iDreamPost
android-app
ios-app

Intinti Gruhalakshmi: సడెన్ గా ముగిసిన ‘గృహలక్ష్మి’ సీరియల్! ఒక్కసారిగా చుట్టేశారు!

  • Published Jan 20, 2024 | 2:00 PMUpdated Jan 20, 2024 | 2:00 PM

స్టార్‌ మాలో ప్రసారం అవుతోన్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్‌ శనివారం నాటి ఎపిసోడ్‌తో ముగిసిపోయింది. ఆ వివరాలు..

స్టార్‌ మాలో ప్రసారం అవుతోన్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్‌ శనివారం నాటి ఎపిసోడ్‌తో ముగిసిపోయింది. ఆ వివరాలు..

  • Published Jan 20, 2024 | 2:00 PMUpdated Jan 20, 2024 | 2:00 PM
Intinti Gruhalakshmi: సడెన్ గా ముగిసిన ‘గృహలక్ష్మి’ సీరియల్! ఒక్కసారిగా చుట్టేశారు!

స్టార్‌ మాలో ప్రసారం అవుతోన్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్‌.. ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తులసి అమాయకురాలైన గృహిణి.. భర్త, పిల్లలే ఆమె లోకం. బయట ప్రపంచం గురించి ఏమాత్రం అవగాహన లేదు. ఇంటిల్లిపాదికి కావాల్సినవి అమర్చిపెట్టడమే ఆమెకు తెలుసు. కానీ భర్తకు మాత్రం భార్య కట్టు బొట్టు నచ్చక.. పిల్లలలకు పెళ్లి చేయాల్సిన వయసులో మొదటి భార్యకు విడాకులిచ్చి రెండో పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత ఆ గృహిణి తులసి పరిస్థితి ఏంటి.. ఎదుర్కొన్న సమస్యలేంటి.. ఆమె ప్రయాణం ఎలా సాగింది అనే కథతో వచ్చింది ఇంటింటి గృహలక్ష్మి సీరియల్‌.

ఇంటింటి గృహలక్ష్మి సీరియల్లో సీనియర్‌ హీరోయిన్‌ కస్తూరి గౌరి శంకర్‌ ప్రధాన పాత్ర అయిన తులసి క్యారెక్టర్‌లో నటించింది. ఒకప్పుడు స్టార్‌ మాలో టాప్‌ సీరియల్‌గా దూసుకుపోయింది. బీభత్సమైన టీఆర్‌పీ రేటింగులు సాధించింది. ప్రేక్షకులు సీరియల్‌ని విపరీతంగా ఆదరించారు. అంతా బాగానే ఉందనుకున్న సమయంలో హఠాత్తుగా కథలో మార్పులు చేసి.. టాప్‌ ప్లేస్‌లో ఉన్న సీరియల్‌ని కిందకు పడేశారు దర్శకుడు. దాంతో సీరియల్‌ టైమింగ్‌ కూడా మారింది. అయినా సరే ప్రేక్షకులు సీరియల్‌ని బాగానే ఆదరించారు. ప్రస్తుతం ఎంతో ఆసక్తికరంగా సాగుతున్న సీరియల్‌ని అర్థాంతరంగా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే.. శుభం కార్డు వేశాడు దర్శకుడు. శనివారం నాటి 1158వ ఎపిసోడ్‌తో గృహలక్ష్మి సీరియల్ ముగిసింది.

gruha lakshmi serial finished

అయితే సీరియల్‌ ముగుస్తుంది అని శుక్రవారం వరకు కూడా ఎలాంటి సూచన, ప్రకటన చేయలేదు సీరియల్‌ టీమ్‌. పైగా నిన్నటి ఎపిసోడ్‌లో కూడా విలన్‌ లాస్య.. నందును పెళ్లి చేసుకునే ప్రయత్నాల్లో ఉండటం.. అటు రాజ్యలక్ష్మి తన సవతి కొడుకు విక్రమ్‌ ఆస్తిని చేజిక్కించుకునేందుకు ప్లాన్‌లు వేయడం జరిగింది. మరి ఇంతలో ఏం జరిగిందో తెలియదు కానీ.. హఠాత్తుగా శనివారంతో ఈ సీరియల్‌ని ముగించారు. ఇక ఫైనల్‌ ఎపిసోడ్‌లో విలన్‌లను మార్చేసి.. మన హీరోయిన్‌ తులసిని మళ్లీ ఆమె మాజీ భర్త నందగోపాల్‌తో కలిపారు. అటు విక్రమ్‌కి అతడి సవతి తల్లి కుట్రల గురించి తెలిసి షాక్‌ అవుతాడు.

ఆస్తి కోసం రాజ్యలక్ష్మి.. తనకి విషం పెట్టబోతున్న విషయం విక్రమ్‌కి తెలుస్తుంది. దాంతో అప్పటి వరకు తాను దేవతగా పూజించిన తల్లి ఎంత రాక్షసో విక్రమ్‌కి అర్థం అవుతుంది. కేవలం ఆస్తి కోసమే తల్లి తనను ప్రేమించింది అని అర్థం చేసుకున్న విక్రమ్‌ గుండె విలవిల్లాడుతుంది. అయితే రాజ్యలక్ష్మి ప్లాన్‌ కన్నా ముందే దివ్య-విక్రమ్‌లు ఆస్తి మొత్తాన్ని ఆమె పేరు మీదకి మారుస్తారు. ఆ విషయం చెప్పడానికి వచ్చినప్పుడే రాజ్యలక్ష్మి అసలు స్వరూపం విక్రమ్‌కి తెలుస్తుంది. తాను దేవతలా భావించిన తల్లి తనను చంపడానికి ప్లాన్‌ చేయడం తట్టుకోలేని విక్రమ్‌.. విషం తాగి చనిపోవాలనుకుంటాడు.

దానికన్నా ముందు రాజ్యలక్ష్మి అంటే తనకు ఎంత ప్రేమ చెప్తాడు. అమ్మ కోసం చావడానికి కూడా రెడీ అవుతాడు విక్రమ్‌. దాంతో రాజ్యలక్ష్మికి కనువిప్పు కలుగుతుంది. కొడుకును క్షమించమని కోరి.. ఆస్తి పత్రాలు చించేస్తుంది. దీని కన్నా ముందు.. లాస్య ఎలా మారిందో చూపిస్తారో. లాస్య కొడుకు లక్కీకి యాక్సిడెంట్‌ అవుతుంది. అప్పుడు తులసే తన రక్తం ఇచ్చి మరీ లక్కీని కాపాడుతుంది. ఆ విషయం తెలుసుకున్న లాస్య.. తాను తులసికి ఎంత ద్రోహం చేసినా.. ఆమె మాత్రం తన కొడుకు ప్రాణాలు కాపాడింది అని తెలుసుకుని.. తన తప్పులకు క్షమించమని కోరుతుంది. అలా సీరియల్‌లో అందరూ మారి.. మాజీ భార్యాభర్తలైన నందగోపాల్‌-తులసిలను కలపడంతో సీరియల్‌ సుఖాంతం అయ్యింది.

అయితే ఇంత సడెన్‌గా సీరియల్‌ని ముగించడం వెనక కారణాలు మాత్రం తెలియడం లేదు. ప్రేక్షకులు కూడా ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకు ఇంత సడెన్‌గా సీరియల్‌ అయిపోగొట్టారు.. అసలేం జరిగిది అని ప్రశ్నిస్తున్నారు. మరి తెర వెనక ఏం జరిగిందో.. ఎందుకు సీరియల్‌ని ఇంత త్వరగా పూర్తి చేశారో తెలియాల్సి ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి