iDreamPost
android-app
ios-app

అనంత టీడీపీలో ఆ ఇద్దరినీ పక్కన పెట్టేశారా?

  • Published Jan 09, 2022 | 7:31 AM Updated Updated Mar 11, 2022 | 10:26 PM
అనంత టీడీపీలో ఆ ఇద్దరినీ పక్కన పెట్టేశారా?

అవకాశవాద రాజకీయాలకు చంద్రబాబు పెట్టింది పేరు. అవసరం ఉన్నన్నాళ్లు వాడుకోవడం.. ఇక వారివల్ల ఉపయోగం లేదనుకుంటే పట్టించుకోకుండా పక్కన పెట్టేయడం ఆయనకు అలవాటే. నవంబరులో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో దారుణ ఓటమిలో తన వైఫల్యాన్ని, నాయకత్వ లోపాన్ని కప్పిపుచ్చుకుని.. ఎక్కడికక్కడ స్థానిక నాయకత్వంపై ఆ బాధ్యత నెట్టేశారు. జిల్లాల వారీగా జరిపిన సమీక్షల్లో పార్టీలో కోవర్టులు ఉన్నారు.. వారిని ఏరిపారేస్తానని హెచ్చరించారు.

తాజాగా రెండు రోజులపాటు జరిగిన సమావేశాల్లో పార్టీ కోసం త్యాగాలు చేసేవారే ఉండాలని.. చేయలేనివారు వెళ్లిపోవచ్చని సూచించారు. అటువంటి పలువురు సీనియర్ నేతలను చంద్రబాబు ఇప్పటికే టార్గెట్ చేశారని పార్టీలో చర్చ జరుగుతోంది. అనంతపురం జిల్లాకు సంబంధించి మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి ఆ లిస్టులో ఉన్నారని.. వారికి ఇక పార్టీలో భవిష్యత్తు లేదని ఆ జిల్లా పార్టీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. పార్టీ ప్రారంభం నుంచీ ఉన్న వారిద్దరినీ వదిలించుకోవాలన్న బాబు ఆలోచన ఇటీవల ఆయన నిర్వహించిన సమీక్షలోనే కనిపించిందని అంటున్నారు.

పుట్టపర్తి ఆశిస్తున్న కిష్టప్పకు కష్టమే

జిల్లా టీడీపీలో అత్యంత సీనియర్ అయిన నిమ్మల కిష్టప్ప గోరంట్ల నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత 2009, 2014లో హిందూపురం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే 2019లో ఓడిపోయిన ఆయన అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో అంత చురుగ్గా ఉండటం లేదని, ప్రజల్లోనూ కనిపించడం లేదని పార్టీ వర్గాల ద్వారా చంద్రబాబుకు ఫిర్యాదులు అందాయి. కాగా వచ్చే ఎన్నికల్లో పుట్టపర్తి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆశ పడుతున్నారు. ఆ నియోజకవర్గంలో కొద్దిమంది నేతలను వెంటేసుకుని తిరుగుతున్నారు. ఆ నియోజకవర్గ ఇంఛార్జి పల్లె రఘునాథరెడ్డి దీనిపై చంద్రబాబుకు ఫిర్యాదు చేయడంతో ఇటీవల జరిగిన సమావేశంలో ఆయన్ను ప్రశ్నించినట్లు తెలిసింది.

పెనుకొండ ఓటమిపై ఆగ్రహం

జిల్లాలో టీడీపీకి కంచుకోటగా భావించే పెనుకొండ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ దారుణ పరాభవాన్ని కూడా చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నారు. అక్కడ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి ఇంఛార్జిగా ఉన్నా మొత్తం 20 వార్డుల్లో కేవలం రెండు చోట్లే గెలవడం అవమానకరమని.. నాయకులను సమన్వయం చేసుకోవడంలో పార్థసారథి విఫలమయ్యారని, హిందూపురం మాజీ ఎంపీగా నిమ్మల కిష్టప్ప కూడా పట్టించుకోలేదని అప్పట్లోనే టీడీపీ అధినేత ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉండటం లేదన్న ఫిర్యాదులు సైతం ఉండటంతో ఇద్దరు నేతలను పక్కన పెట్టి కొత్త ఇంఛార్జిలను నియమించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో టీడీపీలో ఇద్దరు సీనియర్ నేతల పాత్ర ముగిసినట్లేనని పార్టీ క్యాడర్ భావిస్తోంది.