iDreamPost

టిటిడిపై దుష్ప్రచారం బాబు కుట్రే: బిజెపి ఎంపి సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు

టిటిడిపై దుష్ప్రచారం బాబు కుట్రే: బిజెపి ఎంపి సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు

తిరుమ‌ల తిరుప‌తి దేవస్థానం (టిటిడి)పై దుష్ప్రచారానికి టిడిపి అధ్య‌క్షుడు, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు కుట్ర ప‌న్నార‌ని, ఆయ‌న‌కు కొంత‌మంది బిజెపి నేత‌లు వ‌త్తాసు ప‌ల‌క‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని బిజెపి సీనియ‌ర్ నేత‌, రాజ్య‌స‌భ ఎంపి సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి పేర్కొన్నారు. రాష్ట్రంలో టిటిడి ఆస్తులపై చ‌ర్చ జ‌రుగుతున్న నేప‌థ్యంలో సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి ఒక టీవి చాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఈ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ‘‘ప్ర‌స్తుత‌ ప్రభుత్వం టిటిడి ఆస్తులను వేలం వేస్తోందన్న దుష్ప్రచారం అంతా చంద్రబాబు కుట్రే. వాస్తవానికి టిటిడి ఆస్తులను వేలం వేయాలని నిర్ణయించింది చంద్రబాబు ప్రభుత్వమే. అప్పటి టిటిడి కమిటీలో ఏపి బిజెపి నేత భాను ప్రకాశ్‌రెడ్డి కూడా సభ్యుడిగా ఉన్నారు. నా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం మాట మార్చి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు’’ అని సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి విమ‌ర్శ‌లు గుప్పించారు.


చంద్ర‌బాబు వేసిన క‌మిటీలో బిజెపి నేత‌లు కూడా ఉన్నారు

‘‘టిటిడికి చెందిన ఆస్తులను వేలం వేయాలని చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉండగానే నిర్ణయించారు. ఏపిలోనూ.. ఇతర రాష్ట్రాల్లో ఉన్న టిటిడికి చెందిన 84 ఆస్తులను విక్రయించాలని 2015లోనే టిటిడి పాలకమండలి నిర్ణయించింది. ఇందుకోసం 2015, జూలై 28న ఓ కమిటీని నియమించింది. ఆ కమిటీ పలుమార్లు భేటీ అయి ఆ ఆస్తులను కాపాడలేమని, విక్రయించాలని సూచించింది. ఆ కమిటీ నివేదికలో బిజెపి నేత భానుప్రకాశ్‌రెడ్డి కూడా సంతకం చేశారు. 2016 జనవరి 29న చివరిసారిగా ఆ కమిటీ సమావేశమై 53 ఆస్తులను విక్రయించాలని సూచించింది. అనంతరం 2016 జనవరి 30న సమావేశమైన టిటిడి పాలక మండలి.. 51 ఆస్తులను బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని తీర్మానించింది. ఆ సమయంలో ఏపిలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన తన మనుషులతో నియమించిన టిటిడి పాలకమండలే ఆ 51 ఆస్తులను విక్రయించాలని నిర్ణయించింది. అంటే టిటిడి ఆస్తులను విక్రయించాలన్న నిర్ణయం చంద్రబాబు ప్రభుత్వ హయాంలో తీసుకున్నదే. ఆ సమయంలో ఏపి బిజెపి నేత మాణిక్యాలరావే రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు’’ అని వివ‌రించారు.

కొందరు ఏపి బిజెపి నేతల తీరు దురదృష్టకరంః బిజెపి నేత‌లు ఉత్త‌రాఖండ్‌లో దీక్షలు చేయండి

