Vinay Kola
Telangana: తెలంగాణలో వరుస ఆత్మ హత్యలు కలకలం రేపుతున్నాయి. ఒకేరోజు ఇద్దరు ఇంటర్ విద్యార్ధులు చనిపోయారు.
Telangana: తెలంగాణలో వరుస ఆత్మ హత్యలు కలకలం రేపుతున్నాయి. ఒకేరోజు ఇద్దరు ఇంటర్ విద్యార్ధులు చనిపోయారు.
Vinay Kola
ప్రస్తుతం విద్యార్ధుల వరుస ఆత్మ హత్యలు కలకలం రేపుతున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని రెండు వేర్వేరు కాలేజీల్లో ఒకే రోజు ఇద్దరు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రస్తుతం ఈ ఘటన అందరినీ షాకింగ్ కి గురి చేస్తుంది. రాష్ట్రంలో విద్యార్ధుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్న తరుణంలో మళ్ళీ ఒకే రోజు ఇద్దరు విద్యార్ధుల ఆత్మహత్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. అసలేమయింది పూర్తి వివరాల్లోకి వెళితే..
బీబీనగర్ మండలంలోని పెద్దపలుగు తండాకు చెందిన బానోతు తనుష్ నాయక్ అన్నోజిగూడలోని నారాయణ జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ (ఎంపీసీ) చదువుతున్నాడు. సోమవారం సాయంత్రం హాస్టల్ బాత్రూమ్లోకి వెళ్లిన తనుష్ చాలా సేపటి దాకా బయటకు రాలేదు. దీంతో తోటి విద్యార్థులు, హాస్టల్ సిబ్బంది తలుపులు పగులగొట్టి చూశారు. చూడగానే షాక్. తనుష్ ఉరికి వేలాడుతూ కనిపించాడు. వెంటనే కాలేజీ సిబ్బంది దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే అనుష్ మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. దీంతో పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. తనుష్ మృతిపై కాలేజీ యాజమన్యం చెబుతున్న సమాధానం పలు అనుమానాలని రేకెత్తిస్తుంది. విద్యార్ధికి ఫిట్స్ వచ్చాయని, అందుకే మృతి చెందాడని అర్ధం పర్ధం లేకుండా మాట్లాడింది. అయితే బాత్రూంలో ఉరి కొయ్యకు వేలాడుతూ కనిపించిన తనుష్ కి.. ఫిట్స్ ఎలా వచ్చి చనిపోయాడని తల్లి దండ్రులు ప్రశ్నిస్తున్నారు. కచ్చితంగా కాలేజీలో వేధింపుల వలన తమ బిడ్డ ఆత్మహత్య చేసుకొని ఉంటాడని ఆరోపించారు. దీంతో తనుష్ తల్లిదండ్రులతో పాటు బంధువులు, విద్యార్థి సంఘాలు నిరసనకు దిగారు.
ఇదిలా ఉంటే నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలో కూడా ఇలాంటి దారుణమే జరిగింది. చిన్నతడం గ్రామానికి చెందిన ప్రజ్ఞారెడ్డి అనే విద్యార్ధిని ప్రగతి నగర్లోని ఎన్ఎస్ఆర్ ఇంపల్స్ ఐఐటీ గల్స్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. అక్కడే హాస్టల్లో ఉంటుంది. కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ సోమవారం ఉదయం 9.30 గంటల సమయంలో అఘాయిత్యం చేసుకుంది ప్రజ్ఞారెడ్డి. తన హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకొని చనిపోయింది. కానీ ఆమె చనిపోయిన విషయాన్ని దాచి పెట్టేందుకు కాలేజీ మ్యానేజ్మెంట్ చాలా ప్రయత్నాలు చేసింది. పెద్ద హైడ్రామానే క్రియేట్ చేసింది. హుటా హుటిన ప్రజ్ఞ మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించింది. దీంతో విద్యార్ధిని మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజ్ఞారెడ్డి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగం లోకి దిగారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రజ్ఞ కాలేజీలో వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకుందా లేదా మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఏదేమైనా ఒకే రోజు ఇద్దరు ఇంటర్ విధ్యార్ధులు ఇలా అనుమానస్పదంగా చనిపోవడం ప్రస్తుతం కలకలం సృష్టిస్తుంది.