వైన్స్‌ వద్ద దోస్తుల మధ్య గొడవ.. ఒకరి హత్య!

వైన్స్‌ వద్ద దోస్తుల మధ్య గొడవ.. ఒకరి హత్య!

మద్యం మత్తులో నిత్యం దేశ వ్యాప్తంగా ఎన్నో నేరాలు, ఘోరాలు చోటుచేసుకుంటున్నాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులు ఇలా ఎంతో అన్యోన్యంగా ఉంటున్న వారి మధ్య కూడా మందు చిచ్చుపెడుతోంది. తాజాగా, వైన్‌ షాపు వద్ద ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ జరిగింది. మద్యం మత్తులో ఇద్దరూ దారుణంగా కొట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి మరో వ్యక్తిని దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన శుక్రవారం హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్‌ నగర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హైదరాబాద్‌కు చెందిన గణేష్‌, మరో వ్యక్తి మంచి స్నేహితులు.

ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. కలిసి పనికి వెళ్లే వారు.. మందు తాగే వారు. శుక్రవారం కూడా ఇ‍ద్దరూ మందు తాగడానికి ఎస్‌ఆర్‌ నగర్‌లోని సోనీ వైన్స్‌ దగ్గరకు వచ్చారు. తమకు కావాల్సిన మందు కొనుక్కుని అక్కడే తాగారు. అయితే, మందు మత్తులో ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. ఆ గొడవ కాస్తా చినికి చినికి గాలి వానలా అయింది. ఈ నేపథ్యంలోనే గణేష్‌ మిత్రుడు బీరు బాటిల్‌తో అతడిపై దాడికి దిగాడు. బీరు బాటిల్‌ను పగుల కొట్టి దాంతో గణేష్‌పై దాడి చేశాడు. వైన్స్‌ దగ్గర ఇంత పెద్ద గొడవ జరుగుతున్నా ఎవ్వరూ ఆపడానికి ముందుకు రాలేదు.

చూస్తూ ఉండిపోయారే తప్ప వారిని విడిపించే ప్రయత్నం చేయలేదు. స్నేహితుడు పగుల కొట్టిన బీరు బాటిల్‌తో పొడవటంతో గణేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడిలో గణేష్‌ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఇక, సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గణేష్‌ మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరి, స్నేహితులు ఇద్దరి మధ్యా ఎందుకు గొడవ జరిగిందన్నది తెలియరాలేదు. నిందితుడి సమాచారం కూడా బయటకు రాలేదు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments