్ట్రంలో విద్వేషాలు రగల్చాలనే లక్ష్యంతో గతంలో రఘురామకృష్ణంరాజు చేసిన ప్రయత్నాలకు ఏపీ సీఐడీ చెక్ పెట్టింది. ఆయన మీద కేసు నమోదయ్యింది. అరెస్ట్, జైలుకి తరలించడం, ఆ సందర్భంగా జరిగిన పరిణామాలు వివాదాస్పదమయ్యాయి. ఆ తర్వాత కొంతకాలం మౌనంగా ఉన్నప్పటికీ ఇటీవల మరోసారి రఘురామకృష్ణంరాజు నోటికి పనిచెబుతున్నారు. పలు సందర్భాల్లో కుల, మతాల ప్రస్తావనతో నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు.
ఈ తరుణంలో ఏపీ సీఐడీ అధికారులు రంగంలోకి దిగడం చర్చకు దారితీస్తోంది. ఇటీవల తన అనర్హత అంశంలో వేగంగా అడుగులు పడుతున్న తరుణంలో రఘురామకృష్ణంరాజు రాజీనామా ఆలోచనకు వచ్చారు. వచ్చే నెల ప్రారంభంలో రాజీనామా చేస్తానని కూడా ప్రకటించారు. మరోసారి నర్సాపురం నుంచి ఎంపీగా బరిలో ఉంటానని కూడా ఆయన చెబుతున్నారు. దానికి అనుగుణంగా ఈనెల 13న ఏపీలో అడుగుపెట్టాలని ఆయన ఆలోచిస్తున్నారు. సుదీర్ఘకాలంగా ఆయన సొంత నియోజకవర్గానికి, రాష్ట్రానికి దూరంగా ఉన్నారు. రెండేళ్లుగా ఆయన హైదరాబాద్, ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.
ఈ పరిస్థితుల్లో ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఏ అంశంలో నోటీసులు ఇస్తున్నారు, విచారణకు కూడా పిలుస్తున్నారా అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా ఉంది. ఏపీ సీఐడీ చర్యలతో రఘురామకృష్ణంరాజు కలవరపడినట్టు కనిపిస్తోంది. తన ఇంటి వద్దనే సీఐడీ అధికారులు ఉన్నప్పటికీ ఆయన నోటీసులు తీసుకునేందుకు కూడా చాలాసేపటికి బయటకు రావడం విశేషం. ఈ వ్యవహారంలో సీబీఐ అధికారుల నోటీసుల్లో ఏముందన్నదానిపై రఘురామకృష్ణంరాజు భవితవ్యం ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు.
Also Read : అయ్యో పాపం… ఆదాయపుపన్ను శాఖపై చంద్రబాబు ఎందుకు అలా వాపోతున్నారు..