iDreamPost

రాజీవ్ గాంధీ హత్య నిందితుడు విడుదలపై కీలక ముందడుగు

రాజీవ్ గాంధీ హత్య నిందితుడు విడుదలపై కీలక ముందడుగు

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకేసులో ప్రధాననిందితుడు, 36 ఏళ్లుగా జైలుశిక్ష అనుభవిస్తున్న పెరారివాలన్‌ను ఎందుకు విడుదల చేయకూడదని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. నిందితుడిని విడుదల చేయకూడదు అనేందుకు కారణాలు తెలపాలని జస్టిస్ ఎల్.ఎన్.రావ్, జస్టిస్ బీ.ఆర్.గవాయి ఆధ్వర్యంలోని సుప్రీం బెంచ్ బుధవారం కేంద్రాన్ని కోరింది. పెరారివాలన్‌ను విడుదల చేయాలని కోరుతూ తమిళనాడు కేబినేట్ చేసిన తీర్మానాన్ని రాష్ట్ర గవర్నర్ ఆమోదించకుండా, రాష్ట్రపతికి పంపుతూ నిర్ణయం తీసుకోవడం రాజ్యాంగానికి వ్యతిరేకమని కోర్టు వ్యాఖ్యానించింది.

‘‘ఇరవై సంవత్సరాలు జైల్లో ఉన్న వాళ్లే విడుదల అవుతున్నారు. 36 ఏళ్లుగా జైలుశిక్ష అనుభవిస్తున్న వ్యక్తిని విడుదల చేయడానికి ఎందుకు అంగీకరించడం లేదు. తమిళనాడు కేబినెట్ నిర్ణయాన్ని అంగీకరించకుంటే గవర్నర్ ఆ ప్రతిపాదనను తిరిగి కేబినెట్‌కే పంపాలి. కానీ, రాష్ట్రపతికి పంపడం సరైన నిర్ణయం కాదు. అలా పంపేందుకు ఉన్న నిబంధనలేంటి? ఖైదీని విడుదల చేసే విషయంలో ఎవరు నిర్ణయం తీసుకోవాలి? రాష్ట్రపతా? గవర్నరా? మరణశిక్ష విషయంలోనే రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టొచ్చు’’ అని కోర్టు వ్యాఖ్యానించింది.

గవర్నర్ క్షమాభిక్ష పెట్టొచ్చా? లేదా? అనే అంశంపై త్వరలో నిర్ణయిస్తామని కోర్టు చెప్పింది. పెరారివాలన్ క్షమాభిక్ష విషయంలో సమాధానం చెప్పాలని కేంద్రానికి సూచించింది. రాజీవ్ హత్య విషయంలో పెరారివాలన్‌కు ముందుగా మరణ శిక్ష విధించింది కోర్టు. అయితే, 2014లో ఈ శిక్షను సుప్రీంకోర్టు యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. తర్వాత 2015లో తనను విడుదల చేయాలంటూ పెరారివాలన్ గవర్నర్‌ను కోరారు. అప్పట్నుంచి ఈ అంశం అనేక మలుపులు తిరుగుతూ ఉంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదన రాష్ట్రపతి దగ్గరకు చేరింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి