iDreamPost
android-app
ios-app

అదే ఒడుపు.. ఎడతెగని ఏడుపు..

  • Published Jan 09, 2022 | 2:25 AM Updated Updated Mar 11, 2022 | 10:26 PM
అదే ఒడుపు.. ఎడతెగని ఏడుపు..

ఒడుపు తెలిసిన రాతలతో ఏడుపు గొట్టు జర్నలిజాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న ఏబీఎన్, ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ ఈ వారం కూడా తనదైన శైలిలో పేట్రేగిపోయారు. సాధారణంగా పాఠకులను నమ్మించడానికి కొన్ని నిజాలను, ఎన్నో అబద్దాలను కలగలిపి కొత్త పలుకును వండి వార్చే రాధాకృష్ణ.. ఈసారి మాత్రం అన్నీ అవాస్తవాలనే వడ్డించేశారు.

ఏపీ విద్యా,వైద్య రంగాల్లో వెనుకబడిందట!

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంపశయ్యపై ఉందని, అప్పుల కోసమే ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లారని అడ్డగోలుగా రాసేశారు. ఆంధ్రప్రదేశ్ విద్యా,వైద్య రంగాల్లో వెనుకబడి ఉందని కేంద్ర నివేదికలు చెబుతున్నాయట. అవి ఏ సంస్థలు ఇచ్చిన నివేదికలు? ప్రభుత్వ రంగంలోనివా? స్వచ్ఛంద సంస్థలా? ఎప్పుడు..ఏ ప్రాతిపదికన చెప్పాయి? వంటి వివరాలేమీ ఉటంకించకుండా అలా రాసేశారు అంతే! అలాగే పేదరికంలో ఏపీ 20వ స్థానంలో ఉందని రాసేశారు. దానికి ఏ ప్రామాణికత చూపలేదు. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యా, వైద్య రంగాలకు అత్యంత ప్రాధ్యాన్యమిచ్చి వేల కొట్ల రూపాయలు వెచ్చించింది. సత్ఫలితాలు సాధించింది. అమ్మ ఒడి, మా బడి నాడు- నేడు, విద్యా దీవెన, విద్యావసతి, జగనన్న గోరు ముద్ద వంటి పథకాలను చిత్తశుద్ధితో అమలు చేస్తోంది.

ఫలితంగా విద్యారంగంలో ప్రైవేటు దోపిడీకి అడ్డుకట్ట పడింది. ప్రభుత్వ పాఠశాలల్లో గడచిన రెండున్నరేళ్లుగా చేరికలు పెరిగాయి. మరోపక్క ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. విద్యాశాఖ రికార్డుల ప్రకారం సర్కారు బడుల్లో 7.30 లక్షల మంది విద్యార్థులు అదనంగా ఈ రెండున్నర ఏళ్లలో చేరారు. పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పాఠశాల భవనాలను, టీచర్లను, సదుపాయాలను పెంచే పనిలో అధికారులు ఉన్నారు. వైద్య రంగంలో కూడా నాడు – నేడు పథకంలో ఆస్పత్రుల, పీహెచ్ సీ ల భవనాలను నిర్మించారు. 104, 108 సేవల కోసం 1088 వాహనాలను ఒకేసారి ప్రారంభించి సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచారు. రాష్ట్రంలోని 90 శాతం మందిని ఆరోగ్య శ్రీ పరిధిలోకి తెచ్చారు. డయాలసిస్, తలసేమియా రోగులకు రూ. 10 వేల పింఛన్ అందిస్తున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క వైద్య రంగంలోనే 40 వేల ఉద్యోగాలను సృష్టించి ఇచ్చింది. అందువల్లనే కరోనాను సమర్థంగా ఎదుర్కొంది. వాస్తవాలు ఇలా ఉంటే ఇందుకు పూర్తి  విరుడ్డంగా రాధాకృష్ణ రాయడం గమనార్హం.

ఇంగ్లీషు మీడియం గత ప్రభుత్వమే అమలు చేసిందట!

కొందరు కోర్టులకు వెళ్లి పేదలకు ఇంగ్లీషు మీడియం విద్య అందకుండా అడ్డుకున్నారని ఇటీవల సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు వేమూరి వారు భుజాలు తడుముకున్నారు. సర్కారు పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంను గత ప్రభుత్వమే అమలు చేసిందని అబద్దం రాసేశారు. ప్రాథమిక విద్యలో తెలుగును పూర్తిగా తొలగిస్తాననడంపైనే తమ అభ్యంతరం అని, తెలుగుతోపాటు ఇంగ్లీషు కూడా బోధిస్తామంటే వద్దనేది ఎవరు అంటూ అతి లౌక్యంగా ఒక ప్రశ్నను సంధించారు. అయితే ప్రభుత్వం మొదటి నుంచి చెబుతున్నది అదే. తెలుగు కూడా ఒక సబ్జెక్టుగా ఉంటుందని, పేద విద్యార్థులు ఉద్యోగాల్లో పోటీ పడడానికే ఇంగ్లీషు మీడియం ప్రవేశ పెడుతున్నామని చెబుతున్నా వినకుండా పచ్చ రచ్చ చేసి ఇప్పుడు ఏమీ ఎరగనట్టు కామెంట్ చేయడం ఆర్కేకే చెల్లింది. అలాగే గృహ రుణ బకాయిలను గత ప్రభుత్వాలు ఎప్పుడో మాఫీ చేసేశాయని, అందుకే బకాయిలు కట్టమని ఏ ప్రభుత్వం ఒత్తిడి చేయలేదని రాధాకృష్ణ భాష్యం చెప్పారు.

అందరూ మర్చిపోయిన ఈ బకాయిలను ఓటీఎస్ పేరిట ఇప్పుడు వసూలు చేయడం దారుణం కాదా? అని బాధాకృష్ణ వాపోయారు. గత ప్రభుత్వాలు రుణాలు మాఫీ చేస్తే ఆ మేరకు క్రయవిక్రయాలకు అవకాశం కల్పించే ఇంటిపై సంపూర్ణ హక్కు పత్రాలు పేదలకు ఎందుకు ఇవ్వలేదో? అసలు ఏ ప్రభుత్వాలు ఎప్పుడు రుణ మాఫీ చేశాయో రాధాకృష్ణ రాయలేదు. ఎందుకంటే ఆయన రాసింది పచ్చి అబద్ధం కనుక. పైగా ఓటీఎస్ స్వచ్ఛందం అని ప్రభుత్వం చెబుతున్నా బలవంతపు వసూళ్లు అంటూ శోకర్ణాలు పెట్టడం ఎందుకో? సంక్షేమం పేరిట విచ్చలవిడిగా ప్రజల సొమ్ము పంచేస్తున్న జగన్ తన సొంత నిధులతో ఒకరికైనా చదువు చెప్పించారా? వైద్యం చేయించారా? అని ప్రశ్నించారు. రాధాకృష్ణ ఈ ప్రశ్నను పులివెందుల పోయి అడిగితే బాగుండేది.

వైఎస్సార్ కుటుంబీకులు సొంత నిధులతో అక్కడ ఎవరెవరికి ఎలాంటి సాయం చేసింది తెలుస్తుంది. సొంత నిధులతో అక్కడ ప్రారంభమైన సంక్షేమమే ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం తరపున విస్తరించింది అన్న సంగతి రాధాకృష్ణకు అర్థమయ్యేది. అయినా చేసేది సంక్షేమ కార్యక్రమమని ఒప్పుకుంటూనే అలా చేయొద్దు అని గగ్గోలు పెట్టడం ఎందుకు? సంతృప్త స్థాయిలో పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే విచ్చలవిడిగానే ఖర్చు చేయాలి. జగన్ అదే చేస్తున్నారు. ఇందులో రాధాకృష్ణకు వచ్చిన  ఇబ్బంది ఏమిటి? అయినా సంక్షేమ పథకాల వల్ల జీవన ప్రమాణాలు మెరుగు పడలేదని, జనం ఆదాయాలు పెరగలేదని సన్నాయి నొక్కులు నొక్కారు. సంక్షేమ పథకాలను చిత్తశుద్ధితో అమలు చేయడం వల్లనే కరోనా కష్టకాలంలో పేదల బతుకులు వీధిన పడలేదు అన్న సంగతి రాధాకృష్ణకు తెలియదా?

సినిమా టిక్కెట్ల ధరలు తగ్గించడంపైనా బాధ..

ఎవరి మీదో కక్షతో సినిమా టిక్కెట్ల ధరలు జగన్ తగ్గించారని, దానికి పేదలకు మేలు అనే ముసుగు వేస్తున్నారని సూత్రీకరించిన రాధాకృష్ణ అది ఎవరో రాయలేదు. అంటే సినిమా రంగంలో కొందరితో సీఎం జగన్మోహన్ రెడ్డికి విభేదాలు ఉన్నాయని మనం అనుకోవాలన్న మాట. ఆవిధంగా సినిమా టిక్కెట్ల ధరలను తగ్గించడం ఒక కక్ష సాధింపుగానే చూడాలి తప్ప ప్రజలకు మేలు చేసే చర్యగా మనం ఎంత మాత్రం భావించకూడదన్న మాట! అయినా టిక్కెట్ల రేట్ల విషయంలో తెలంగాణాలో లేని బాధ ఆంధ్రాలో ఎందుకు అని ప్రశ్నించారు. అంటే పక్క వీధిలోని ఇంట్లో
దొంగలు పడి దోచుకుపోయినప్పుడు వాళ్లు కిక్కురుమనలేదు.. మీ ఇంట్లో దొంగలు పడితే మీరెందుకు అరుస్తున్నారు అన్నట్టు ఉంది రాధాకృష్ణ ధోరణి. జనానికి మంచి చేయాలన్నా పక్క రాష్త్రంలో చేసే వరకూ ఆగాలా? మద్యం, డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించడం మానేసి సినిమా టిక్కెట్ల ధరలు తగ్గించడం ఎందుకు అని ప్రశ్నించిన ఆయన ఇటీవల మద్యం ధరలు తగ్గిస్తే మొత్తం పచ్చబ్యాచ్ గగ్గోలు పెట్టిన సంగతి అప్పుడే మర్చిపోయారా? పెట్రోల్, డీజిల్ ధరలు తాము పెంచలేదు కనుక తగ్గించే ప్రసక్తి లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. అయినా వైఎస్సార్ సీపీ ప్రభుత్వాన్ని తరచుగా ఇదే అంశంపై అడిపోసుకోవడం మానడం లేదు.

గెలిపించినవారు పశ్చాత్తాప పడుతున్నారట!

ఏపీ బీద రాష్ట్రంగా దిగజారిపోయిందని, తనకు ఏ రాజ్యాంగం వర్తించదని జగన్ భావించే పక్షంలో
ఏపీని స్వతంత్ర దేశంగా ప్రకటించుకొని, సొంత రాజ్యాంగాన్ని రాసుకునే ఆలోచన చేయొచ్చు కదా అంటూ ఒక ఉచిత సలహా ఇచ్చారు. రాధాకృష్ణ ఇచ్చిన ఇలాంటి చచ్చు సలహాలు పాటించబట్టే 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు కోలుకోలేదు. గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని గెలిపించినందుకు పలువురు పశ్చాత్తాప పడుతున్నారని రాశారు. ఉద్యోగులు అయితే తమకు ఈ శాస్తి జరగవలసిందేనని అనుకుంటున్నారని, ఇతర వర్గాలదీ ఇదే పరిస్థితి అని ముక్తాయించారు. పీఆర్సీతో పాటు ప్రభుత్వం ప్రకటించిన ఇతర ప్రయోజనాలతో ఉద్యోగులు ఉబ్బితబ్బిబ్బు అవుతుంటే ఇంకా వారిని ప్రభుత్వంపై రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేయడం ద్వారా రాధాకృష్ణ తన బుద్దిని బయట పెట్టుకున్నారు.

తెలంగాణ రాజకీయాలపై ఎడాపెడా వ్యాఖ్యలు..

టీ పీసీసీ పీఠంపై చంద్రబాబు ప్రతిష్టించిన రేవంత్ రెడ్డిని హీరోలా చిత్రీకరిస్తూ, బీజేపీని పొగుడుతూ, కేసీఆర్ ను తెగడుతూ తెలంగాణ రాజకీయాలపై రాధాకృష్ణ ఎడాపెడా వ్యాఖ్యలు రాసేశారు. ప్రతిపక్షాల అనైక్యతను ఆసరాగా చేసుకొని ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చాలని కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని ఈయన కనిపెట్టిన విషయం మనతో పంచుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లో బీజేపీ గెలిస్తే ఆ పార్టీ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అవుతుందని ఈయన నిర్థారించేశారు. యూపీలో బీజేపీ గెలిస్తే కేసీఆర్ పై చర్యలు ఉంటాయని జోస్యం కూడా చెప్పేశారు. ఇలా తెలుగు రాష్ట్రాల్లో తనకు గిట్టని రెండు ప్రభుత్వాలపై ఎప్పటిలా విషం చిమ్ముతూ తన పచ్చ ఎజెండాను రాధాకృష్ణ నిస్సిగ్గుగా అమలు చేశారు.