దేశంలో ఉగ్రదాడులకు తెగబడేందుకు కుట్రలు పన్నుతున్న 9 మంది అల్-ఖైదా ఉగ్రవాదులను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ అరెస్ట్ చేసింది. ముగ్గురు ఉగ్రవాదులు కేరళలోని ఎర్నాకుళంలో పట్టుబడగా మరో ఆరుగురు పశ్చిమబెంగాల్లోని ముషీరాబాద్లో పట్టుబడ్డారు.
పట్టుబడిన 9 మంది ఉగ్రవాదులు పశ్చిమబెంగాల్ మరియు కేరళలోని వివిధ ప్రాంతాల్లో పేలుళ్లకు పాల్పడి దేశంలో అస్థిరతను పెంపొందించే విధంగా కుట్రలు పన్నుతున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా సామాన్య ప్రజలను లక్ష్యంగా చేసుకుని వారిని ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రేరేపించే విధంగా ఈ ఉగ్రవాదులు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.
పట్టుబడ్డ ఉగ్రవాదుల నుండి డిజిటల్ పరికరాలు, జిహాదీ సాహిత్యం, పదునైన ఆయుధాలు, పేలుడు పదార్థాలను తయారు చేయడానికి వినియోగించే లిటరేచర్ ను స్వాధీనం చేసుకున్నారు. వీరిని ఢిల్లీకి తరలించి కోర్టులో హాజరు పరచనున్నట్లు ఎన్ఐఏ అధికారులు తెలిపారు.