‘‘చంద్రబాబు కుట్రలకు ఏపిలో కొందరు బిజెపి నేతలు వత్తాసు పలుకుతుండటం దురదృష్టకరం. అప్పట్లో టిటిడి ఆస్తుల వేలాన్ని సమర్థించిన ఏపి బిజెపి నేతలు ఇప్పుడు ప్లేటు ఫిరాయించారు. ఇళ్లల్లో ఉపవాస దీక్షలు చేయడం హాస్యాస్పదంగా ఉంది. వీరంతా కూడా ప్రజలకు సమాధానం చెప్పాలి. బిజెపి పాలిత ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో ఏం జరుగుతోందో ఆంధ్రప్రదేశ్‌ భారతీయ జనతా పార్టీ నేతలు తెలుసుకోవాలి. అక్కడ కేదార్‌నాథ్, బద్రీనాథ్‌ దేవాలయాలతో సహా అన్ని దేవాలయాలను ఆ రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అన్నింటికీ ముఖ్యమంత్రే తనను తాను చైర్మన్‌గా ప్రకటించుకున్నారు. ఇది బిజెపి సిద్ధాంతానికి విరుద్ధమని తెలీదా. ఏపి బిజెపి నేతలు ఉత్తరాఖండ్‌ వెళ్లి ఉపవాస దీక్షలు చేయాలి. అప్పుడు తప్పు చేశాను.. ఇప్పుడు అబద్ధాలు చెప్పానని చంద్రబాబు కూడా అంగీకరించాలి. ప్రజలకు క్షమాపణలు చెప్పాలి’’ అని సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి డిమాండ్ చేశారు.

ఏపికి చంద్ర‌బాబు ద్రోహం

‘‘అసలు టిటిడి ఆస్తులను వైసిపి ప్రభుత్వం వేలం వేస్తోందంటూ టిడిపి కృత్రిమ వివాదం సృష్టించింది. ఇది కచ్చితంగా చంద్రబాబు కుట్రే. నా దగ్గర అన్ని ఆధారాలూ ఉన్నాయి. ప్రస్తుత ఏపి ప్రభుత్వం టిటిడి ఆస్తులను వేలం వేస్తోందని చంద్రబాబు ఇంతవరకూ ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారు. రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు ద్వంద్వ ప్రమాణాలు పాటించడమే కాదు రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారు. మోసం, కుట్ర అన్నవి చంద్రబాబుకు మొదటి నుంచీ అలవాటే. ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టేందుకు ఆయన కుట్రలు పన్నుతున్నారు. వైవీ సుబ్బారెడ్డిని టిటిడి చైర్మన్‌ను చేయగానే ఆయన క్రిస్టియన్‌ అని దుష్ప్రచారం చేశారు. కానీ వైవి సుబ్బారెడ్డి హిందూ ధార్మిక వాది. నాకు బాగా తెలుసు. చంద్రబాబును ప్రజలు నిలదీయాలి. టిటిడి ఆస్తులను విక్రయించాలని ఎందుకు తీర్మానించారో చెప్పాలని కూడా ప్రశ్నించాలి. భానుప్రకాశ్‌రెడ్డినీ కూడా నిలదీయాలి. చంద్రబాబు వాస్తవాన్ని అంగీకరించి ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. విద్వేషాలు రెచ్చగొట్టే యత్నాలను మానుకోవాలి’’ అని హిత‌వు ప‌లికారు.

సిఎం జ‌గ‌న్ కు ధ‌న్య‌వాదాలు

‘‘టిటిడి ఆస్తులను వేలం వేయాలన్న చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నిలుపుదల చేయడం సంతోషకరం. అందుకు ఆయనకు ధన్యవాదాలు. వైఎస్‌ జగన్‌ అరుదైన రాజకీయ నేత. ఆయన మాట మీద నిలబడే వ్యక్తి. రాజకీయాల్లో నిజాయితీ, నిబద్ధత ఉన్న నేత. మంచి నాయకుడు మాత్రమే కాదు మంచి వ్యక్తి కూడా. టిటిడి ఆస్తులను వేలం వేయాలని చంద్రబాబు ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన ఆధారాలను ఆయన ప్రజల ముందుంచాలి. అంతేకాదు..చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేయాలి. టిటిడి ఆస్తుల అంశంపై సలహాలు, సూచనలివ్వాలని హిందూ ధార్మిక సంస్థలు, మత పెద్దలు, భక్తులను జగన్‌ కోరడం సరైన చర్య. ప్రభుత్వానికి నేనూ సలహాలిస్తాను. అలాగే.. అందరూ తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలి’’ అని అన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి